IT News: ఈ ఏడాది ఎక్కడ చూసినా లేఆఫ్ ల వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మందగమనం నేపథ్యంలో పలు దిగ్గజ కంపెనీలు సైతం ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ యాక్సెంచర్ సైతం తాజాగా ఈ జాబితాలోకి చేరింది.
ఈ విభాగాల్లో తొలగింపులు:
ఖర్చులను తగ్గించుకునే ప్రణాళికలో భాగంగా.. ప్రపంచవ్యాప్తంగా 19 వేల ఉద్యోగులను తొలగించనున్నట్లు యాక్సెంచర్ వెల్లడించింది. రాబోయే ఏడాదిన్నరలో ఈ తతంగం పూర్తి చేయడానికి కార్యాచరణను ప్రకటించింది. తద్వారా తన 7 లక్షల 38 వేల సిబ్బందిలో 2.5 శాతం కోత విధించనుంది. ఈ తొలగింపుల వల్ల కార్పొరేట్ సపోర్ట్ టీమ్ ఎక్కువగా ప్రభావితం కానున్నట్లు తెలుస్తోంది. HR, IT, ఫైనాన్స్, మార్కెటింగ్ విభాగాల ఉద్యోగులపైనా వేటు పడనున్నట్లు భావిస్తున్నారు.

UK సిబ్బందిపై భారీగా వేటు:
ఈ కోతల వల్ల UK ప్రభావితమవుతుందని కంపెనీ ధృవీకరించింది. కానీ వివిధ దేశాల్లో తొలగింపులు ఏవిధంగా ఉండనున్నాయో వెల్లడించడానికి నిరాకరించింది. యాక్సెంచర్ కు UKలో సుమారు 11 వేల మంది కార్మికులు ఉన్నారు. లండన్, మాంచెస్టర్, బర్మింగ్హామ్, న్యూకాజిల్, ఎడిన్బర్గ్, గ్లాస్గో, లీడ్స్ వంటి ప్రాంతాలు సహా దేశవ్యాప్తంగా కార్యాలయాలు ఉన్నాయి.
ఆదాయం బాగున్నా..
దాదాపు 1.5 బిలియన్ డాలర్లను ఆదా చేసే ప్రణాళికల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్యాలయాలను యాక్సెంచర్ మూసివేస్తోంది. ఇందులో దాదాపు 800 మిలియన్ డాలర్లను ఈ ఏడాది, మిగిలిన మొత్తాన్ని 2024లో మిగుల్చుకోవాలని చూస్తోంది. 2020లో కొవిడ్ ఉధృతంగా ఉన్న సమయంలోనూ UKలో దాదాపు 900 మందిని సంస్థ తొలిగించింది. అయితే త్రైమాసిక రాబడిలో కంపెనీ 5 శాతం పెరుగుదల నమోదు చేసింది. ముందుగా ఊహించిన దాని కంటే మెరుగైన ఆదాయాన్ని నివేదించిన తర్వాత సంస్థ కోతలను ప్రకటించడం గమనార్హం.


Click it and Unblock the Notifications