IT Jobs: టెక్కీల నోట అదే మాట.. 88% మంది చెప్పిన మాట అదే.. తాజా సర్వేలో నోరు విప్పిన ఉద్యోగులు..
IT Jobs: ప్రస్తుతం జాబ్స్ ఇచ్చేవారి కంటే చేసే వారి డిమాండ్స్ ఎక్కువయ్యాయి. ఈ మాట టెక్కీలకు అక్షరాలా సూట్ అవుతుంది. వారు ఒకేసారి రెండు మూడు ఉద్యోగాలు చేయటంతో కంపెనీలు విసిగిపోయి ఆఫీసులకు తిరిగి వచ్చేయమని తేల్చి చెబుతున్నాయి. ఈ వివాదం కొనసాగుతుండగా.. స్టాఫింగ్ సర్వీసెస్ సంస్థ సీఐఈఎల్ హెచ్ఆర్ సర్వీసెస్ ఓ సర్వే చేసింది.
ఫ్లెక్సిబిలిటీ ఇలా..
టాప్ టెక్ కంపెనీలైన టీసీఎస్, విప్రో, హెచ్సీఎల్ మాత్రం ఆఫీసులకు రావాల్సిందేనని తేల్చిచెప్పగా.. ప్రస్తుతం ఇన్ఫోసిస్ మాత్రమే ఫ్లెక్సిబిలిటీని అందిస్తోంది. ఈ క్రమంలో నిర్వహించిన సర్వేలో టెక్కీలు షాకింగ్ విషయాలను వెల్లడించారు.
కంపెనీలు మారతామంటూ..
తమకు తగిన ప్రయోజనాలు, సౌకర్యాలను అందించే కంపెనీలకు మారతామని టెక్కీలు తేల్చి చెప్పారు. అయితే ఆఫీసులకు రావాలని కంపెనీలు కంపల్షన్ చేయటంతో.. వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని ఆఫర్ చేస్తున్న కంపెనీలకు మారటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది.
19 ఐటీ కంపెనీలు..
దేశంలోని టాప్- 19 ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న 1000 మందికి పైగా టెక్కీలను ప్రశ్నించగా 88 శాతం మంది జాబ్ వీడటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సర్వేలో పాల్గోన్ని వారిలో 46 శాతం మంది తమ కంపెనీ తమను ఆఫీసుకు రమ్మని బలవంతం చేసినట్లు తెలిపారు. మరో 46 శాతం మంది ఎక్కువ జీతం ఇచ్చే ఉద్యోగాలకు మారాలనుకుంటున్నట్లు చెప్పారు. మిగిలిన 8 శాతం మంది ట్రాఫిక్, ఆఫీసులో వినోదం వంటి ఇతర విషయాలను కారణాలుగా చెప్పారు.
ఎక్కువ మంది మహిళలే..
జాబ్ మారాలనుకుంటున్న వారిలో ఎక్కువ మంది వర్కింగ్ తల్లులు ఉన్నారు. పిల్లల పర్యవేక్షణకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌలభ్యాన్ని అందిస్తున్న కంపెనీలను వారు ఎక్కువగా ఆశ్రయిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. అయితే ప్రస్తుత పరిస్థితిలో వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం రాజీనామా చేయడం జాబ్ మార్కెట్లో లాభదాయకం కాదని హెచ్ఆర్ కంపెనీలు చెబుతున్నాయి.
తగ్గిపోయిన నియామకాలు..
మందగమనం ఆవరించిన తరుణంలో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోలు జూలై-సెప్టెంబర్ మధ్య కాలంలో నియామకాలను భారీగా తగ్గించాయి. బెంగళూరు కేంద్రంగా పనిచేసే విప్రో 94.7 శాతం నియామకాలను తగ్గించింది. టాప్ టెక్ కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరంలో మెుత్తం 1.6 లక్షల మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని నిర్ధేశించుకున్నాయి.