నాలుగు నెలల్లో రూ.25,000 వేల కోట్లను చెల్లించిన ఎయిర్టెల్
ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్టెల్ మరో రూ.8815 కోట్ల మేర స్పెక్ట్రం బకాయిలను ప్రభుత్వానికి చెల్లించింది. 2015లో వేలంలో పొందిన స్పెక్ట్రానికి సంబంధించిన ఈ మొత్తాన్ని 2027, 2028 వరకు చెల్లించే అవకాశముంది. అయినప్పటికీ ముందుగానే ఈ బకాయిలను చెల్లించినట్లు ఎయిర్ టెల్ ఓ ప్రకటనలో తెలిపింది.
వాయిదా వేసిన ఈ బకాయిలపై పది శాతం వడ్డీని చెల్లించవలసి ఉంటుంది. అందుకే వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం కోసం ఎయిర్ టెల్ ముందుగానే ఈ చెల్లింపులను చేస్తోందని నిపుణులు భావిస్తున్నారు. గత డిసెంబర్ నెలలో కూడా 2014 వేలంలో కొనుగోలు చేసిన స్పెక్ట్రంకు సంబంధించిన బకాయిలను రూ.15,519 కోట్లను ముందుగానే చెల్లించింది.
నాలుగు నెలల వ్యవధిలోనే ఎయిర్ టెల్ రూ.24,334 కోట్ల బకాయిలను చెల్లించడం గమనార్హం. తమ బకాయిలను FY2026-27 నుండి FY2031-32కి చెల్లించే వెసులుబాటు ఉంది. కానీ భారీ వడ్డీని తప్పించుకోవడానికి ముందుగానే చెల్లిస్తోంది.