Rocket Stock: ప్రముఖ ఇన్వెస్టర్ పెట్టుబడి.. ఆంధ్రాలో యూనిట్.. రాకెట్ లా మారిన పేపర్ స్టాక్..
Rocket Stock: స్టాక్ మార్కెట్లో ప్రముఖ పెట్టుబడిదారులు కొత్త పెట్టుబడులు పెట్టడానికి ముందు చాలా రీసెర్చ్ చేస్తుంటారు. ఫ్యూచర్ గ్రోత్ ఓరియంటేషన్ వారికి చాలా కీలకమైన అంశం. అయితే అలా వారు ఎంపిక చేసుకున్న స్టాక్స్ అమాంతం రాకెట్ వేగంతో పెరిగిపోతుంటాయి. రైట్ టైంలో వీరిని ఫాలో అయ్యే కొందరు రిటైలర్స్ సైతం మంచి లాభాలనే ఆర్జిస్తున్నారు.
కంపెనీ వివరాలు..
ప్రముఖ ఇన్వెస్టర్ సచిన్ బన్సల్ తాజాగా ఒక పేపర్ కంపెనీని తన పెట్టుబడి కోసం ఎంచుకున్నారు. వెస్ట్ కోస్ట్ పేపర్ మిల్స్ లిమిటెడ్ కంపెనీకి చెందిన 18 లక్షల షేర్లను కొనుగోలు చేశారు. దీంతో కంపెనీలో ఆయనకు 2.73% వాటా ఉంది. బన్సాల్కు జేకే పేపర్ కంపెనీలో సైతం పెట్టుబడులు ఉన్నాయి. సచిన్ బన్సల్ మెుత్తం నాలుగు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టగా.. ఆయన పోర్ట్ఫోలియోలో ఇది రెండవ పేపర్ స్టాక్గా మారింది.
తాజాగానే కొనుగోలు..
సెప్టెంబర్ త్రైమాసికంలో బన్సాల్ వెస్ట్ కోస్ట్ పేపర్ మిల్స్ షేర్లను కొనుగోలు చేసినట్లు స్పష్టమవుతోంది. అయితే ఇవి ఒకేసారి బల్క్ గా కొన్నారా లేకు వివిధ దఫాలుగా కొన్నారా అనే విషయం తెలియరాలేదు. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.653.20 ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.215గా ఉంది. కంపెనీ షేర్లు అక్టోబర్ 21, 2022న BSEలో రూ.572.40 వద్ద ముగిసాయి.
రాబడులు ఇలా..
గడచిన రెండు సంవత్సరాల్లో ఈ పేపర్ స్టాక్ ఏకంగా 350 శాతం పెరిగి అద్భుతమైన రాబడిని అందించింది. ఈ క్రమంలో కంపెనీ షేర్లు రూ.124 నుంచి రూ.572 స్థాయికి చేరుకున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు కంపెనీ షేర్లు 149% రాబడిని అందించాయి. ప్రస్తుతం షేర్ తన 52 వారాల గరిష్ఠాలకు చాలా దగ్గరకు చేరుకుంది. కంపెనీ మార్కెట్ క్యాప్ గమనించినట్లయితే రూ.3,768.42 కోట్లుగా ఉంది.
కంపెనీ వ్యాపారం..
1955లో స్థాపించబడిన వెస్ట్ కోస్ట్ పేపర్ మిల్స్ కంపెనీ కోల్ కతా కేంద్రంగా వ్యాపారం చేస్తోంది. కంపెనీ తయారీ యూనిట్ కర్ణాటకలో ఉంది. కంపెనీ భారతదేశంలోని ప్రింటింగ్, రైటింగ్, పబ్లిషింగ్, స్టేషనరీ, నోట్బుక్స్, ప్యాకేజింగ్ రంగాల్లో అనేక పరిశ్రమల అవసరాలను తీర్చుతోంది. ఈ కంపెనీకి Andhra Pradesh Paper Mills Ltd సబ్సిడరీ కంపెనీగా ఉంది.