జీఎస్టీ స్లాబ్ 5 నుంచి 6 శాతానికి పెంచే ఛాన్స్, స్వల్పంగా పెరగనున్న ధరలు
గత కొన్నాళ్లుగా కేంద్ర ప్రభుత్వానికి రెవెన్యూ లోటు తగ్గుతోంది. దీంతో ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా జీఎస్టీని పునర్వ్యవస్థీకరించి పన్ను రేటును పెంచాలనే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న 5 శాతం స్లాబును 6 శాతానికి పెంచే అవకాశముందని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
ఆదాయం రూ.1000 కోట్లు పెరగవచ్చు
ప్రస్తుతం జీఎస్టీలో 5 శాతం,12 శాతం, 18 శాతం, 28 శాతం పన్ను స్లాబులున్నాయి. ఇందులో 5% స్లాబు రేటును ఆరు శాతానికి పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది. ఈ పెంపు అమలైతే ప్రభుత్వానికి జీఎస్టీ ఆదాయం నెలకు రూ.1,000 కోట్ల వరకు పెరగవచ్చునని అంచనా.
ఈ నెల 18వ తేదీన జీఎస్టీ కౌన్సెల్ సమావేశం కానుంది. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలు లేకపోలేదు.
నిత్యావసరాల ధరలు స్వల్పంగా పెరిగే ఛాన్స్
5 శాతం స్లాబ్ను ఆరు శాతానికి పెంచితే నిత్యావసరాల ధరలు స్వల్పంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆహార ఉత్పత్తులు, పాదరక్షలు, వస్త్రాలు వంటి సామాన్యులు ఉపయోగించే వివిధ వస్తువులు చాలా వరకు ఈ స్లాబ్లోకి వస్తాయి. 2017 జూలై 1వ తేదీ నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి 28 శాతం నుంచి స్లాబుల్లోని చాలా వస్తువులపై పన్ను తగ్గించి వాటిని తక్కువ స్లాబుల్లోకి మార్చారు.
తగ్గింపు.. రెవెన్యూ పెంచుకునే ప్రయత్నాలు
సామాన్యులకు అందుబాటులో ఉండేలా జీఎస్టీ రేట్లను మోడీ ప్రభుత్వం ఎప్పటికి అప్పుడు తగ్గిస్తోంది. దీంతో గత కొంతకాలంగా జీఎస్టీ రెవెన్యూ తగ్గుతోంది. ఈ నేపథ్యంలో రెవెన్యూను పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. గత నాలుగు నెలల పాటు తగ్గిన జీఎస్టీ వసూళ్లు నవంబర్ నెలలో మాత్రం రూ.1 లక్ష కోట్లకు పైగా పెరిగాయి.
5 శాతం స్లాబ్ ద్వారా
ప్రభుత్వానికి వచ్చే మొత్తం జీఎస్టీ ఆదాయంలో 5% స్లాబ్ ద్వారా సమకూరే వాటా 5% మాత్రమే. నెలవారీ జీఎస్టీ వసూళ్లను రూ.1.20 లక్షల కోట్ల స్థాయికి పెంచాలనేది ప్రభుత్వ లక్ష్యం. కానీ, సెప్టెంబరులో జీఎస్టీ ఆదాయం 19 నెలల కనిష్ఠానికి చేరుకుంది. ఆ నెలలో వసూళ్లు రూ.91,916గా ఉన్నాయి. అక్టోబర్లో కాస్త పుంజుకుంది. ఆ నెలలో రూ.95,380 కోట్లు రాగా, నవంబర్ నెలలో రూ.1.03 లక్షల కోట్లకు పెరిగింది.