Adani News: హిండెన్ బర్గ్ సంచలన రిపోర్టు విడుదల చేసిన మూడు నెలల తర్వాత అదానీ మళ్లీ ట్రాక్ మీదకు వస్తున్నారు. వ్యాపార భవిష్యత్తు ప్లాన్లను వేగం పెంచే పనిలో ఉన్నారు.
అదానీ తన గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లేందుకు భారీగా నిధులను సమకూర్చుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఇందుకోసం అదానీ గ్రూప్ ఏకంగా 1 నుంచి 1.5 బిలియన్ డాలర్లను సమీకరించాలని నిర్ణయించింది. హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత ఇది అతిపెద్ద రుణ ప్రణాళిక.
గ్రీన్ ఎనర్జీకి అవసరమైన నిధులను సేకరించేందుకు కంపెనీ బృందం ఇటీవల సింగపూర్లో రోడ్షో నిర్వహించింది. ఆ తర్వాత హాంకాంగ్లో మరో రెండు రోజుల రోడ్షో నిర్వహించినట్లు సమాచారం. నిధుల సేకరణ కోసం ప్రపంచ ఆర్థిక సంస్థలతో మాట్లాడినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీనికోసం బీఎన్పి పరిబాస్, డిబిఎస్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, డ్యుయిష్ బ్యాంక్, ఐఎన్జి, మిత్సుబిషి యుఎఫ్జె ఫైనాన్షియల్ గ్రూప్, మిజువో వంటి 12 గ్లోబల్ బ్యాంకుల సహాయంతో సింగపూర్ సమావేశం జరిగిందని తెలుస్తోంది.

హిండెన్ బర్గ్ అదానీ గ్రూప్ వ్యాపారాలపై చేసిన అనేక ఆరోపణలతో గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా విలువ కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో అదానీ సైతం కొంత కాలం తన విస్తరణ ప్రణాళికలను పక్కనపెట్టి ఇన్వెస్టర్లలో ధైర్యం నింపేందుకు దాదాపు 2 బిలియన్ డాలర్ల రుణాలను గడువు కంటే ముందుగానే చెల్లించారు. కంపెనీలకు ఉన్న రుణ భారాన్ని తగ్గిస్తూ, తాకట్టులో ఉన్న గ్రూప్ కంపెనీల షేర్లకు చెల్లింపులు చేశారు.
గడని 5 ఏళ్ల కాలాన్ని పరిశీలిస్తే అదానీ అప్పులు ఏకంగా 27 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఈ క్రమంలో ఆస్తుల విలువ 60 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అయితే అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కంపెనీకి 2024లో చెల్లించాల్సిన 1.9 బిలియన్ డాలర్ల బాండ్స్ రుణం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే అదానీ మళ్లీ ఫామ్ లోకి వచ్చారని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications