ఈ సారి వ్యవసాయ బడ్జెట్ ఎంతో తెలుసా.. అన్నదాతల కరువును మోదీ సర్కారు గుర్తిస్తుందా.
Agriculture Budget 2026: భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న వ్యవసాయ రంగం ప్రస్తుతం తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోంది. వాతావరణ మార్పుల ప్రభావం, అకాల వర్షాలు, ఎండల తీవ్రత, మార్కెట్ ధరల అస్థిరత ఇవన్నీ రైతు ఆదాయాలపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే కేంద్ర బడ్జెట్ 2026 వ్యవసాయాన్ని కేవలం జీవనాధార రంగంగా కాకుండా లాభసాటి, సుస్థిర రంగంగా మార్చే దిశగా కీలక నిర్ణయాలు తీసుకురావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈసారి బడ్జెట్ ప్రధానంగా సంప్రదాయ సాగు విధానాల నుంచి సాంకేతికత ఆధారిత 'స్మార్ట్ అగ్రికల్చర్' వైపు మార్పును లక్ష్యంగా పెట్టుకుంటుందని వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి.తాత్కాలిక సబ్సిడీలకు పరిమితమవకుండా ఉత్పాదకత, స్థిరత్వం, మార్కెట్ ఆధారిత వృద్ధి దిశగా వ్యవసాయాన్ని తీసుకెళ్లే విధాన నిర్ణయాలు ఈ బడ్జెట్లో కనిపించవచ్చని అంచనా వేస్తున్నారు.
గత దశాబ్దంలో వ్యవసాయానికి కేటాయింపులు గణనీయంగా పెరిగాయి. 2013-14లో రూ. 21,933 కోట్లుగా ఉన్న వ్యవసాయ బడ్జెట్.. ప్రస్తుతం రూ. 1.27 లక్షల కోట్లకు పైగా చేరింది. ఇది ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఆర్థిక వృద్ధికి కేంద్ర బిందువుగా చూస్తోందనే విషయాన్ని స్పష్టం చేస్తోంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈసారి బడ్జెట్లో సబ్సిడీ సంస్కరణలు, డిజిటల్ వ్యవసాయం,క్లైమేట్-రెసిలియంట్ పద్ధతులు, అలాగే కోల్డ్-చైన్ & ఫుడ్ ప్రాసెసింగ్ మౌలిక సదుపాయాలుప్రధాన ప్రాధాన్యతలుగా ఉండే అవకాశముంది. పశుపోషణ, మత్స్య సంపద, ఉద్యానవనాల వంటి అనుబంధ రంగాలపై దృష్టి పెట్టడం ద్వారా రైతుల ఆదాయాలను గణనీయంగా పెంచవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మారుతున్న వాతావరణ పరిస్థితులు పంట దిగుబడులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో, ప్రభుత్వం క్లైమేట్-రెసిలియెంట్ అగ్రికల్చర్ పై దృష్టి సారించనుందని సమాచారం.
కరువు, వరదలను తట్టుకునే అధునాతన విత్తనాల అభివృద్ధికి పరిశోధనా సంస్థలకు అదనపు నిధులు, సూక్ష్మ సేద్యం, డ్రిప్ ఇరిగేషన్ వంటి నీటి సంరక్షణ పద్ధతులకు సబ్సిడీలు, అలాగే సేంద్రియ సాగు ప్రోత్సాహం ద్వారా భూసారాన్ని కాపాడే విధానాలకు బడ్జెట్లో చోటు దక్కే అవకాశముంది.
వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల లోపమే రైతుల నష్టాలకు ప్రధాన కారణంగా మారుతోంది. దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వం ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (PPP) మోడల్ను మరింత బలోపేతం చేయాలని భావిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కోల్డ్ స్టోరేజ్లు, గిడ్డంగులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయడానికి ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించే విధానాలు బడ్జెట్లో ఉండవచ్చని అంచనా. అలాగే, రైతుల పంటను నేరుగా మార్కెట్కు చేర్చేలా రవాణా నెట్వర్క్ల ఆధునీకరణ కూడా కీలక అంశంగా మారనుంది.
