తప్పిన జగన్ ప్రభుత్వం అంచనాలు, భారమవుతున్న ఖర్చులు!
ఆంధ్రప్రదేశ్పై ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.16,207 కోట్ల రుణబారం పడిందట. బడ్జెట్ పరిధిలోకి రాని అప్పులు లెక్కలోకి తీసుకుంటే ఇది మరింత పెరుగుతుంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. అప్పులతోనే నడిపించాల్సిన పరిస్థితి. ప్రతి ఏటా గత ఏడాదికి చెందిన అప్పులు, వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఆదాయాల అంచనా ఎక్కువగా వేసుకోవడం, కేంద్రం నుంచి గ్రాంట్ల్, నిధులు సమయానికి రాకపోవడం ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం సొంత ఆదాయాలు మరింతగా తగ్గాయి. దీంతో అప్పులపై ఆధారపడుతోంది.
బ్యాంకు డౌట్స్: ఆంధ్రప్రదేశ్ అప్పు తీర్చగలదా? అది తెలంగాణ ఎఫెక్ట్!
రూ.30 వేల కోట్లకు పైగా అప్పు అంచనా.. కానీ
2019-20 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.30వేల కోట్లకు పైగా అప్పు చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు. దీంతో రుణాలు రూ.2,91,345 కోట్లకు పైగా చేరుతాయని లెక్కలు వేశారు. అయితే తొలి ఆరు నెలల్లోనే అప్పులు భారీగా పెరిగాయట. తొలి సగం ఆర్థిక సంవత్సరంలో సగానికి మించి అప్పులు అయ్యాయి. బహిరంగ మార్కెట్ నుంచి రూ.14,168 కోట్లు, పౌరసరఫరాల కార్పోరేషన్ నుంచి రూ.5,000 కోట్లు, ఏపీ ట్రాన్సుకో ద్వారా రూ.2,250 కోట్ల రుణం పొందారట.
నిధులు రావాలి..
మరోవైపు, పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉంది. గత ఏడాది జూలై తర్వాత నుంచి కేంద్రం నుంచి నిధులు రావడం లేదు. అలాగే, గ్రాంట్స్ రావాల్సి ఉంది. ఏపీ అప్పులు రోజు రోజుకు పెరుగుతున్నాయట. పోలవరం ఖర్చులు కూడా భారంగా మారుతోందట. ఈ రెండేళ్ల కాలంలో, అలాగే 2014-15లలో ఎక్కడి నుంచి ఎంత రుణం తీసుకున్నారనే అంశంపై ప్రముఖ తెలుగు దినపత్రికలో లెక్కలు ఇచ్చారు.
ఆరేళ్ల క్రితం అప్పులు ఇలా..
2014-15లో బహిరంగ మార్కెట్ నుంచి రూ.94,925 కోట్లు, కేంద్రం నుంచి రుణాలు రూ.9,500 కోట్లు, చిన్న మొత్తాల పొదుపు నుంచి రూ.15,166 కోట్లు, ప్రావిడెంట్ ఫండ్ మొదలగు వాటి నుంచి రూ.14,821 కోట్లు తీసుకున్నారు. మొత్తంగా రూ.1,48,743 కోట్లకు పైగా రుణం తీసుకుంది.
గత ఏడాది క్రితం అప్పులు ఇలా..
2018-19లో బహిరంగ మార్కెట్ నుంచి రూ.1,55,376 కోట్లు, కేంద్రం నుంచి రుణాలు రూ.10,229 కోట్లు, చిన్న మొత్తాల పొదుపు నుంచి రూ.12,504 కోట్లు, ప్రావిడెంట్ ఫండ్ మొదలగు వాటి నుంచి రూ.14,767 కోట్లు, డిపాజిట్స్, రిజర్వ్ నిధుల నుంచి రూ.52,064 కోట్లు తీసుకున్నారు. మొత్తంగా రూ.2,60,329 కోట్లకు పైగా రుణం తీసుకుంది.
ఈ ఏడాది సెప్టెంబర్ వరకు అప్పులు ఇలా..
2019-20లో సెప్టెంబర్ నెల వరకు బహిరంగ మార్కెట్ నుంచి రూ.1,69,544 కోట్లు, కేంద్రం నుంచి రుణాలు రూ.10,624 కోట్లు, చిన్న మొత్తాల పొదుపు నుంచి రూ.12,107 కోట్లు, ప్రావిడెంట్ ఫండ్ మొదలగు వాటి నుంచి రూ.14,779 కోట్లు, డిపాజిట్స్, రిజర్వ్ నిధుల నుంచి రూ.54,152 కోట్లు తీసుకున్నారు. మొత్తంగా రూ.2,76,536 కోట్లకు పైగా రుణం తీసుకుంది.