తప్పు చేశాం.. గుణపాఠం నేర్చుకోవాల్సింది, ఆ విషయంలో మోడీ ప్రభుత్వం ఓకే!: మన్మోహన్
న్యూఢిల్లీ/వాషింగ్టన్: భారత ఆర్థిక వ్యవస్థపై, కేంద్ర ప్రభుత్వంపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం నిప్పులు చెరిగారు. అమెరికా పర్యటనలో ఉన్న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ దీనిపై ధీటుగా స్పందించారు. యూపీఏ హయాంలో ఎన్నో అవినీతి కేసులు వెలుగు చూశాయని, ఇప్పుడు సుద్దులు చెబుతోందన్నారు. అంతకుముందు మన్మోహన్.. మోడీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.
అయిదేళ్లు సరిపోలేదా..
ప్రతీ ఆర్థిక సంక్షోభానికి యూపీఏ ప్రభుత్వాన్ని నిందించడం ప్రస్తుత ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్నారు. తమ పాలనలో జరిగిన తప్పుల నుంచి మోడీ ప్రభుత్వం గుణపాఠాలు నేర్చుకుంటే బాగుండేదని, ఇప్పుడున్న సమస్యలకు చక్కని పరిష్కారాలు దొరికేవన్నారు. నీరవ్ మోడీ, ఇతర రుణ ఎగవేతదారులు విదేశాలకు పారిపోయి ఉండేవారు కాదని, బ్యాంకుల పరిస్థితి మరింత దిగజారేది కాదన్నారు. గత ప్రభుత్వాల లోపాలను సరిదిద్దడానికి ఐదున్నరేళ్లు చాల్లేదా అని ప్రశ్నించారు. పదేళ్ల పాలనలో మేం అన్నీ తప్పులు చేస్తే ఐదున్నరేళ్లలో మీరేం చేశారని నిలదీశారు.
5 లక్షల డాలర్ల ఆర్థిక వ్యవస్థ అవకాశం లేదు..
ప్రజలకు చక్కని పాలన అందించేందుకు అవసరమైన సమయం మోడీ ప్రభుత్వానికి వచ్చిందని, అయినా ఆ పని చేయడం మానివేసి, గత ప్రభుత్వాలపై విమర్శలు చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా చౌకబారు ఆరోపణలను ఆపివేయాలని, పాలనాపరమైన అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. భారత ఆర్థిక వ్యవస్థని 2024 వరకు 5 లక్షల కోట్ల డాలర్లకు చేర్చాలన్న మోడీ ప్రభుత్వం కల నెరవేరే అవకాశాలు కనిపించడం లేదన్నారు. ప్రతి సంవత్సరం వృద్ధిరేటు క్షీణిస్తూ వస్తోందని, అతిపెద్ద లక్ష్యం సాధ్యం కాదన్నారు.
ఎంతో దూరంలో ఉన్నాం..
ఆర్థిక వ్యవస్థని చక్కదిద్దేందుకు అసలు సమస్యల్ని, వాటి మూలాల్ని గుర్తించాలని, కానీ, మోడీ ప్రభుత్వం అపవాదును రాజకీయ ప్రత్యర్థుల పైకి నెడుతోందని మన్మోహన్ అన్నారు. దాంతో ఆర్థిక పునరుద్ధరణకు సరైన పరిష్కారాలను చూపలేకపోతోందన్నారు. ఆర్థిక వ్య వస్థలో ప్రస్తుత మందగమనం అంత త్వరగా పరిష్కృతమయ్యే సమస్య కాదని, ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యపడే ఆర్థిక వృద్ధి రేటు 5.5 నుంచి 6 శాతమే అన్నారు. అభివృద్ధికి అవసరమైన 8 నుంచి 10 శాతం వృద్ధి కంటే ఇది ఎంతో తక్కువ అన్నారు.
అది భేష్... మోడీ ప్రభుత్వంపై మన్మోహన్
మోడీ ప్రభుత్వం కార్పొరేట్ పన్నును తగ్గించడాన్ని స్వాగతిస్తున్నానని, ప్రస్తుతం వ్యవస్థలో వినియోగ డిమాండ్ కొరవడటం అసలు సమస్య అన్నారు. ఇందుకు పరిష్కారంగా జీఎస్టీ వంటి పరోక్ష పన్నులను తగ్గించాలని హితవు పలికారు. దేశంలో ఆర్థిక వాతావరణం క్షీణించడానికి మోడీ ప్రభుత్వమే కారణమన్నారు. డబుల్ ఇంజన్ మోడల్ పాలన విఫలమైందన్నారు. ఆర్థిక మందగమనం నేపథ్యంలో ప్రభుత్వ ఉదాసీనత, అసమర్థత కోట్లాది యువత భవిష్యత్, ఆకాంక్షలపై ప్రభావం చూపుతోందన్నారు.
పీఎంసీ బ్యాంకు ఖాతాదారులపై...
పంజాబ్ అండ్ మహారాష్ట్ర సహకార (PMC) బ్యాంకుకు చెందిన 16 లక్షల ఖాతాదారులకు ఊరట కల్పించాలని మోడీ ప్రభుత్వాన్ని కోరుతున్నానని మన్మోహన్ సింగ్ అన్నారు. వైద్య అత్యవసరాల్లో ఉన్న కస్టమర్లకు వారి ఖాతాల్లోంచి నగదు ఉపసంహరించుకునేలా ఆర్బీఐ వెసులుబాటు కల్పించాలన్నారు.
సమస్యలు పరిష్కరిస్తున్నాం...
మోడీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం మానివేసి, గత ప్రభుత్వాలపై విమర్శలు చేస్తోందని, మా హయాంలో తప్పులు జరిగాయని, వాటి నుంచి గుణపాఠం నేర్చుకోవాలన్న మన్మోహన్ వ్యాఖ్యలపై నిర్మల ధీటుగా స్పందించారు. అసలు ఆ తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవాల్సి ఉందని, అప్పుడే సమస్య పరిష్కారమవుతుందని గట్టి జవాబిచ్చారు. తప్పులు జరిగాయని స్పష్టమవుతోందని, ప్రభుత్వరంగ బ్యాంకుల ఇష్యూలను పరిష్కరిస్తున్నామని, అలాగే యూపీఏ హయాంలో అప్పులు తీసుకొని పారిపోయిన వారిని దేశానికి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
మాటకు మాట....
యూపీఏ హయాంలో ఫోన్ కాల్స్ ద్వారా పెద్దలకు రుణాలు ఇచ్చారని నిర్మల మండిపడ్డారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని, సమస్య పరిష్కారంపై దృష్టి సారించడం లేదని మన్మోహన్ సింగ్, రఘురాం రాజన్ వంటి వారు విమర్శలు గుప్పించారు. దానికి నిర్మలా సీతారామన్ అమెరికాలో ఘాటుగా స్పందించారు. అసలు మన్మోహన్, రాజన్ సమయంలోనే బ్యాంకులు దివాళా తీశాయని, ఫోన్ చేస్తే రుణాలు ఇచ్చి బ్యాంకులను భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. దీంతో మళ్లీ మన్మోహన్ విమర్శలు గుప్పిస్తూ.. మేం తప్పు చేశామని, మీరు వాటి నుంచి గుణపాఠం నేర్చుకోవాల్సింది అన్నారు. దానికి నిర్మలా... ఆ తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకొని పరిష్కరించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.