Jan Dhan పథకానికి ఏడేళ్లు: ఎన్నో బెనిఫిట్స్: లక్షన్నర కోట్లు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి జన్ధన్ యోజన.. దేశ ప్రజలందరికీ సుపరిచితమైన పేరు ఇది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ తొలి విడత సంకీర్ణ ప్రభుత్వం అమలు చేసిన కొన్ని కీలకమైన పథకాల్లో ఇదీ ఒకటి. దిగువ మధ్య తరగతి, పేద కుటుంబాలకు చెందిన వారు జీరో బ్యాలెన్స్తో బ్యాంకుల్లో అకౌంట్లను తెరవడానికి ఉద్దేశించిన స్కీమ్. ఒకరకంగా నరేంద్ర మోడీ మానస పుత్రికగా దీన్ని చెప్పుకోవచ్చు. జన్ ధన్ యోజనను మోడీ బ్రెయిన్ ఛైల్డ్గా అభివర్ణిస్తుంటారు.

బ్యాంకింగ్ సెక్టార్ పరిధిలోకి కోట్లమంది..
కోట్లాదిమంది దేశ ప్రజలను బ్యాంకింగ్ సెక్టార్ పరిధిలోకి తీసుకొచ్చిన ఒకే ఒక్క వ్యవస్థ ఇది. అప్పటిదాకా బ్యాంకుల గురించి పెద్దగా తెలియని, పరిచయం లేని పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు కోట్లాదిమంది ఈ పథకం కింద జీరో బ్యాలెన్స్తో అకౌంట్లను ఓపెన్ చేసుకున్నారు. అప్పటిదాకా బ్యాంకింగ్ సెక్టార్ అంటే- అదేదో గొప్పవాళ్లకు చెందినదనే అభిప్రాయం ఉండేది పేదల ప్రజల్లో. దాన్ని తుడిచి పెట్టేసింది ఈ పథకం.

1,46,231 కోట్లు డిపాజిట..
అలాంటి కీలకమైన ఈ పథకం శనివారం నాటితో ఏడు సంవత్సరాలను పూర్తి చేసుకుంటోంది. ఏడేళ్ల కిందట సరిగ్గా ఇదే రోజు ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం అమల్లోకి వచ్చింది. ఈ ఏడు సంవత్సరాల వ్యవధిలో 43 కోట్ల 04 లక్షల మంది ప్రజలు బ్యాంకుల్లో తమ అకౌంట్లను తెరచుకున్నారు. ఇదో రికార్డు. జన్ ధన్ పథకం అమలు కావడానికి ముందు ఇన్ని కోట్ల మంది ప్రజలకు బ్యాంకుల్లో అకౌంట్లు లేవన్న మాటే. ఈ 43 కోట్ల మంది ఈ ఏడు సంవత్సరాల్లో తమ అకౌంట్లలో 1,46,231 కోట్ల రూపాయలను డిపాజిట్ చేసుకున్నారు.

అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే..
జన్ ధన్ పథకం ప్రారంభమై ఏడు సంవత్సరాలయిన సందర్భంగా ఈ గణాంకాలన్నింటినీ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన తొలి సంవత్సరంలోనే ఈ పథకం అమల్లోకి వచ్చింది. దేశ ప్రజల సంక్షేమం, వారికి ఆర్థిక పరిపుష్టిని కలిగించడానికి జన్ ధన్ పథకాన్ని అమలు చేస్తామని 2014 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రెడ్ ఫోర్ట్ వేదికగా నరేంద్ర మోడీ ప్రకటించారు.

ప్రధాని ఆశయాలకు అనుగుణంగా..
అదే సంవత్సరం ఆగస్టు 28వ తేదీన ఈ పథకం కార్యరూపంలోకి వచ్చింది. దేశవ్యాప్తంగా అమలు అయింది. ఏడేళ్లు పూర్తి చేసుకుంటోన్న సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్మల సీతారామన్, ఆ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవంత్ కృష్ణారావు కరద్ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రధాని మోడీ అకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా ఈ పథకాన్ని అమలు చేశామని, ఆది తన లక్ష్యాన్ని అందుకుందని అన్నారు.
లాక్డౌన్ సమయంలో డీబీటీ..
ఈ ఏడు సంవత్సరాల కాల వ్యవధిలో 43 కోట్ల మందికి పైగా దేశ ప్రజలు బ్యాంకింగ్ సెక్టార్ పరిధిలోకి వచ్చారని, తమ అకౌంట్లలో 1,46,231 కోట్ల రూపాయలను డిపాజిట్ చేసుకున్నారని అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న సమయంలో తమ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ఈ అకౌంట్ల ద్వారా నేరుగా లబ్దిదారులకు అందాయని చెప్పారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద 30,945 కోట్ల రూపాయలను మహిళల కోసం జన్ ధన్ అకౌంట్లలో డిపాజిట్ చేశామని అన్నారు.


Click it and Unblock the Notifications