వరి, గోధుమ వంటి సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా, రైతు ఆదాయాలను పెంచే హార్టికల్చర్, ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్యాల సాగు వైపు రైతులను ప్రోత్సహించాలన్నది ప్రభుత్వ ఆలోచన. తక్కువ నీటితో ఎక్కువ లాభం ఇచ్చే పంటలకు ప్రోత్సాహకాలు, ఎగుమతి ఆధారిత వ్యవసాయంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు బడ్జెట్లో ప్రతిబింబించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. దీంతో పాటుగా సాంకేతికతను రైతుకు చేరువ చేయడం బడ్జెట్ 2026లో మరో కీలక లక్ష్యంగా ఉండనుంది.
మొబైల్ యాప్లు, రియల్టైమ్ వాతావరణ సమాచారం, తెగుళ్ల హెచ్చరికలు, అలాగే పంటల ధరల అప్డేట్స్ను రైతులకు అందించేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్లను విస్తరించే అవకాశం ఉంది. దళారీ వ్యవస్థను తగ్గించేందుకు e-NAM వంటి డిజిటల్ మార్కెట్లను బలోపేతం చేయడం, రుణాలు, బీమా, పంట అంచనాలను పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేయడం ద్వారా రైతులకు సులభతరం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
INVasset PMS బిజినెస్ హెడ్ హర్షల్ దాసాని ప్రకారం.. వ్యవసాయ రంగంలో పెట్టుబడి దృష్టి ఇప్పుడు కేవలం బడ్జెట్ కేటాయింపులపై కాకుండా కంపెనీల బ్యాలెన్స్ షీట్ నాణ్యత, ఆదాయాల స్థిరత్వం వైపు మారుతోంది.ఎరువులు, అగ్రోకెమికల్స్, వ్యవసాయ యాంత్రీకరణ, నీటిపారుదల పరికరాలు, వ్యవసాయ లాజిస్టిక్స్కు సంబంధించిన కంపెనీలు పెట్టుబడిదారుల దృష్టిలో ఉన్నాయని ఆయన తెలిపారు. స్థిరమైన రుతుపవనాల అంచనా, గ్రామీణ రుణాల ప్రవాహం మెరుగుపడటం వంటి అంశాలు వ్యవసాయ రంగానికి అదనపు బలంగా మారవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద, ఈ బడ్జెట్ సబ్సిడీ ఆధారిత వ్యవసాయం నుంచి ఉత్పాదకత ఆధారిత వ్యవసాయానికి బహుళ-సంవత్సరాల మార్పును వేగవంతం చేయవచ్చని భావిస్తున్నారు.
బొనాంజా రీసెర్చ్ అనలిస్ట్ అభినవ్ తివారీ అంచనా ప్రకారం.. 2026-27లో వ్యవసాయ బడ్జెట్ రూ. 1.5 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉంది. PM-KISAN, ఫసల్ బీమా యోజన, కృషి సించాయి యోజన వంటి పథకాలకు అధిక నిధులు కేటాయించవచ్చు. అలాగే నకిలీ, తక్కువ నాణ్యత గల విత్తనాల విక్రయాన్ని అరికట్టే లక్ష్యంతో కొత్త విత్తనాల బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశముంది. ఇది రైతులకు భద్రత కల్పించడమే కాకుండా, నాణ్యమైన విత్తన కంపెనీలకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది.
UPL, PI ఇండస్ట్రీస్, బేయర్ క్రాప్సైన్స్, ధనుకా అగ్రిటెక్ వంటి కంపెనీలు ఉత్పాదకత ఆధారిత విధానాల వల్ల లాభపడే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్ వ్యవసాయ-ఆహార ఎగుమతులు ప్రస్తుతం USD 50-55 బిలియన్లు ఉన్నాయి. బడ్జెట్ 2026లో ఎగుమతి సులభతరం, విలువ ఆధారిత ఉత్పత్తులకు మద్దతు లభిస్తే, రైతులు, అగ్రి కంపెనీలకు ప్రపంచ మార్కెట్లలో కొత్త అవకాశాలు తెరుచుకోవచ్చు.


Click it and Unblock the Notifications