ఈ ఒక్కసారికి అమ్మఒడిపై జగన్ ప్రభుత్వం శుభవార్త! వారికి రీవెరిఫికేషన్
అమరావతి: అమ్మఒడి పథకంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతానికి స్వల్ప ఊరటని కల్పించింది. అయితే ఇది ఒక్కసారికి మాత్రమే వర్తిస్తుంది. అమ్మఒడికి ఉన్న అర్హతల్లో ఏడాదిలో 75 శాతం అటెండెన్స్ ఉండాలి. అయితే ఈ పథకాన్ని ఇప్పుడే తీసుకు వస్తున్నందున, ప్రజల్లో అవగాహన లేనందున ఈ అర్హత నుంచి ఈసారికి మినహాయింపు ఇస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి మాత్రం ఇది తప్పనిసరి.
అమ్మఒడి స్కీం అర్హత, చెక్కు సంబంధించిన కథనాలు

75 శాతం ఇప్పటికి మినహాయింపు.. వచ్చే ఏడాది తప్పనిసరి
అమ్మఒడి పథకంలో 75 శాతం హాజరు నిబంధనకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. హాజరుతో సంబంధం లేకుండా అర్హులైన వారందరికీ అమ్మఒడి పథకం కింద ఆర్థిక సాయాన్ని అందించనుంది. మొదటి ఏడాది స్ఫూర్తి నింపేందుకు హాజరు నిబంధన నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. వచ్చే ఏడాది నుంచి మాత్రం 75 శాతం హాజరు తప్పనిసరి అని అధికారులను ఆదేశించారు.

అనాథ పిల్లల విషయంలో....
అనాథ పిల్లల విషయంలోను అమ్మఒడి పథకానికి స్పష్టత ఇచ్చారు. ఇందులో సగం డబ్బు అనాథాశ్రమానికి, మిగతా సగం పిల్లల పేరుపై డిపాజిట్ చేయాలని జగన్ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 61,344 మంది పిల్లల అడ్రస్లు సరిగాలేవని, కొంత సమయం కావాలని అధికారులు కోరగా, ఆయన పరిశీలన పూర్తి చేయాలని సూచించారు.

300 యూనిట్ల విద్యుత్పై...
అమ్మఒడి పథకం అర్హతకు 300 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగించవద్దు. అయితే లక్షలాది పిల్లల కుటుంబాల్లో ఈ పరిధి దాటుతున్నప్పటికీ ఇందులో ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. అయితే మళ్లీ రీవెరిఫికేషన్ చేసి, అర్హులైన వారికి వర్తింప చేయాలని సూచించారు.

వారికీ రీవెరిఫికేషన్
వెబ్ ల్యాండ్ రికార్డుల్లో తప్పుల కారణంగా భూమిలేని కొందరికి భూములు ఉన్నట్లుగా చూపిస్తోందని, దీనిపై ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిని కూడా పరిశీలించి అర్హులైన వారికి ఇవ్వాలని జగన్ అధికారులను ఆదేశించారు. ఈ కేటగిరీల కింద లక్షకు పైగా మంది విద్యార్థులు ఉన్నారు.


Click it and Unblock the Notifications