చైనాతో ధీటుగా భారత్ వృద్ధి రేటు: మన్మోహన్కు నిర్మల చురకలు
న్యూఢిల్లీ/వాషింగ్టన్: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్పై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి ధ్వజమెత్తారు. మన్మోహన్, రఘురాం రాజన్ హయాంలోనే బ్యాంకులు కుప్పకూలాయని, ఫోన్ కాల్తో రుణాలు ఇచ్చారని రెండు రోజుల క్రితం మండిపడిన నిర్మల.. మాజీ ప్రధానిని మరోసారి ఏకిపారేశారు. యూపీఏ హయాంలో ఎన్నో అవినీతి కేసులు వెలుగు చూశాయని, ఇప్పుడు సుద్దులు చెబుతోందన్నారు. వృద్ధి రేటులో మనం చైనాతో సమానంగా ముందుకు సాగుతున్నామన్నారు.
విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో భారత్ ఫెయిలైందా అని ప్రశ్నించగా, నిర్మల స్పందిస్తూ.. ఐఎంఎఫ్ భారత్ వృద్ధి రేటు అంచనాను 6.1 శాతానికి తగ్గించినప్పటికీ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ముందు ఉందని చెప్పారు. భారత్ మరింత వేగంగా వృద్ధి చెందాలని కోరుకుంటున్నానని, అందుకోసం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
మోడీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం మానివేసి, గత ప్రభుత్వాలపై విమర్శలు చేస్తోందని, మా హయాంలో తప్పులు జరిగాయని, వాటి నుంచి గుణపాఠం నేర్చుకోవాలన్న మన్మోహన్ వ్యాఖ్యలపై ఆమె ధీటుగా స్పందించారు. అసలు ఆ తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవాల్సి ఉందని, అప్పుడే సమస్య పరిష్కారమవుతుందని గట్టి జవాబిచ్చారు.
తప్పులు జరిగాయని స్పష్టమవుతోందని, ప్రభుత్వరంగ బ్యాంకుల ఇష్యూలను పరిష్కరిస్తున్నామని, అలాగే యూపీఏ హయాంలో అప్పులు తీసుకొని పారిపోయిన వారిని దేశానికి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. యూపీఏ హయాంలో ఫోన్ కాల్స్ ద్వారా పెద్దలకు రుణాలు ఇచ్చారని నిర్మల మండిపడ్డారు.