Adani: అమెరికా సంస్థ హిండెన్ బర్గ్ ఆరోపణల అనంతరం అదానీ గ్రూపు కంపెనీలు తీవ్ర నష్టాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. అనంతరం పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని కలిగించడానికి తమ రుణభారాన్ని తగ్గించుకోవడానికి అడుగులు గ్రూపు వేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థల వద్ద కుదువ పెట్టిన షేర్లు, అప్పులను తిరిగి తీర్చగా.. తాజాగా మరో బిలియన్ డాలర్ల రుణాన్ని చెల్లించింది.
హోల్సిమ్ లిమిటెడ్ కు చెందిన భారతీయ యూనిట్ల కొనుగోలు కోసం గ్లోబల్ బ్యాంకుల నుంచి అదానీ సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 4.5 బిలియన్ డాలర్ల రుణాలు తీసుకుంది. దీనిలో బిలియన్ మొత్తాన్ని తిరిగి చెల్లించినట్లు కంపెనీ నివేదించబడింది. స్విట్జర్లాండ్ ఆధారిత హోల్సిమ్ వ్యాపారాలను 10.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు అదానీ సంస్థ గతంలో ఒక ఒప్పందం చేసుకుంది. అందుకోసం తీసుకున్న అప్పులో కొంత భాగాన్ని ఇప్పుడు తిరిగిచ్చింది.

బ్లూమ్ బర్గ్ నివేదిక ప్రకారం.. కంపెనీ గత వారం 200 మిలియన్ డాలర్ల రుణాన్ని ముందుగానే చెల్లించింది. ఇలా చేయడం వల్ల అదానీ గ్రూపు కొనుగోళ్ల కోసం తీసుకున్న రుణాన్ని మూడేళ్లపాటు పొడిగించాలని కోరే అవకాశం ఏర్పడుతుందని పేర్కొంది. ఈ రుణం మెచ్యూరిటీకి గడువు సెప్టెంబర్ 2024 వరకు ఉంది. ఇదే విధంగా గతంలోనూ సుమారు 2 బిలియన్ డాలర్ల షేర్-బ్యాక్డ్ లోన్లను గ్రూపు ముందస్తుగా చెల్లించింది, సమయానికి బాండ్ రీపేమెంట్లు చేసింది.
హోల్సిమ్ సిమెంట్ ఆస్తులను అంబుజా సిమెంట్స్ మరియు ACC స్వాధీనం చేసుకోవడం చారిత్రాత్మకమని గౌతమ్ అదానీ పేర్కొన్నారు. దీనికి నాలుగు కారణాలు ఉన్నట్లు చెప్పారు. ఈ డీల్ ద్వారా భారతదేశంలో రెండవ అతిపెద్ద సిమెంట్ తయారీదారుగా తమ కంపెనీలు అవతరించాయన్నారు. రెండు అత్యంత "ఐకానిక్" బ్రాండ్లను కలిగి ఉన్నట్లు తెలిపారు. దేశంలో అతిపెద్ద ఇన్బౌండ్ మెటీరియల్స్ స్పేస్ లావాదేవీగా అభివర్ణించారు. 4 నెలల రికార్డు సమయంలో పూర్తి చేసినట్లు గుర్తుచేశారు.


Click it and Unblock the Notifications