ధన్తేరస్ సేల్: నగల దుకాణాల నుంచి భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు...
దీపావళి దగ్గర పడుతోంది. దాని రెండు రోజుల ముందు ధన్తేరస్. బంగారం కొనుగోలుకు ఇది ఎంతో పవిత్రమైన దినంగా అందరూ భావిస్తారు. అయితే మరోవైపు పెరిగిపోతున్న బంగారం ధర కూడా కొనుగోలుదారులను ఆలోచనలో పడవేస్తోంది. ధర కాస్త తగ్గాక చూద్దాంలే అని పలువురు భావిస్తున్నారు.
బంగారం ధర చూసి అటు నగల దుకాణాల యాజమాన్యాలు కూడా భయపడుతున్నాయి. ధర చూసి కొనుగోలుదారులు జంకితే అమ్మకాలు పడిపోతాయి. అదీ వారి భయం. అందుకే కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు 'ధన్తేరస్', 'దీపావళి' సందర్భంగా ఆయా నగల దుకాణాలు పలు డిస్కౌంట్లు, ఆఫర్లు అందుబాటులోకి తీసుకొచ్చాయి.
పెరిగిపోతున్న బంగారం ధర...
బంగారం ధర రోజురోజుకీ పెరిగిపోతోంది. ఈ ఏడాది ఈ ధరలు ఆరేళ్ల గరిష్ఠాన్ని తాకాయి. ఒకవైపు వాణిజ్య పోరు, మరోవైపు ఆర్థిక మాంద్యం ప్రభావం, వీటికితోడు సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనుగోళ్లు బాగా పెంచాయి. మరోవైపు బంగారం దిగుమతులు తగ్గాయి. దీంతో పసిడి ధరకు రెక్కలు వచ్చాయి. గత నెలలో అయితే బంగారం ధర ఆల్ టైమ్ హై మార్క్ను తాకింది. సెప్టెంబర్లో ముంబైలో 10 గ్రాముల బంగారం రూ.40 వేల మార్క్ను అందుకుంది.
అసలే దీపావళి.. అందులోనూ ధన్తేరస్...
ప్రస్తుత పండుగల సీజన్లో రానున్నది దీపావళి. దానికి రెండు రోజుల ముందు ‘ధన్తేరస్' రాబోతోంది. ఆ రోజున పసిడి కొనుగోలు చేయడం అనాదిగా సంప్రదాయంగా వస్తోంది. దీంతో నగల దుకాణాల దృష్టి మొత్తం దీనిపైనే ఉంది. బంగారం ధర గరిష్ఠ స్థాయి నుంచి 4 శాతం తగ్గినా.. గత ఏడాది దీపావళితో పోల్చి చూస్తే.. ఈ ఏడాది 20 శాతం అధికంగానే బంగారం ధరలు ఉన్నాయి.
డిస్కౌంట్లకు తెరతీసిన నగల దుకాణాలు...
ఈ పండగ సీజన్లో బంగారం ధర పెరిగినా, కొనుగోలుదారులను ఆకర్షించేందుకు నగల దుకాణాలు డిస్కౌంట్లు, ఆఫర్లకు తెరతీశాయి. దేశంలోని ప్రముఖ ఆభరణాల సంస్థలైన కళ్యాణ్ జ్యూయలర్స్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, తనిష్క్.. తాజాగా డిస్కౌంట్ల బాట పట్టాయి. తనిష్క్ హైఎండ్ జ్యూయలరీపై భారీ డిస్కౌంట్లు ఇస్తుండగా, కళ్యాణ్ జ్యూయలర్స్ బ్యాంకులతో జతకట్టింది.
మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో...
మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ దుకాణాలలో రూ.15 వేలకుపైగా ఆభరణాలు కొనుగోలు చేసిన వారికి గోల్డ్ కాయిన్స్ ఇవ్వనున్నారు. కొనుగోలుదారులు నగల కోసం అడ్వాన్స్గా కూడా ఆర్డర్లు ఇవ్వొచ్చు. ఇలా ఆర్డర్ బుక్ చేసినప్పుడు.. ఆ రోజు ధరగాని లేదా డెలివరీ సమయంలో ఉన్న ధరగాని.. ఏది తక్కువగా ఉంటే ఆ ధరనే కస్టమర్లు చెల్లించే సదుపాయాన్ని ఈ సంస్థ అందిస్తోంది.
కళ్యాణ్ జ్యూయలర్స్లో...
ధన్తేరస్, దీపావళిని పురస్కరించుకుని కల్యాణ్ జ్యూయలర్స్ కూడా ఆభరణాల కొనుగోలుపై డిస్కౌంట్లు ఇస్తోంది. వీటికి అదనంగా ప్రతి వారం లక్కీ డ్రా నిర్వహించడం ద్వారా తన కస్టమర్లకు మూడు లక్షల గోల్డ్ కాయిన్స్ ఇవ్వనుంది. ఆభరణాల తయారీ ఛార్జీలలో తగ్గింపుతోపాటు అదనపు డిస్కౌంట్ల కోసం కల్యాణ్ జ్యూయలర్స్ పలు బ్యాంకులతో భాగస్వామ్యం కూడా కుదుర్చుకుంది.
‘తనిష్క్' నుంచి...
ఇక మోస్ట్ వాల్యూబుల్ జ్యూయలరీ సంస్థ తనిష్క్ అయితే తన కస్టమర్లకు బంగారు, వజ్రాభరణాల తయారీ ఛార్జీలను 25 శాతం తగ్గించాలని యోచిస్తోంది. నిజానికి బంగారు ఆభరణాల మొత్తం విలువలో ఈ తయారీ ఛార్జీలే 10 శాతం వరకు ఉంటాయి. పైగా దుకాణాలను బట్టి ఈ తయారీ ఛార్జీల్లో కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో పోటీలను నిర్వహించడం ద్వారా గెలుపొందిన వారికి బహుమతులు ఇవ్వాలని తనిష్క్ ప్లాన్ చేస్తోంది.
‘వెడ్డింగ్ సీజన్'పై ధీమా...
ధన్తేరస్, దీపావళి తరువాత వచ్చేది వెడ్డింగ్ సీజన్. ఈ సీజన్లో కూడా బంగారు, వజ్రాభరణాల అమ్మకాలు గణనీయంగా ఉంటాయి కాబట్టి ఆయా నగల దుకాణాల యాజమన్యాలు రాబోయే వెడ్డింగ్ సీజన్పై ధీమాగా ఉన్నాయి. ఒకవేళ దీపావళి పండుగకు అమ్మకాలు కాస్త తగ్గినా వచ్చే వెడ్డింగ్ సీజన్లో అమ్మకాలు పెరగొచ్చనే ఆశాభావంలో ఉన్నాయి. అలాగే కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు అనేక రకాల డిస్కౌంట్లు, ఆఫర్లను ప్రకటించే సన్నాహాల్లో నిమగ్నమయ్యాయి.