దీపావళి ముహూరత్ ట్రేడింగ్: 192 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
ముంబై: దీపావళి పర్వదినం రోజున గంటపాటు జరిగిన ముహూరత్ ట్రేడింగ్లో సెన్సెక్స్ 192 పాయింట్లు ఎగిసి 39,250 పాయింట్లకు చేరుకుంది. నిఫ్టీ 0.50 పాయింట్లు ఎగిసి11,628 పాయింట్లకు చేరుకుంది. శుభప్రదంగా భావించే పవిత్ర దీపావళి పండుగ రోజు (అక్టోబర్ 27) సాయంత్రం గం.6.15 సమయానికి ముహూరత్ ట్రేడింగ్ ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం దీపావళి పర్వదినాన స్టాక్ ఎక్స్చేంజీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు ప్రత్యేక ట్రేడింగ్ జరుపుతుంటాయి.
ముహూరత్ ట్రేడింగ్ బీఎస్ఈలో 1957లో ప్రారంభమైంది. ఎన్ఎస్ఈలో 1992లో ప్రారంభమైంది. మన సంప్రదాయం ప్రకారం కొత్త వ్యాపార సంవత్సరం ప్రారంభానికి సూచికగా దీపావళి రోజున ఈ ట్రేడింగ్ నిర్వహిస్తారు. సాయంత్రం గం.6.15 నిమిషాలకు ప్రారంభమై రాత్రి గం.7.15కు ముగిసింది.
ఈ గంట సమయంలో సెన్సెక్స్, నిఫ్టీలు స్మార్ట్ లాభాలను ఆర్జించాయి. సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా 11 శాతం, 10 శాతం పెరిగాయి. అయితే మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ మాత్రం అంతగా మెరువలేదు. బ్లూమ్బర్గ్ నివేదిక ప్రకారం... ముహూరత్ ట్రేడింగ్ రోజున మార్కెట్లు మంచి లాభాలను ఆర్జించాయి. గత పదేళ్లని తీసుకుంటే అంటే 2009 నుంచి 2018 మధ్య జరిగిన 10 ముహూరత్ ట్రేడింగ్లలో ఏడు సెషన్లలో లాభాలు చవిచూశాయి. గత ఏడాది అంటే 2018 దీపావళి రోజున జరిగిన ట్రేడింగ్ 0.7 శాతం లాభాలు చూసింది.