Adani: ప్రభుత్వానికే బొగ్గు సరఫరా చేయనున్న అదానీ..! అత్యల్ప బిడ్ దాఖలుతో..
Adani Coal Bid: భారత్, ఆసియాలో అతిపెద్ద సంపన్నుడు గౌతమ్ అదానీ మరో సంచలనాన్ని సృష్టించారు. దేశీయ పవర్ కంపెనీల కోసం ప్రభుత్వరంగ సంస్థ కోల్ ఇండియా విడుదల చేసిన మెుదటి ఇంపోర్ట్ టెండర్ ను అదానీ గ్రూప్ దక్కించుకుంది. దీని ద్వారా ఇకపై అదానీ గ్రూప్ భారత ప్రభుత్వానికి ఇతర దేశాల నుంచి బొగ్గును సరఫరా చేయనుంది. ఈ ప్రక్రియలో పాల్గొన్న అదానీ గ్రూప్కు చెందిన ఫ్లాగ్షిప్ కంపెనీ.. అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ అత్యల్ప బిడ్ దాఖలు చేసి విజేతగా నిలిచింది. విద్యుత్ ఉత్పత్తి కంపెనీల తరపున కోల్ ఇండియా ఈ టెండర్ ను జారీ చేసింది.
బిడ్డింగ్ ప్రక్రియ..
అదానీ ఎంటర్ప్రైజెస్ 24.16 లక్షల టన్నుల బొగ్గును రోడ్డు మార్గంలో సరఫరా చేయడానికి రూ. 4,033 కోట్ల బిడ్ను ఉంచింది. ఇదే సమయంలో మోహిత్ మినరల్స్ రూ.4,182 కోట్లకు, చెట్నాడ్ లాజిస్టిక్స్ రూ.4,222 కోట్లకు బిడ్ దాఖలు చేశాయి. ఈ బిడ్లను శుక్రవారం తెరిచారు. ఈ టెండర్ కింద దిగుమతి అయ్యే బొగ్గు ఏడు రాష్ట్రాలకు చెందిన విద్యుత్ ఉత్పత్తి కంపెనీలు, 19 ప్రైవేట్ విద్యుత్ ప్లాంట్లకు సరఫరా చేయబడుతుంది.
ఇప్పటికే ఎన్టీపీసీ నుంచి ఒప్పందాలు..
వివిధ కంపెనీల బిడ్లను సమీక్షిస్తున్నామని.. దీనికి కోల్ ఇండియా బోర్డు అనుమతి అవసరమని ప్రభుత్వ అధికారి ఒకరు దీనిపై స్పందించారు. కోల్ ఇండియా, అదానీ ఎంటర్ప్రైజెస్ ఇప్పటి వరకు ఈ వ్యవహారంపై స్పందించలేదు. అదానీ ఎంటర్ప్రైజెస్ జనవరి - జూన్ మధ్య కాలంలో NTPC నుంచి అనేక బొగ్గు దిగుమతి బిడ్లను గెలుచుకుంది.
అదానీ గ్రూప్ గత ఏడాది డిసెంబర్లో ఆస్ట్రేలియాలోని తమ గని నుంచి బొగ్గు ఆర్డర్ను తొలిసారిగా చేసింది. కోల్ ఇండియా కోసం అదానీ గ్రూప్ కూడా రెండు ఈ-టెండర్లపై దృష్టి సారిస్తోందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. వీటి ద్వారా మొత్తం 60 లక్షల టన్నుల బొగ్గు దిగుమతి చేసుకోవాల్సి ఉంది. ఇందుకోసం మంగళవారంలోగా బిడ్డింగ్ జరగాల్సి ఉంది.
విదేశీ కంపెనీలు కూడా..
కోల్ ఇండియా కోసం మొత్తం 11 కంపెనీలు, మరికొందరు విదేశీ వ్యాపారులు కూడా ఆసక్తి కనబరిచినట్లు ఇంతకుముందు తెలిపాయి. వర్షాకాలానికి ముందే సరిపడా బొగ్గు నిల్వలను స్టాక్ చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. కాబట్టి బొగ్గును వీలైనంత త్వరగా దిగుమతి చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
సరఫరా కొరత..
రుతుపవనాల కారణంగా బొగ్గు తవ్వకం దెబ్బతిని సరఫరాలో కొరత ఏర్పడింది. రుతుపవనాల తరువాత.. దేశంలో విద్యుత్ డిమాండ్ గరిష్ఠ స్థాయికి చేరుకుంది. వ్యవసాయ కార్యకలాపాలు ఊపందుకోవడం, వాతావరణంలో వేడి పెరగడం దీనికి కారణం. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ తాజా సమాచారం ప్రకారం.. థర్మల్ పవర్ ప్లాంట్లలో 26.80 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఈ ప్లాంట్లలో దిగుమతి చేసుకున్న బొగ్గును దేశీయ బొగ్గుతో కలిపి విద్యుత్ను ఉత్పత్తి చేయనున్నారు. అన్ని విద్యుత్ ప్లాంట్లు తమ బొగ్గు అవసరాల్లో 10 శాతం దిగుమతి చేసుకోవాలని ప్రభుత్వం కోరింది.