వినియోగదారుని విజయం: ఐసీఐసీఐ బ్యాంకుకు రూ 55,000 ఫైన్
జాగో గ్రాహక్ ... జాగో! అంటూ ప్రభుత్వం చాలా ప్రకటనలు ఇచ్చి వినియోగదారుల్లో వారి హక్కులపై అవగాహన కల్పిస్తుంది. అయినా చాలా మంది వినియోగదారులు అనేక సందర్భాల్లో తమకు ఇబ్బంది తలెత్తినా .... పోనిలే వాడే పోతాడు అనే కర్మ సిద్ధాంతాన్ని పాటిస్తుంటారు. కానీ కొందరు మాత్రం తమ హక్కులను కాపాడుకోవడంలో పట్టదులతో ప్రయత్నించి విజయం సాధిస్తారు. కొండల్లాంటి పెద్ద పెద్ద కంపెనీలకు ఎదురొడ్డి వినియోగదారుల ఫోరమ్ లో తమ వాదన నిజమని నిరూపించుకొంటారు. తద్వారా ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంటారు.
ఇటీవల హైదరాబాద్ లో ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంకు నిర్లక్ష్య ధోరణిపై పోరాడి వినియోగదారుల ఫోరమ్ లో కేసు గెలిచాడు ఒక కస్టమర్. బ్యాంకులో గృహం ఋణం తీసుకొని ఫ్లోటింగ్ వడ్డీ రేటును తీసుకొన్నాడు ఆ వినియోగదారుడు. కానీ వడ్డీ రేట్లు మారినప్పుడు బ్యాంకు తనకు ఎప్పుడు కూడా సమాచారం అందించలేదని, గడువు ముగిసినా తన లోన్ తీరలేదని వినియోగాగురుల ఫోరమ్ ను ఆశ్రయించాడు. ఈ వివరాలతో ది టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనాన్ని ప్రచురించింది. దాని ఆధారంగా వినియోగదారుని విజయం గురించి తెలుసుకొందాం.
గడువు తీరినా ... అప్పు తీరలేదు...
హైదరాబాద్ కు చెందిన ఆర్ రాజ్ కుమార్ అనే వ్యక్తి గచ్చిబౌలి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ లోని ఐసీఐసీఐ బ్యాంకు శాఖ నుంచి 2006లో రూ 30 లక్షల గృహ ఋణం పొందారు. ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంటరెస్ట్ (పెరిగితే పెరుగుతూ తగ్గితే తగ్గుతూ ఉంటుంది) ను ఎంచుకొన్నారు. అప్పుడు వడ్డీ రేటు 9.25% గా ఉంది. తీసుకొన్న రుణాన్ని 120 వాయిదాల్లో (ఈఎంఐ) చెల్లించాల్సి ఉంది. అతను రెగ్యులర్ గా వాయిదాలు చెల్లిస్తున్నాడు. గడువు తీరి పోయింది. కానీ అప్పు మాత్రం తీరలేదు.
షాక్ ఇచ్చిన బ్యాంకు...
తాను చెల్లించాల్సిన మొత్తం తీరిపోయిందని కస్టమర్ భావించాడు. ఎందుకైనా మంచిదని ఒక సారి అకౌంట్ స్టేట్ మెంట్ తీసుకొని చూసి షాక్ తిన్నాడు. అప్పటికే తాను 136 వాయిదాలు చెల్లించాడు. అంటే 16 వాయిదాలు అదనంగా చెల్లించాడు. మొత్తంగా రూ 49.73 లక్షలు చెల్లించాడు. అయినా... ఇంకా రూ 28.73 లక్షలు చెల్లంచాల్సి ఉన్నట్లు బ్యాంకు రిపోర్ట్ లో తేలింది.
కరువైన స్పందన...
తాను చెల్లించిన మొత్తంలో నుంచి కేవలం రూ 17.93 లక్ష మొత్తం మాత్రమే ప్రిన్సిపాల్ అమౌంట్ లో జమ అయినట్లు తేలింది. వడ్డీ రేటు 14.85% గా బ్యాంకు పేర్కొంది. ఈ విషయాన్నీ తనకు ఎప్పుడు కూడా బ్యాంకు తెలపలేదని కస్టమర్ ఫిర్యాదు చేసాడు. కస్టమర్ బ్యాంకు ను సంప్రదించినా లాభం లేకపోయింది. నోటీసులకు బ్యాంకు నుంచి స్పందన రాలేదు.
బ్యాంకు బుకాయింపు...
బ్యాంకు నుంచి ఎటువంటి స్పందన లేకపోవటంతో విసిగి పోయిన కస్టమర్ జిల్లా వినియోగదారుల ఫోరమ్ ను ఆశ్రయించారు. తన వాదన వినిపించారు. బ్యాంకు మాత్రం తాము వినియోగదారునికి వడ్డీ రేటు మారిన ప్రతిసారి సమాచారం అందించామని బుకాయించింది. కానీ ఫోరమ్ ముందు అందుకు తగిన ఆధారాలను సమర్పించలేకపోయింది. దీంతో వినియోగాగురుల ఫోరమ్ ఐసీఐసీఐ బ్యాంకు నకు మొట్టి కాయలు వేసి రూ 55,000 జరిమానా విధించింది. సో వినియోగదారులూ మీరు కూడా మేల్కొనండి. ఏదైనా వస్తు లేదా సేవా లోపం ఉంటె ముందు ప్రశ్నించండి. వినకపోతే వినియోగదారుల ఫోరమ్ ను ఆశ్రయించండి. తప్పకుండా న్యాయం జరుగుతుంది.