Investment: అన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీల కన్ను ఈ స్టాక్ మీదే.. రూ.1.44 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేశాయి
Mutual Funds: మ్యూచువల్ ఫండ్ కంపెనీలు సాధారణంగా చాలా చిన్న మెుత్తంలో సేవింగ్స్ చేసుకునే అనేక మంది డబ్బును హ్యాండిల్ చేస్తుంటాయి. అందుకే వాటిని నియంత్రించటం చాలా క్లిష్టమైనది. ఈ విషయంలో సెబీ చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతుంటుంది. మనలో చాలా మందికి ఉండే సహజమైన అనుమానం అసలు ఇవి తమ డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తుంటాయి అన్నదే.
32 మ్యూచువల్ ఫండ్స్..
మ్యూచువల్ ఫండ్ కంపెనీలకు మేనేజర్స్ ఉంటారని.. వారి ఇన్వెస్టర్ల డబ్బును ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎంత మెుత్తంలో పెట్టుబడి పెట్టాలనే నిర్ణయాలు తీసుకుంటుంటారని చాలా మందికి తెలియదు. అయితే ప్రస్తుతం మార్కెట్లో 32 మ్యూచువల్ ఫండ్ కంపెనీలు భారీగా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేశాయనే విషయం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.
స్టాక్ పేరేంటి..
మ్యూచువల్ ఫండ్ కంపెనీలు మెచ్చినది ఐసీఐసీఐ బ్యాంక్ స్టాక్ నే. ఈ స్టాక్ లో మెుత్తం ఫండ్ కంపెనీలు దాదాపుగా రూ.1.44 లక్షల కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. మరీ ముఖ్యంగా చూసుకుంటే.. ఐసీఐసీఐ ప్రూడెన్షియల్, హెచ్డీఎఫ్సీ AMC, SBI మ్యూచువల్ ఫండ్ కంపెనీలు పెద్దమెుత్తంలో పెట్టుబడులను కలిగి ఉన్నాయి. అంటే మెుత్తం మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల్లో ఇది దాదాపు 6.65 శాతం వాటా అన్నమాట.
ఎవరెవరు ఎంత శాతం..
విడివిడిగా ఫండ్ హౌసెస్ ప్రకారం చూసుకున్నట్లయితే.. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ తమ మెుత్తం పెట్టుబడుల్లో 7.69 శాతం ఐసీఐసీఐ బ్యాంక్ స్టాక్ లో ఇన్వెస్ట్ చేసింది. ఆదిత్య బిర్లా 7.7 శాతం, ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ 7.5 శాతం, కోటక్ 6.86 శాతం, HDFC మ్యూచువల్ ఫండ్ 6.46 శాతం, UTI 6.86 శాతం, నిప్పాన్ ఇండియా 4.93 శాతం మేర తమ మెుత్తం పెట్టుబడుల్లో ఐసీఐసీఐ కోసం వెచ్చించాయి.
ఇంత నమ్మకమా..?
వీడియోకాన్ వ్యవహారంలో చందా కొచ్చర్ పై బ్యాంక్ చర్యలు తీసుకున్నప్పటికీ.. ఆ తర్వాత సారధ్య బాధ్యతలు తీసుకున్న సందీప్ బక్షి బ్యాంకును విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో స్టాక్ ఏకంగా 175 శాతం మేర పెరిగింది. ఫండ్ కంపెనీలు కంపెనీ పనితీరుపై చాలా నమ్మకంగా ఉన్నాయి. ఈ రోజు మార్కెట్లో స్టాక్ ధర రూ.892.70 వద్ద ట్రేడ్ అవుతోంది.