కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 8వ పే కమిషన్ నివేదికపై తాజా అప్డేట్..జీతాల పెంపు ఎప్పుడంటే..
8th Pay Commission Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల వేతన సవరణ కోసం ఏర్పాటు చేసిన 8వ వేతన సంఘం తన ప్రాథమిక విధుల్లో మరొక కీలక మైలురాయిని అధిగమించింది. కేంద్ర మంత్రిత్వ శాఖలు, వివిధ విభాగాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ ఉద్యోగుల అధికారిక సమాచారాన్ని సమర్పించడానికి కేటాయించిన గడువు అధికారికంగా ముగిసింది. సవరించిన నివేదికల రూపకల్పనకు అవసరమైన పరిపాలనా, ఆర్థిక గణాంకాలన్నీ ఇప్పుడు కమిషన్ వద్దకు చేరుకున్నాయి.
వివిధ విభాగాల విజ్ఞప్తి మేరకు ఈ సమాచారాన్ని పోర్టల్లో అప్లోడ్ చేసే గడువును జూన్ 30 నుండి జూలై 31 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఆ గడువు పూర్తవడంతో, వేతన సవరణ వల్ల ప్రభుత్వంపై పడే ఆర్థిక భారాన్ని, భవిష్యత్ వేతన నిర్మాణంలో తీసుకురావాల్సిన మార్పులను ఖచ్చితంగా లెక్కించేందుకు అవసరమైన పునాది ఏర్పడింది.

దత్తాంశ సేకరణ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో.. వేతన సంఘం ఇప్పుడు తదుపరి కీలక దశ అయిన భాగస్వామ్య సంప్రదింపులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల అసోసియేషన్లు, వివిధ ప్రభుత్వ సంస్థలతో కమిషన్ చర్చలు జరపనుంది. ఇప్పటికే ఢిల్లీలో ప్రాథమిక సమావేశాలు ఖరారు కాగా.. తమ దేశవ్యాప్త పర్యటనలో భాగంగా చెన్నై, పుదుచ్చేరి, చండీగఢ్ తదితర ప్రాంతాలలో నేరుగా ఉద్యోగ ప్రతినిధుల అభిప్రాయాలను సేకరించనుంది.
వేతన సంఘానికి సమర్పించిన వినతిపత్రాలలో ఉద్యోగ సంఘాలు కొన్ని కీలక డిమాండ్లను ఉంచాయి. ప్రధానంగా వేతన నిర్ణయంలో అధిక ఫిట్మెంట్ ఫ్యాక్టర్ వర్తింపజేయడం, కరువు భత్యం లెక్కింపు ఫార్ములాలో మార్పులు చేయడం, పన్ను ఉపశమనం కల్పించడం, అలవెన్సుల సవరణ, పింఛనుదారులకు అదనపు ప్రయోజనాలు అందించడం వంటి అంశాలను ప్రస్తావించాయి.
అయితే డేటా సేకరణ పూర్తయినప్పటికీ, సవరించిన జీతాలు, పింఛన్లు అమల్లోకి రావడానికి మరికొంత సమయం పట్టనుంది. కమిషన్ ముందుగా వేలాది పేజీల ఆర్థిక వివరాలను నిశితంగా పరిశీలించి, భాగస్వాముల విజ్ఞప్తులను విన్న తర్వాత తన తుది సిఫార్సుల నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఆ సిఫార్సులను సమీక్షించి.. ఆమోదించిన తర్వాత మాత్రమే కొత్త జీతాలు అందుబాటులోకి వస్తాయి. తుది నివేదిక సమర్పణకు అధికారిక తేదీని ప్రకటించకపోయినప్పటికీ, రాబోయే నెలల్లో ఈ ముసాయిదా ప్రక్రియ వేగవంతం కానుంది.
ఇక 8వ వేతన సంఘం (8th Pay Commission) అమలుపై ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త అందే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రెండుసార్లు జనవరి, జులై నెలలకు డియర్నెస్ అలవెన్స్ (DA)ను సవరిస్తుండగా, ఈసారి కూడా DA పెంపు ప్రకటించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.
ఆల్ ఇండియా కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ (AICPI-IW) గణాంకాల ఆధారంగా డియర్నెస్ అలవెన్స్ను నిర్ణయిస్తారు. తాజా గణాంకాల ప్రకారం ఈసారి DAను 3 శాతం పెంచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో ప్రస్తుతం 60 శాతంగా ఉన్న డియర్నెస్ అలవెన్స్ 63 శాతానికి చేరే అవకాశం ఉంది.
అయితే ఈ పెంపు అధికారికంగా అమలులోకి రావాలంటే కేంద్ర మంత్రివర్గం (క్యాబినెట్) ఆమోదం తప్పనిసరి. క్యాబినెట్ గ్రీన్సిగ్నల్ ఇచ్చిన వెంటనే పెరిగిన DA అమల్లోకి రానుండగా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు దీని ప్రయోజనం లభించనుంది.
ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు
వేతన సంఘానికి సమర్పించిన వినతిపత్రాలలో ఉద్యోగ సంఘాలు కొన్ని కీలక డిమాండ్లను ఉంచాయి. అవేంటంటే..
వేతన నిర్ణయంలో అధిక ఫిట్మెంట్ ఫ్యాక్టర్ (Fitment Factor) వర్తింపజేయడం.
కరువు భత్యం (DA) లెక్కింపు ఫార్ములాలో మార్పులు మరియు పన్ను ఉపశమనం.
అలవెన్సుల సవరణ మరియు పింఛనుదారులకు అదనపు ప్రయోజనాలు.


Click it and Unblock the Notifications
