AIతో భారత ఐటీకి ముప్పు? నువామా నివేదిక చెప్పింది వింటే షాక్!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల ఇండియన్ ఐటీకి ఇక కాలం చెల్లినట్టే అని చాలామంది ఆందోళన పడుతున్నారు. కానీ, AIతో భారత ఐటీ రంగం ఎలాంటి మార్పులు చూడబోతోందో నువామా రీసెర్చ్ సంస్థ పూసగుచ్చినట్లు వివరించింది.
AI వల్ల ఉద్యోగాలు పోతాయని, కొత్త అవకాశాలు తగ్గుతాయని, ఐటీ కంపెనీల ఆదాయం పడిపోతుందని, AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తుందని రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, ఇవన్నీ స్వల్పకాలిక ప్రభావాలేనని నివేదిక స్పష్టం చేస్తోంది.
మధ్యకాలిక, దీర్ఘకాలికంగా చూస్తే భారత ఐటీ రంగం మునుపెన్నడూ లేనంత భారీ వృద్ధిని సాధించబోతోంది. దీనివల్ల ఐటీ కంపెనీల షేర్లు నష్టాల నుంచి కోలుకోవడమే కాకుండా, భారీగా పెరిగే అవకాశం ఉందని నువామా రీసెర్చ్ సంస్థ తెలిపింది.

AI సహాయంతో కొన్ని కోడింగ్, టెస్టింగ్, సపోర్ట్, ఇతర టెక్నికల్ పనులను చాలా సులభంగా, క్షణాల్లో పూర్తి చేయవచ్చు. దీనివల్ల కంపెనీలకు ఎక్కువ మంది ఉద్యోగుల అవసరం ఉండకపోవచ్చు.
ఈ సమయంలో ఉద్యోగాల కోతలు ఉండొచ్చు. కానీ, ప్రతి కంపెనీ AI వాడకాన్ని చిన్న స్థాయిలో ప్రారంభించినా, దానిని పెద్ద ఎత్తున అమలు చేయడానికి, ప్రతి సంస్థలో AI వ్యవస్థను నిర్మించి, దాన్ని ఆచరణలోకి తీసుకురావడానికి ఐటీ సేవల సంస్థల పాత్ర చాలా కీలకం.
జెన్ AI రాకతో భారత ఐటీ సేవల కంపెనీలకు సుమారు 400 బిలియన్ డాలర్ల వ్యాపార అవకాశాలు రానున్నాయి. అంటే, దాదాపు రూ.38,13,600 కోట్ల విలువైన మార్కెట్ అందుబాటులోకి వస్తుందని నువామా రీసెర్చ్ అంచనా వేసింది.
ప్రతి కంపెనీ తమ వ్యాపారంలో AI సేవలను భాగం చేయాలనుకుంటే, తమ డిజిటల్ వ్యవస్థను AI కోసం పూర్తిగా పునర్వ్యవస్థీకరించుకోవాలి. ప్రస్తుత వ్యాపారానికి ఎలాంటి డేటా లీక్లు, అంతరాయాలు లేకుండా అనుసంధానించే AI ఫ్రేమ్వర్క్ను రూపొందించుకోవాలి.
ఈ పనులన్నీ సాధారణ టెక్ కంపెనీలతో సాధ్యం కాదు. ఈ రంగంలో ఏళ్ల తరబడి అనుభవం ఉన్న టెక్ దిగ్గజాలు మాత్రమే చేయగలవు. అందుకే, AI రంగం తదుపరి దశ వృద్ధికి భారత ఐటీ కంపెనీలే కీలకంగా మారనున్నాయి.
ఈ విషయాన్ని బలపరుస్తూ, 2027 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలోనే టీసీఎస్, హెచ్సీఎల్ వంటి అగ్రశ్రేణి ఐటీ కంపెనీలు AI రంగంలో భారీ వ్యాపారాన్ని దక్కించుకున్నాయి. దీనివల్ల రెండో త్రైమాసిక ఫలితాలు మరింత బలంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు.
రాబోయే కాలంలో గ్లోబల్ కంపెనీలు AI infrastructure, cloud computing, Software-as-a-Service (SaaS), Infrastructure-as-a-Service (IaaS), AI-agent technologies వంటి వాటిపై భారీగా పెట్టుబడులు పెడతాయని నువామా అంచనా వేస్తోంది. వీటిని లక్ష్యంగా చేసుకుని సేవలు అందించే కంపెనీలన్నీ ఈ AI యుగంలో భారీ వ్యాపారాన్ని పొందుతాయని భావిస్తున్నారు.
ఈ లెక్కన, 2030 నాటికి భారత ఐటీ కంపెనీలకు అందుబాటులో ఉండే మార్కెట్ విలువ 300 నుంచి 400 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా.


Click it and Unblock the Notifications