రుణమేళాలకు భలే స్పందన... 9 రోజుల్లో రూ. 81,700 కోట్ల రుణాల జారీ
బ్యాంకులు చేపడుతున్న రుణ మేళాలకు భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. వేలాది కోట్ల రూపాయల రుణాలను బ్యాంకులు జారీ చేస్తున్నాయి. ప్రభుత్వ రంగంలోని బ్యాంకులు కేవలం తొమ్మిది రోజుల్లోనే రూ. 81,781 కోట్ల రుణాలు జారీ చేశాయి. మొదటి విడత రుణ మేళాను ఈ నెల 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించారని ఆర్ధిక కార్యదర్శి వెల్లడించారు.
ఏపీ రైతులకు గుడ్న్యూస్: రూ.1000 పెంపు, దరఖాస్తు చివరి తేదీ
నూతన ఎంట్రప్రెన్యూర్లకు రూ. 34,342 కోట్లు
బ్యాంకులు జారీ చేసిన మొత్తం రుణాల్లో రూ.34,342 కోట్లు నూతన ఎంట్రప్రెన్యూర్లకు ఇవ్వడం విశేషం. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారు బ్యాంకుల నుంచి రుణాలు లభించక కొంత కాలంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రుణ మేళాల ద్వారా ఎక్కువ మంది లబ్దిపొందుతున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. రుణ మేళాల ద్వారా కస్టమర్ల ముంగిట్లోనే రుణాలు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. రుణాలు తీసుకొని వివిధ రకాల కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో వృద్ధికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. బ్యాంకుల వద్ద నిధులకు కొరత లేదు. అందుకే రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు కూడా అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. మరోవైపు వడ్డీరేట్లు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో రుణాలు తీసుకోవడానికి వ్యక్తులు, వ్యాపారులు ముందుకు వస్తున్నారు.
ఎంఎస్ఎంఈలకు దన్ను....
ఉపాధి కల్పన, ఎగుమతులు, దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు ( ఎం ఎస్ ఏం ఈ) కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇప్పటికే ఎంఎస్ఎంఈ లకు ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.40,000 కోట్ల బకాయిలు చెల్లించాయి. త్వరలోనే మిగిలిన బకాయిలు రూ.20,000 కోట్లు త్వరలోనే చెల్లించనున్నట్టు ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.
మొదటి విడతలో భాగంగా దేశంలోని 250 జిల్లాల్లో రుణ మేళాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేళాలో అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు పాల్గొన్నాయి. పండగ సీజన్ నేపథ్యంలో వివిధ రకాల అవసరాలకు జనం రుణాలు తీసుకున్నారు.
21 నుంచి మళ్ళీ...
ఈ నెల 21 నుంచి 25 వరకు మరోసారి బ్యాంకులు రుణ మేళాను నిర్వహించనున్నాయి. రుణ మేళాల్లో భాగంగా రిటైల్, వ్యవసాయ, వాహన , గృహ, ఎంఎస్ఎంఈ , వ్యక్తిగత రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు వచ్చాయి. రుణాలు ఇస్తేనే బ్యాంకులకు రాబడులు పెరిగే అవకాశం ఉంటుంది. నిధులు తమ వద్దనే ఉంచుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. బ్యాంకులు మొండి పద్దుల సమస్య ఉండకుండా జాగ్రత్తగా రుణాలు మంజూరు చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి.