పదేళ్ల క్రితం రూ 28,000 కోట్లు... ఇప్పుడు రూ 900 కోట్లు!: బిజినెస్ టైకూన్ గౌతమ్ థాపర్ గ్రూప్ పతనం
ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయన్నది సామెత. ఈయన విషయంలో ఆ రెండూ జరిగాయి. ఒకప్పుడు ఉద్యోగం దొరకటమే కష్టమైన పరిస్థితి నుంచి వేళ కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించాడు. అదే సామ్రాజ్యం ప్రస్తుతం పతనం అంచున ఉంది. బాస్ ఒకరే అయినా... పదేళ్ల లోనే కొన్ని దూకుడు నిర్ణయాలతో ఆయన బిజినెస్ గ్రూప్ ఆకాశం నుంచి పాతాళానికి పడిపోయింది. ఈ ప్రముఖ బిజినెస్ టైకూన్ పేరు గౌతమ్ థాపర్ కాగా... అయన గ్రూప్ పేరు అవంత. ఇలా చెబితే ఎక్కువ మందికి తెలియక పోవచ్చు కానీ క్రామ్టోన్ గ్రీవ్స్ అంటే అందరికీ తెలుస్తుంది.
మావల్ల కాదు.. ఇప్పుడే కొనండి, ఆలస్యం చేస్తే ఆఫర్లు తగ్గుతాయ్
దాదాపు ప్రతి ఇంట్లోనూ ఒక క్రామ్టోన్ ఫ్యాన్ లేదా బల్బ్ ఉండి తీరుతుంది. తెలంగాణ లోని ఆంధ్ర ప్రదేశ్ రేయోన్స్ ఫ్యాక్టరీ ఓనర్ కూడా ఈయనే. కుటుంబ వ్యాపారాలను టేకప్ చేసి ... నష్టాల్లో ఉన్న సంస్థలను సైతం లాభాల బాట పట్టించిన గౌతమ్ థాపర్... అంచలంచలుగా ఎదుగుతూ తన కంపెనీలను వృద్ధి బాట లోకి తీసుకొచ్చారు. కానీ దురదృష్టవశాత్తు అయన కళల సామ్రాజ్యం ప్రస్తుతం కుప్పకూలిపోయింది. తన కంపెనీ నుంచి ఆయన్నే గెంటివేసే పరిస్థితి తలెత్తింది. ది ఎకనామిక్ టైమ్స్ ప్రచురించిన ఈ కథనం నుంచి మీకోసం కొన్ని విషయాలు ఇందులో ప్రస్తావిస్తున్నాం.
పదేళ్ల లో పతనం ...
గౌతమ్ థాపర్ ఆద్వర్యంలోని అవంత గ్రూప్ కంపెనీల ఉమ్మడి ఆదాయం 2007-08 లోనే 4 బిలియన్ డాలర్లు (రూ 28,000 కోట్లు) గా ఉంది. క్రామ్టోన్ గ్రీవ్స్ , బల్లర్పూర్ ఇండస్ట్రీస్ ఉమ్మడి రెవిన్యూ 3.7 బిలియన్ డాలర్లు గా ఉండేది. 2010 లో ఫోర్బ్స్ భారత సంపన్నుల జాబితా లో 49 ఏళ్ళ గౌతమ్ థాపర్ 28 వ స్థానంలో నిలిచారు. సీన్ కట్ చేస్తే ప్రస్తుతం 2019 లో అవంత గ్రూప్ వేల్యూ 130 మిలియన్ డాలర్లు (రూ 910 కోట్లు) మాత్రమే.
గ్రూప్ ప్రస్థానం...
