ఏసీ, ఫ్రిడ్జ్ మరింత భారం కావొచ్చు: రూ.2,000 వరకు పెరగనున్న ధరలు
ఈ వేసవి కాలంలో ఎయిర్ కండిషనర్-AC, ఫ్రిజ్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకో షాకింగ్! వివిధ కంపెనీలు వీటి ధరలు పెంచాలని నిర్ణయించాయి. రామెటీరియల్ ఖర్చులు, ధరలు పెరగడంతో ఉత్పత్తుల ధరలు పెంచేందుకు కంపనీలు నిర్ణయం తీసుకున్నాయి. అన్ని ధరలు పెరిగినందున తప్పనిసరి పరిస్థితుల్లో పెంచుతున్నట్లు చెబుతున్నాయి. ఏసీల ధరలు 4 శాతం నుండి 6 శాతం మేర పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రస్తుతం ఉన్న రూ.1500 నుండి రూ.2000 వరకు పెరగవచ్చు.
ఏసీ అమ్మకాలు ఇటీవల పుంజుకున్నాయి. వేసవి కాలం కాస్త ముందుగా ప్రారంభమైంది. అయితే ముడి సరుకు వ్యయాలు పెరగడంతో మరోసారి ఏసీల ధరలను సవరించే చాన్స్ ఉందని కంపెనీలు చెబుతున్నాయి. ఈ నెలలో లేదా ఏప్రిల్ నెలలో ధరలు పెరుగుతాయని చెబుతున్నారు. ఇప్పటికే పలు కంపెనీలు ఈ ఏడాది రెండుసార్లు ధరలు పెంచాయి.
లాక్డౌన్ కారణంగా గత ఏడాది ఏసీ ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావం పడింది. ప్రస్తుతం డిమాండ్ నెలకొనడంతో 2021లో కరోనా ముందుస్థాయికి అమ్మకాలు చేరుతాయని కంపెనీలు భావిస్తున్నాయి. భారత్లో ఏసీల పరిశ్రమ 70-75 లక్షల యూనిట్లుగా ఉంది. ఏప్రిల్ నెల నుండి టీవీల ధరలు కూడా పెరిగే అవకాశమున్న విషయం తెలిసిందే.