ఇప్పుడు ఇన్ఫోసిస్ స్టాక్స్ కొనడం/అమ్మడం చేయొచ్చా? ఇన్ఫీకి అది కష్టమే!
బెంగళూరు: ఇన్ఫోసిస్ సీఈవో, సీఎఫ్ఓపై కంపెనీకి సంబంధించిన గుర్తు తెలియని ఉద్యోగులు సంచలన ఆరోపణలు చేస్తూ లేఖ రాసిన అంశం కలకలం రేపుతోంది. ఇది ఇన్ఫోసిస్ షేర్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మంగళవారం ఇన్ఫోసిస్ షేర్లు 16 శాతానికి పైగా నష్టపోయాయి. షేర్ల ధర ఆరేళ్ల కనిష్టానికి పడిపోయింది. బుధవారం కాస్త కోలుకొని, 8% మేర లాభపడ్డాయి. అయితే గత వారం సెషన్తో పోలిస్తే తక్కువే ఉంది. చాలామంది ఇన్వెస్టర్లు షేర్లు విక్రయించడానికి చూస్తున్నారు. మరోవైపు కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ముందుకు రావడం లేదు. దీంతో ఈ షేర్ ధరలు తగ్గాయి. ఈ నేపథ్యంలో చాలామందిలో ఈ షేర్లు కొనుగోలు చేయాలా లేదా అనే మీమాంస ఉంటుంది.
ఇన్ఫోసిస్ సీఈవోపై ఫిర్యాదు, ఏం జరుగుతోంది?
షేర్ వ్యాల్యూ పడిపోయినప్పుడు...
సాధారణంగా షేర్ వ్యాల్యూ పడిపోయినప్పుడు కొనుగోలు చేస్తే ఆ తర్వాత పుంజుకుంటుందని, అప్పుడు లాభాలు చూడవచ్చునని కొందరు భావిస్తారు. అదే సమయంలో ఇలాంటి తీవ్ర ఆరోపణలు వచ్చినప్పుడు ఆ కంపెనీ భవిష్యత్తు ఏమిటనేది మరికొంతమందికి ఉంటుంది. ప్రస్తుత సీఈవో సలీల్ పరేఖ్ పైన ఆరోపణలు వచ్చాయి. అంతకుముందు సీఈవో విశాల్ సిక్కా కూడా ఇష్యూల మధ్యే బయటకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఇన్ఫీ కార్పోరేట్ గవర్నెన్స్ స్టాండర్డ్ పైన ప్రశ్నలు తలెత్తుతున్నాయని అంటున్నారు.
ఇన్వెస్టర్ల డైలమా
గుర్తు తెలియని ఉద్యోగులు లేదా విజిల్ బ్లోయర్స్ సెప్టెంబర్ 20వ తేదీన, సెప్టంబర్ 30వ తేదీన రెండుసార్లు... సీఈవో, సీఎఫ్ఓ పైన బోర్డుకు ఫిర్యాదు చేశారు. ఈ దెబ్బ అమెరికా వరకు వెళ్లింది. విచారణ సాగుతుందని, వివరాలు అందిస్తామని నందన్ నీలేకని ఎక్స్చేంజ్ బోర్డుకు తెలిపారు. విచారణ ముగిసిన తర్వాతనే అందరికీ క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్ల డైలమాలో ఉంటారు.
ఇన్ఫోసిస్కు ఇది కష్టమే..
ఇన్ఫీ వంటి సంస్థపై ఆరోపణలు రావడం ఇన్వెస్టర్లకు నిజంగా ఆందోళనకరమైన అంశమే. పరిస్థితులు ఎటువైపు వెళ్తాయనే ఉత్కంఠ వారిలో ఉంటుంది. ఈ ఆరోపణలకు కంపెనీ దిగువ శ్రేణితో సంబంధం లేనట్లుగా కనిపిస్తోంది. దిగువ శ్రేణిపై ఎలాంటి ప్రభావంపడదు. అయితే ప్రస్తుత ఆరోపణల నేపథ్యంలో ఇన్ఫోసిస్కు ఒప్పందాలు నిలుపుకోవడం, కొత్త క్లయింట్స్ను గెలుచుకోవడం కష్టమైన అంశంగా మారుతుంది. గత వారం డిప్యూటీ సీఎఫ్ఓ రాజీనామా చేశారు. దీనికి విజిల్ బ్లోయర్స్ ఆరోపణలకు సంబంధం లేకపోయినప్పటికీ ఆందోళన తీవ్రమవడానికి కారణం అవుతుందనడంలో సందేహం లేదని అంటున్నారు.
స్టాక్స్పై మరింత ఒత్తిడి.. వేచి చూడాలి..
ఇన్ఫోసిస్కు వ్యతిరేకంగా అమెరికా న్యాయ సంస్థ దావాను సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇది స్టాక్ పైన మరింత ఒత్తిడి తెస్తుందని చెబుతున్నారు. అయితే ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణి అవలంభించడం మంచిదనే అభిప్రాయం వినిపిస్తుంది. విచారణ అనంతరం ఏం తేలుతుందనే దానిపై స్టాక్ హెచ్చు తగ్గులు ఆధారపడి ఉంటాయి. విచారణలో ఏం తేలుతుందో ప్రస్తుతానికి ఎవరూ చెప్పలేరు. అయితే దర్యాఫ్తు ముగియడానికి ఎంత గడువు పడుతుందో ఇన్ఫోసిస్ చెప్పాలి. షేర్ రీరేటింగ్ వచ్చే వరకు మొగ్గు చూపకపోవడం మంచిదని అంటున్నారు.
స్టాక్స్ పైన ప్రభావం..
దర్యాఫ్తు ఫలితం కంపెనీ అత్యున్నత స్థానాల కదలికపై ప్రభావం పడినా పడవచ్చునని అంటున్నారు. ప్రస్తుతం ఇన్ఫోసిస్ షేర్ రూ.650 వరకు ఉంది. షార్ట్ కవరింగ్లో ర్యాలీ కావొచ్చు. స్టాక్స్ విక్రయించడానికి ఇది ఉంటుందని చెబుతున్నారు. స్టాక్స్ పది శాతం వరకు పడిపోతే.. రూ.600కు అటు ఇటు వరకు వస్తే కొనుగోళ్లు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. (అయితే బుధవారం స్టాక్స్ లాభాల్లోనే కొనసాగుతుండటం గమనార్హం.) ప్రస్తుతం ఇన్ఫోసిస్ 3.5 శాతం డివిడెండ్ ఇస్తోంది. సేవింగ్ బ్యాంక్ అకౌంట్ వడ్డీ కంటే ఇది మంచిది.