అర్హులకే రేషన్.. ఏకంగా 7.7 లక్షల రేషన్ కార్డులు రద్దు.. మీ కార్డు సేఫ్గా ఉందో లేదో చూసుకోండి!
పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (PDS) లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, అనర్హులుగా ఉన్న సుమారు 7.72 లక్షల రేషన్ కార్డులు (ration cards) ను రద్దు చేసినట్లు ముఖ్యమంత్రి రేఖా గుప్తా అధికారికంగా ప్రకటించారు. రేషన్ పంపిణీ వ్యవస్థపై నిర్వహించిన ప్రత్యేక ఆడిట్లో ఈ షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అయితే ఈ రద్దు వల్ల ఏర్పడిన ఖాళీల ఆధారంగా.. నిజమైన పేదలకు మేలు చేసేందుకు కొత్త రేషన్ కార్డుల కోసం ఆన్లైన్ అప్లికేషన్లను ప్రభుత్వం ప్రారంభించింది.

ఆ 7.7 లక్షల కార్డులు ఎందుకు రద్దయ్యాయి?
ప్రభుత్వం చేసిన పూర్తిస్థాయి ఆడిట్లో దాదాపు 7,71,384 మంది అర్హత లేని, బోగస్ లబ్ధిదారులను గుర్తించారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి..
- ఆదాయ పరిమితి దాటినవారు: రద్దయిన కార్డుల్లో అత్యధికంగా 6,46,123 మంది నిర్దేశిత ఆదాయ పరిమితి కంటే ఎక్కువ సంపాదిస్తున్నట్లు తేలింది.
- ఏడాదిగా రేషన్ తీసుకోనివారు: దాదాపు 95,682 మంది లబ్ధిదారులు గత ఒక సంవత్సరం నుండి అసలు రేషనే తీసుకోలేదు.
- చనిపోయిన వారి పేరిట: సుమారు 6,185 మంది చనిపోయినప్పటికీ, వారి రికార్డులపై ఇంకా రేషన్ డ్రా చేస్తూనే ఉన్నారు.
- రెండు చోట్ల లబ్ధి: మరో 23,394 మంది లబ్ధిదారులు వేర్వేరు ప్రాంతాల నుండి రెండు బహుళ కార్డుల ద్వారా లబ్ధి పొందుతున్నారు.
కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి గుడ్ న్యూస్!
ఢిల్లీలో గత 13 ఏళ్లుగా కొత్తగా ఎలాంటి రేషన్ కార్డులు (ration cards) జారీ చేయలేదు. కానీ, ఇప్పుడు బోగస్ కార్డుల ఏరివేత తర్వాత కొత్త కార్డుల జారీకి మార్గం సుగమమైంది. మే 15 నుండి 'e-District' పోర్టల్ ద్వారా కొత్త కార్డుల కోసం, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ పేర్లను యాడ్ చేయడం కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
దీనితో పాటు, ప్రభుత్వం పేద కుటుంబాలకు మరింత ఊరటనిచ్చేలా ఒక కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఇప్పటివరకు రేషన్ కార్డు పొందడానికి ఉన్న వార్షిక కుటుంబ ఆదాయ పరిమితిని రూ.1 లక్ష నుండి రూ.1.20 లక్షలకు పెంచిన ప్రభుత్వం.. దీనిని మరింతగా రూ.2.50 లక్షలకు పెంచాలని యోచిస్తోంది. దీనివల్ల మధ్యతరగతి, దిగువ మధ్యతరగతికి చెందిన మరిన్ని పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయి. ఈ ప్రతిపాదన త్వరలోనే జరగబోయే క్యాబినెట్ సమావేశంలో ఆమోదం పొందే అవకాశం ఉంది.
కొత్త కార్డుకు ఈ డాక్యుమెంట్లు ఉండాలి..
రేషన్ పంపిణీ వ్యవస్థను పూర్తి ఆధునీకరించే పనిలో పడింది ప్రభుత్వం. కొత్తగా అప్లై చేసుకునే వారు లేదా వెరిఫికేషన్ చేయించుకునే వారు ఖచ్చితంగా ఐడెంటిటీ ప్రూఫ్, నివాస ధృవీకరణ పత్రం (Proof of Residence) , లేటెస్ట్ ఆదాయ ధృవీకరణ పత్రాన్ని (Income Certificate) సమర్పించాల్సి ఉంటుంది. దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి బోగస్ కార్డులకు తావులేకుండా పారదర్శకంగా రేషన్ అందుతుందని సీఎం స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications