'3 సినిమాలు రూ.120 కోట్లు వసూలు చేశాయి.. ఆర్థికమాంద్యం ఎక్కడ?'
ముంబై: కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్ శనివారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ వ్యాప్తంగా ఆర్థికమాంద్యం భయాలు ఉన్నాయి. ఈ ప్రభావం భారత్లోను ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా నాలుగుసార్లు వివిధ ఉద్దీపన చర్యలు ప్రకటించారు. ఇది కార్పోరేట్ నుంచి కొనుగోలుదారుల వరకు ప్రయోజనం చేకూర్చనుంది. అయితే ఈ మాంద్యం భయాలపై రవిశంకర ప్రసాద్ తనదైన శైలిలో స్పందించారు.
మీ పీఎఫ్ ఖాతాలో వడ్డీని చూసుకోవడం ఎలా?
రూ.120 కోట్లు వసూలు.. మాంద్యం ఎక్కడ?
సినిమాలను తాను ఇష్టపడతానని, ప్రస్తుతం ఈ సినిమాల వల్ల భారీగా వ్యాపారం జరుగుతోందని, ఇటీవలే విడుదలైన మూడు బాలీవుడ్ సినిమాలు అతిపెద్ద హిట్ అయ్యాయని రవిశంకర ప్రసాద్ అన్నారు. ఈ నెల అక్టోబర్ 2వ తేదీన ఒక్కరోజే ఈ సినిమాలు రూ.120 కోట్ల మేర కలెక్షన్లు సాధించాయని, ఇలాంటప్పుడు మాంద్యం ప్రభావం ఏది అని వ్యాఖ్యానించారు.
అవి తప్పు...
ఆర్థిక వ్యవస్థ బాగుందని చెప్పేందుకు ఈ మూడు బాలీవుడ్ సినిమాలు పెద్ద ఎత్తున కలెక్షన్లు వసూలు చేయడమే నిదర్శనమని అభిప్రాయపడ్డారు. 2017లో నిరుద్యోగ రేటు 45 ఏళ్ల గరిష్టానికి చేరుకున్నట్లుగా NSSO నివేదించింది. ఈ నివేదిక సరికాదని ఆయన అన్నారు. భారత్, బ్రెజిల్లో ఆర్థిక మందగమనం ప్రభావం ఎక్కువగా ఉందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) చెప్పడంపై కూడా స్పందించారు. ఐఎంఎఫ్వి అసంపూర్ణ లెక్కలు అన్నారు.
కేంద్రమంత్రి సినిమాల గురించి అసలేమన్నారు?
'అక్టోబర్ 2న హాలీడే సందర్భంగా మూడు హిందీ సినిమాలు ఆ ఒక్కరోజులోనే రూ.120 కోట్ల బిజినెస్ చేశాయి. భారత ఆర్థిక వ్యవస్థ బాగా లేనట్లయితే ఒకే రోజులో మూడు సినిమాలు అంత వ్యాపారాన్ని ఎలా చేయగలిగాయి' అని రిపోర్టర్లతో కేంద్రమంత్రి అన్నారు.
అందుకే అవి సరికాదు...
ఆర్థిక వ్యవస్థ బాగుందని చెప్పేందుకు తాను 10 నిదర్శనాలు మీకు ఇచ్చానని, కానీ అందులో ఒక్క దానిని కూడా నివేదికలు (NSSO) చెప్పవని, కాబట్టి అలాంటి నివేదికలు సరికాదనేది తన అభిప్రాయమని చెప్పారు.
దుమ్మురేపుతున్న వసూళ్లు
ఇటీవల వార్, చిచ్చోరే, భారత్ వంటి బాలీవుడ్ సినిమాలతో పాటు సైరా కూడా విడుదలైంది. ఈ సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. సైరా ఇప్పటి వరకు దాదాపు రూ.250 కోట్లు వసూలు చేసింది. వార్ సినిమా రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది. మిగతా సినిమాల వసూళ్లు కూడా బాగానే ఉన్నాయి.
సౌతిండియా సినిమాల దూకుడు..
చిరంజీవి హీరోగా వచ్చిన సైరా నరసింహా రెడ్డి కలెక్షన్లు పదో రోజు వరకే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లు దాటాయి. అయితే హిందీ వర్షన్ మాత్రం కేవలం రూ.8 కోట్లకు అటు ఇటుగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాను బాలీవుడ్ సినిమాలు వార్ వంటివి దెబ్బతీశాయి. వార్ సినిమా తొమ్మిది రోజుల్లోనే రూ.250 కోట్లకు పైగా వసూలు చేసింది. 2019లో రూ.200 కోట్లు వసూలు చేసిన సినిమాల్లో పేటా, విశ్వాసం, సాహో, సైరా ఉన్నాయి.