7 నగరాల్లో 4.8 లక్షల ఇళ్లు నిలిచిపోయాయి, హైదరాబాద్లో తక్కువే
దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ప్రాజెక్టులు ఎక్కడికి అక్కడ నిలిచిపోయాయని ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ వెల్లడించింది. హైదరాబాద్, ఢిల్లీ సహా దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో రియాల్టీ రంగం ఆశాజనకంగా లేదని తెలిపింది. ఇందుకు ప్రధాన కారణం ఖర్చులు పెరిగిపోవడంతో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయడం బిల్డర్లకు ఇబ్బందికరంగా మారినట్లు తెలిపింది. ఏడెనిమిదేళ్ల క్రితం పునాదిరాయి పడిన లక్షలాది ఇళ్లు ఇప్పటికీ పూర్తి కాలేదని తెలిపింది.
2014 నుండి 4.8 లక్షల ఇళ్ల నిర్మాణాలు అసంపూర్తిగా మిగిలిపోయాయని, కేవలం దేశ రాజధాని ఢిల్లీలోనే 2.4 లక్షలు ఉన్నట్లు తెలిపింది. ఇందులో ఇళ్లు, ప్లాట్లు ఉన్నాయి. అయితే దక్షిణాదిన మాత్రం ఇలా నిలిచిన నిర్మాణాలు కాస్త తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. 2021 డిసెంబర్ చివరి నాటికి 4.84 లక్షల కోట్ల విలువైన 5.17 లక్షల నివాసాల పనులు స్తంబించగా, వాటిలో 36,830 ఇళ్ల పనులు 2022 జనవరి నుండి మే నెలాఖరులోపు పూర్తి చేశారు. వాటిని కొనుగోలుదారులకు కూడా అందించారు.
హైదరాబాద్, ముంబై, కోల్కతా, చెన్నై, పుణే, బెంగళూరు, ఢిల్లీ-ఎన్సీఆర్.. ఈ ఏడు ప్రధాన నగరాల్లో 2014 అంతకంటే ముందు ప్రారంభించిన ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టులను పరిగణలోకి తీసుకొని అనరాక్ ఈ నివేదికను సిద్ధం చేసింది. పనులు నిలిచిన లేదా ఆలస్యమవుతున్న ఇళ్లలో 77 శాతం ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై పరిధిలోనే ఉన్నట్లు వెల్లడించింది. దక్షిణాదికి చెందిన హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లో ఇలా నిలిచిపోయిన వాటా 9 శాతమే. పుణేలోను 9 శాతం, కోల్కతాలో అయితే కేవలం 5 శాతమే నిలిచిపోయాయి.