ఈ ఏడాది కూడా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నూరు శాతం అసాధ్యం : హైసియా సర్వేలో అసక్తికర విషయాలు
2020 మార్చి నుండి కరోనా మహమ్మారి కారణంగా ఐటీ, ఐటీ సేవల రంగానికి సంబంధించిన ఉద్యోగులు అందరూ ఇంటి నుండి పని చేస్తున్నారు. ఒకవేళ అవసరాన్ని బట్టి ఎవరైనా ఆఫీసులకు వెళ్తున్నారంటే వారు కేవలం 20 శాతం మాత్రమే. ఇక 2020 గడిచిపోయింది, 2021 సంవత్సరం లో ఈ ఏడాదైనా ఆఫీసుకు వెళ్ళి పని చేస్తామా ? అటువంటి పరిస్థితులు ఉంటాయా? అన్నది ఉద్యోగులందరూ ఆలోచిస్తున్న విషయం.
జాయింట్ వెంచర్ ప్లాన్ కు తెర దింపిన ఫోర్డ్ మోటార్, మహీంద్రా అండ్ మహీంద్రా .. కారణం ఇదే
వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నూరు శాతం అసాధ్యమన్న హైసియా సర్వే
దీనిపై హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఎంటర్ ప్రైసెస్ అసోసియేషన్ తాజాగా నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఈ సంవత్సరం కూడా ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లే పని చేసే పరిస్థితి లేదని , వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నూరు శాతం అసాధ్యమని హైసియా సర్వేలో తేలింది . ఈ సంవత్సరం దేశంలోని ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చి, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్న దానిపై, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ప్రణాళికలు ఆధారపడి ఉంటాయని పేర్కొంది.
వర్క్ ఫ్రం హోం విధానంలో మెరుగైన ఉత్పాదకత .. కంటిన్యూ చేసే ఆలోచనలో సంస్థలు
కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే చాలా సంస్థలు ఆఫీసులు తీసివేసి , కార్యాలయాల కోసం అయ్యే అదనపు ఖర్చును తగ్గించాయి. ఇక చాలామంది సొంత ఊర్లకు వెళ్లి, ఇళ్ల నుండి పని చేసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. మహమ్మారి కారణంగా చాలామంది ఇల్లు సైతం ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్లీ ఆఫీసులు తెరిచి ఆఫీసుకు వచ్చి పని చేయాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. చాలా సంస్థలు వర్క్ ఫ్రం హోం విధానంలో మెరుగైన ఉత్పాదకతను కనబరుస్తున్న నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం విధానాన్ని కొనసాగించాలని ఆలోచిస్తున్న పరిస్థితులు లేకపోలేదు.
అవసరాన్ని బట్టి సిబ్బందికి వర్క్ ఫ్రమ్ ఆఫీస్
ఇక హైసియా నిర్వహించిన సర్వేలో పాలుపంచుకున్న కంపెనీలలో 500లోపు ఉద్యోగుల 63 శాతం కాగా, 501 నుండి 1000 వరకు ఉద్యోగులు ఉన్నవి 11 శాతం, వెయ్యికి పైగా ఉద్యోగులు ఉన్న సంస్థలు 26 శాతం ఉన్నాయి. 75 శాతానికి పైగా పెద్ద కంపెనీలు వర్క్ ఫ్రమ్ ఆఫీసు 0.5 శాతం చేస్తున్నారని వెల్లడించాయి. 2021 మార్చి నాటికి 20 శాతం లోపు ఉద్యోగులను కార్యాలయం నుంచి పని చేసేలా ప్రణాళికలు చేస్తున్నట్టు కంపెనీలు వెల్లడించాయి.
నూరు శాతం ఉద్యోగులు ఆఫీసుకు ... నో ఛాన్స్ : సర్వేలో వెల్లడి
జూన్ నాటికి 40 శాతం, డిసెంబర్ చివరి నాటికి 50 నుండి 70 శాతం ఉద్యోగులను కార్యాలయం నుంచి పరిశీలించాలని ఆలోచిస్తున్నాయి. నూటికి నూరు శాతం వర్క్ ఫ్రం ఆఫీస్ మాత్రం వీలు కాదని సంస్థలు చెప్పిన వివరాలను బట్టి నివేదిక స్పష్టం చేసింది. ఉద్యోగులను ఆఫీసులకు రప్పించి పని చేయించాలని ఆలోచిస్తున్న సంస్థలు క్లయింట్ల అత్యవసర దృష్ట్యా మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొన్నాయి. ఏదేమైనా కరోనా మహమ్మారి కారణంగా మొదలైన వర్క్ ఫ్రం హోం విధానం ఈ సంవత్సరం కూడా కొనసాగే అవకాశం ఉంది. ఈ సంవత్సరం కూడా వంద శాతం ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లి పని చేసే పరిస్థితి లేదని తాజా సర్వే వెల్లడించింది.