బంగారంపై ఊహాగానాలకు చెక్... ఆర్బీఐ ఏం చెప్పిందంటే..
భారత రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉన్న బంగారం నిల్వలకు సంబంధించి వస్తున్న ఊహాగానాలకు చెక్ పడింది. తన వద్ద ఉన్న నిల్వలు ఏస్థాయిలో ఉన్నాయో, వాటి లో హెచ్చుతగ్గులు ఎందుకు ఉంటున్నాయో స్పష్టం చేసింది. దీంతో వదంతులకు తెరపడింది. తన వద్ద ఉన్న బంగారాన్ని విక్రయించడం గానీ ట్రేడింగ్ చేయడం గానీ చేయడం లేదని ఆర్బీఐ పేర్కొంది. ఆగస్టు చివరి నాటికీ మొత్తం విదేశీ మారక నిల్వల్లో బంగారం నిల్వలు 1.99 కోట్ల ఔన్సులుగా ఉందని తెలిపింది. రిజర్వ్ బ్యాంకు ప్రతి శుక్రవారం తన వద్ద ఉన్న విదేశీ మారక నిల్వలు ఏ స్థాయిలో ఉన్నాయో వెల్లడిస్తుంది.
రూ.3,000తో 25 ఏళ్లకు రూ.56 లక్షల రాబడి
విదేశీ కరెన్సీ విలువ, బంగారం నిల్వలు, వాటి విలువ, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐ ఎం ఎఫ్ ) వద్ద ఉన్న బంగారం నిల్వల గురించి కూడా వెల్లడిస్తుంది. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు అంతర్జాతీయ మార్కెట్లో నెలకొనే మార్పులకు అనుగుణంగా ఉంటుంది. అందుకే బంగారం విలువలో మార్పులు చేర్పులు చోటుచేసుకుంటాయి. దీని ఫలితంగానే విలువలతో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయని, తాము మాత్రం బంగారాన్ని విక్రయించడం లేదని ఆర్బీఐ చేసింది. ఈ మేరకు వరుసగా ఆర్బీఐ ట్వీట్లు చేసింది.
ఏమిటా వదంతులు..
*గత జులై నుంచి భారత రిజర్వ్ బ్యాంకు 510 కోట్ల డాలర్ల విలువైన బంగారాన్ని ఆర్బీఐ కొనుగోలు చేసి 115 కోట్ల డాలర్ల విలువైన బంగారాన్ని విక్రయించినట్టుగా వార్తలు వచ్చాయి.
* బిమల్ జలాన్ కమిటీ నివేదిక అందుకున్న తర్వాతి నుంచి ఆర్బీఐ చురుగ్గా బంగారంలో ట్రేడింగ్ నిర్వహిస్తున్నట్టు కూడా కథనం వెలువడింది. అయితే ఇలాంటి లావాదేవీలు నిర్వహించలేదని ఆర్బీఐ వెల్లడించింది.
ఇవీ నిల్వలు
* అక్టోబర్ 18 తో ముగిసిన వారానికి భారత రిజర్వ్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు 1,91,215 కోట్ల రూపాయలు (2686 కోట్ల డాలర్లు) గా ఉన్నాయి. అంతకు క్రితం వారంతో పోల్చితే నిల్వలు 0.49 శాతం మేర పెరిగాయి.
* ఇదే వారానికి దేశ విదేశీ మారక నిల్వలు 13,185 కోట్లు (103. కోట్ల డాలర్లు) పెరిగి గరిష్ట స్థాయి 44,075.1 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. ఇంతకు ముందు వారంలో ఈ నిల్వలు 43,971 కోట్ల డాలర్ల స్థాయిలో ఉన్నాయి.
కేంద్ర బ్యాంకులు...
* అంతర్జాతీయంగా మాంద్య పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. ఫలితంగా చాలా మంది ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడులు పెడుతున్నారు. అందుకే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయి. ఇక అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం, పలు దేశాల్లో రాజకీయ పరిణామాలు కూడా బంగారం ధరలకు ఊతం ఇస్తున్నాయి. ఇక పలు దేశాల కేంద్ర బ్యాంకులు కూడా బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయి. ఇది కూడా ధరల పెరుగుదలకు దారితీస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.