అవంత గ్రూప్ మూలాలు న్యూ ఢిల్లీ కేంద్రంగా కుటుంబ వ్యాపారాలు నిర్వహించే కరం చాంద్ థాపర్ వద్దకు వెళతాయి. 1919 లో ఆయన వ్యాపారాన్ని ప్రారంభించారు. గౌతమ్ థాపర్ కుటుంబంలో మూడోతరం వ్యక్తి. ఆయన డూన్ స్కూల్లో చదివారు. తర్వాత అమెరికాలో కెమికల్ ఇంజనీరింగ్ చేశారు. కానీ అక్కడ అయనకు సరైన ఉద్యోగం దొరకలేదు. గౌతమ్ తండ్రి సోదరుడు లలిత్ మోహన్ థాపర్ ఆహ్వానం పై 1980 లో ఇండియాకు తిరిగి వచ్చిన గౌతమ్ థాపర్... నష్టాల్లో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ రే యాన్స్ ఫ్యాక్టరీ బాధ్యతలు చేపట్టారు. అందరినీ ఆశ్చార్యానికి గురిచేస్తూ ఏడాదిలోనే ఆ కంపెనీ ని గౌతమ్ థాపర్ లాభాల బాట పట్టించారు. ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది.
ఎక్కడ తప్పు జరిగింది...
కుటుంబ వ్యాపారులుగా ఉన్నంత వరకు తనకు తిరుగు లేదు అన్నంతలా ఎదిగిన గౌతమ్ థాపర్... విడిపోయిన తర్వాత గ్రూప్ విస్తరణపై అధిక ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా తన కంపెనీలను గ్లోబల్ కంపెనీలుగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారు. దీంతో అటు క్రొమటోన్ గ్రీవ్స్ ... ఇటు బల్లర్పూర్ ఇండస్ట్రీస్ లను విదేశాలకు విస్తరించారు. సుమారు 15 విదేశి కంపెనీలను కొనుగోలు చేసారు. వీటన్నిటినీ అప్పులు తీసుకొని కొనుగోలు చేసారు. కానీ అవేవీ లాభాలను అందించలేకపోయాయి. పైగా విద్యుత్ ఉత్పత్తి రంగంలోకి భారీగా విస్తరించారు. మధ్య ప్రదేశ్, చ్చత్తీస్గఢ్ లో పవర్ ప్లాంట్లు నెలకొల్పాడు. దీనికోసం కూడా భారీగా రుణాలు తీసుకొన్నారు. 2014 నాటికీ గ్రూప్ అప్పులు రూ 7,500 కోట్లకు చేరాయి.
గుడ్ల కోసం బాతు బలి..
అప్పటి వరకు బంగారు బాతు లా మెరుగైన లాభాలతో నడిచే క్రోమ్టన్ గ్రీవ్స్ కంపెనీని రెండు సంస్థలుగా విభజించి ... లాభాలు అందించే క్రోమ్టన్ కన్స్యూమర్ ఎలక్ట్రిక్ ను ప్రైవేట్ ఈక్విటీ సంస్థలకు విక్రయించారు. దీంతో రూ 2,000 కోట్ల నిధులు సమకూరాయి. కానీ గ్రూప్ మాత్రం అప్పుల ఊబిలోంచి బయట పడలేక పోయింది. ఒక వైపు నష్టాల్లో నడుస్తున్న కంపెనీలు... మరో వైపు అప్పుల భారం వెరసి అవంత గ్రూప్ పతనం ఖాయమైంది. విదేశి కంపెనీలను నిర్వహించే టాప్ మానేజ్మెంట్ మార్పు వల్ల వాటి ఇంటెగ్రేషన్ అనుకొన్న సమయానికి జరగలేదు. గౌతమ్ థాపర్ తనకున్న వాటా ల్లో 99% బ్యాంకుల వద్ద తనఖా పెట్టారు. అప్పుల కింద వాటిని బ్యాంకులు జప్తు చేసుకొని, ఆయన్ను కంపెనీ బోర్డు నుంచి తొలగించాయి. దీంతో ప్రస్తుతం అవంత గ్రూప్ మనుగడే ప్రశ్నర్థకంగా మారింది.