Hyderabad: భారత్లో ఆన్లైన్ మోసాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ప్రతిరోజూ సైబర్ నేరగాళ్లు లక్షలు, కోట్లు కొల్లగొడుతున్నారు.
అయితే తాజాగా హైదరాబాద్ నగరంలో రూ.700 కోట్ల భారీ మోసం బయటపడింది. పైగా దీని వెనుక ఉగ్రవాద సంస్థలతో లింకులు ఉన్నట్లు వెల్లడికావటం అందరినీ విస్మయానికి కలిగిస్తోంది. లెబనాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లాతో సంబంధం ఉన్న చైనీయులు.. భారతదేశంలో రూ.700 కోట్ల పెట్టుబడులు, పార్ట్టైమ్ జాబ్స్ పేరుతో భారీ స్కామ్ చేసినట్లు హైదరాబాద్ పోలీస్ సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు.

తీవ్రవాద సంస్థలకు క్రిప్టోల రూపంలో డబ్బు తరలిస్తున్నట్లు ఆరోపణల నేపథ్యంలో ఉగ్రవాద గ్రూపు వాలెట్లో బ్లాక్ చేసినట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు. అలాగే యూట్యూబ్ వీడియోని లైక్ చేయడం, గూగుల్ రివ్యూ రాయడం వంటి చాలా సింపుల్ పనుల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇస్తున్నట్లు ఇటీవల పెద్ద స్కామ్లు జరుగుతున్నాయి. ఈ మాయగాళ్ల వలలో చిక్కుకున్న శివకుమార్ అనే హైదరాబాదీ ఏప్రిల్ లో ఏకంగా రూ.28 లక్షలు పోగొట్టుకున్నాడు. అతని ఫిర్యాదుతో అసలు విషయం బయటపడింది.
48 బోగస్ కంపెనీల పేరుతో బ్యాంక్ ఖాతాలను నిర్వహిస్తూ నిందితులు రూ.584 కోట్లను దోచుకున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇందులో భాగం ఉన్న మెుత్తం 9 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో హైదరాబాద్కు చెందిన మహ్మద్ మునవర్, అరుల్ దాస్, షమీర్ ఖాన్, షా సుమైర్ అనే నలుగురు వ్యక్తులు ఉన్నారు. అలాగే నకిలీ ఖాతాలు తెరిచినవారికి రూ.2 లక్షలు ఇచ్చినట్లు తేలింది. తదుపరి విచారణలో 61 బ్యాంకు ఖాతాలు, 33 నకిలీ కంపెనీలు ఉన్నాయని తేలింది, వీటిలో అదనంగా 128 కోట్ల రూపాయలు దొరికాయి.
నిందితులు దీనిని దుబాయ్ కేంద్రంగా నడుపుతున్నట్లు డబ్బు బదిలీ కోసం ఐపీ అడ్రస్ ద్వారా వెల్లడైంది. గుజరాత్ కు చెందిన ప్రకాష్ ప్రజాపతి అనే ప్రధాన నిందితుడు చైనా వ్యక్తులతో కలిసి నేరుగా పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. భారతీయ ఖాతా నుంచి కొన్ని క్రిప్టో వాలెట్కు నిధులు బదిలీ అయ్యాయని వెల్లడైంది. ఈ క్రిప్టో ఖాతా లెబనాన్ ఆధారిత టెర్రరిస్టు గ్రూప్ హిజ్బుల్లాకు చెందినదిగా తేలింది. అరెస్టయిన వారిలో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన వారు కావడం గమనార్హం.


Click it and Unblock the Notifications