5G యుద్ధానికి మరోసారి సిద్ధమైన అంబానీ-మిట్టల్.. జియో, ఎయిర్టెల్లో నెగ్గేదెవరు..?
Ambani-Mittal: వినియోగదారులను నెమ్మదిగా 4జీ నుంచి 5జీకి ఆకర్షించాలని టెలికాం కంపెనీలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో 4జీ సేవల స్పీడ్ తగ్గించాయని కొందరు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. వాస్తవంగా కొన్ని ప్రాంతాల్లో జియో స్పీడ్ దారుణంగా పడిపోవటం దీనిని బలపరుస్తోందని తెలుస్తోంది.
డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ 2024 జనవరి-ఫిబ్రవరిలో మరోసారి 5జీ స్పెక్ట్రమ్ వేలం వేయాలని నిర్ణయించటం పరోక్షంగా జియో అంబానీ, మిట్టల్ ఎయిల్ టెల్ మధ్య పోటీని రేకెతిస్తోంది. దీని బేస్ ధర రూ.2.5 ట్రిలియన్లుగా ఉంది. వేలంలో 37 GHz బ్యాండ్ల కంటే ఎక్కువ స్పెక్ట్రమ్ను కూడా ప్రవేశపెట్టవచ్చని సమాచారం. 600 MHz నుంచి 37 GHz కంటే ఎక్కువ 11 బ్యాండ్లలో ఎయిర్వేవ్లను ఈసారి అమ్మకానికి ఉంచే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రభుత్వం ప్రకారం దాదాపు 88,000 MHz స్పెక్ట్రమ్ 37 GHz కంటే ఎక్కువ బ్యాండ్లలో అందుబాటులో ఉంది. దీనికి తోడు గతసారి వేలంలో అమ్ముడు కాకుండా మిగిలిపోయిన స్పెక్ట్రమ్లన్నీ మళ్లీ అమ్మకానికి పెట్టబడతాయి. 2024లో గడువు ముగిసే బ్యాండ్విడ్త్ కూడా వేలం వేయనున్నారు. వీటికి సంబంధించిన ధరలను త్వరలోనే డీఓటీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం సమాచారం ప్రకారం వేలంలో భారీగా పోటీ రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ మధ్యనే ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నాయి. ఇదే సమయంలో వొడాఫోన్ ఐడియా బోర్డులోకి కుమార మంగళం బిర్లా తిరిగి చేరటం కంపెనీలో కొత్త ఆశలను చిగురింప చేస్తోంది. రానున్న కాలంలో వి యూజర్లకు మరింత మెరుగైన సేవలను అందించవచ్చని తెలుస్తోంది.