adani: హిండెన్ బర్గ్ ఉదంతం అనంతరం అదానీ గ్రూపు కంపెనీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనైన విషయం తెలిసిందే. ఈ నివేదిక వల్ల ఆ సంస్థలు ఇంటా, బయటా పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కొన్ని ప్రాజెక్టులు సైతం రద్దు చేసుకుంది. ఈ తరుణంలో పెట్టుబడిదారులకు అదానీ పోర్ట్స్ ఓ శుభవార్త చెప్పింది.
కారైకల్ పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ను కొనుగోలు చేసినట్లు అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ ప్రకటించింది. రూ.14.85 బిలియన్లకు ఈ డీల్ పూర్తి చేసినట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో తెలిపింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(NCLT) నుంచి అనుమతి పొందిన తర్వాతే దీనిపై ముందుకు వెళ్లినట్లు సమాచారం ఇచ్చింది.

కారైకల్ పోర్టు ఏప్రిల్ 2009లో ప్రారంభించబడింది. అన్నికాలాల్లో పనిచేయదగిన డీప్ వాటర్ పోర్టుల్లో ఇదొకటి. మొత్తం 6 వందల ఎకరాలలో విస్తరించి ఉన్న దీని ద్వారా.. బొగ్గు, చక్కెర, సిమెంట్, ఎరువులు, ఆగ్రో కమోడిటీస్, లిక్విడ్ కార్గో మరియు కంటైనర్ల వంటి వాటిని నిర్వహిస్తుంటారు. దివాలా కోడ్, 2016 ప్రకారం కారైకాల్ పోర్ట్ కోసం గతంలో బిడ్డింగ్ జరిగింది. అదానీ గ్రూప్ ఆఫర్ను రుణదాతలు డిసెంబర్లో ఆమోదించారు. అనంతరం తుది ఆమోదం కోసం NCLTకు సమర్పించారు.
2022-23 ఆర్థిక సంవత్సరంలో సుమారు 10 మిలియన్ టన్నుల కార్గోను కారైకాల్ పోర్ట్ నిర్వహించింది. ఈ పోర్టులో చెన్నైకి చెందిన మార్గ్ లిమిటెడ్ 45 శాతం.. అసెంట్ క్యాపిటల్ అడ్వైజర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, జాకబ్ బల్లాస్ క్యాపిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అఫిర్మా క్యాపిటల్ ఇండియా మరియు GIP ఇండియా సమిష్ఠిగా 44 శాతం వాటాలు కలిగి ఉన్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు చెందిన పలు పోర్టులు అదానీ గ్రూపు అధీనంలో ఉండగా.. ప్రస్తుతం జరిగిన డీల్ తో తూర్పు తీరంలో ఆ సంస్థ మరింత విస్తరించిందని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications