పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్(పీఎంసీ) బ్యాంక్ లిమిటెడ్ దివాలా వెనుక జరిగిన అక్రమాలు తవ్వే కొద్దీ వెలుగులోకి వస్తున్నాయి. ఒకే ఒక్క కంపెనీ దివాలా తీయడంతో ఈ బ్యాంకు కూడా దివాలా పరిస్థితికి వచ్చేసింది. కారణం.. ఈ కో-ఆపరేటివ్ బ్యాంకు రుణ వితరణలో మూడో వంతు రుణాలు కేవలం హెచ్డీఐఎల్ కంపెనీకే ఇవ్వడం.
ఈ వ్యవహారంలో ఇద్దరు వ్యక్తులు కీలకంగా వ్యవహరించినట్లు పీఎంసీ బ్యాంకు స్కాంపై ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తోన్న ప్రముఖ ఆడిటింగ్ సంస్థ గ్రాంట్ థోర్న్టన్ చెబుతోంది. ఐపీ పెట్టిన కంపెనీకి బ్యాంకు నిధులను రుణాల రూపంలో మళ్లించడంలో బ్యాంకు మాజీ ఛైర్మన్, మాజీ ఎండీ తమ వంతు పాత్ర పోషించారని, అందుకే పీఎంసీ బ్యాంకు దివాలా తీసిందని తేల్చింది.

గతంలోనే బ్యాంకు దివాలా తీసేది...
నిజానికి పీఎంసీ బ్యాంక్ 35 ఏళ్ల క్రితమే డేంజర్ బెల్స్ మోగించింది. 1986-87 సంవత్సరంలోనే ఈ బ్యాంకు దివాలా తీసేది. అయితే అప్పట్లో వాధ్వాన్ కుటుంబానికి చెందిన కొన్ని కంపెనీలు బ్యాంకును గట్టెక్కడానికి అవసరమైన నిధులు సర్దుబాటు చేశాయి. ఆ తరువాత 2004లో కూడా మరోసారి బ్యాంకు ఇబ్బందుల్లో పడితే వాధ్వాన్ కుటుంబమే మల్లీ రూ.100 కోట్ల వరకు డిపాజిట్ల రూపంలో సర్దుబాటు చేసింది. దీంతో పీఎంసీ బ్యాంకు కోలుకుంది. ఆ తరువాత 2011 సంవత్సరం నాటికి ఈ బ్యాంకు 57 బ్రాంచీలకు, రూ.2,824 కోట్ల డిపాజిట్ల స్థాయికి ఎదిగింది. అయితే పీఎంసీ బ్యాంకు కుంభకోణం వెలుగు చూసేసరికి రుణాల మొత్తంలో 73 శాతం ఒక్క హెచ్డీఐఎల్కే ఇచ్చినట్లుగా రికార్డులు చెబుతున్నాయి.

హెచ్డీఐఎల్కు, పీఎంసీకి ఏంటి సంబంధం?
గతంలో పీఎంసీ బ్యాంకు రెండుసార్లు దివాలా పరిస్థితికి రాగా ఆదుకున్న వాధ్వాన్ కుటుంబానికి చెందిన కంపెనీలలో ఒక కంపెనీయే ఈ హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(హెచ్డీఐఎల్). దీంతో ఈ కుటుంబం అన్నా, ఈ కుటుంబానికి చెందిన కంపెనీలన్నా బ్యాంకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు ఎంతో కృతజ్ఞత. ఆ కృతజ్ఞతతోనే వారు హెచ్డీఐఎల్కు అవసరమైనప్పుడల్లా రుణాలు ఇచ్చి ఆదుకోవడం ప్రారంభించారు. 2007లో హెచ్డీఐఎల్ లిస్టెడ్ కంపెనీగా మారింది. పైగా పీఎంసీ బ్యాంకుకు రుణాలన్నీ తీర్చేసింది కూడా. అదే తరుణంలో అదనపు నిధుల కోసం ఇతరత్రా బ్యాంకులను కంపెనీ సంప్రదించడం ప్రారంభించింది.

‘థ్యాంక్స్ గివింగ్' కింద యథేచ్ఛగా రుణవితరణ...
హెచ్డీఐఎల్ బ్యాంకు రుణాల కోసం అన్వేషిస్తోందన్న విషయం తెలియగానే పీఎంసీ బ్యాంకు డైరెక్టర్లు బాధపడ్డారు. ఎంతైనా ఒకప్పుడు తమ బ్యాంకును ఆదుకున్న గ్రూపు.. తాముండగా రుణాల కోసం వేరే బ్యాంకుల తలుపుతట్టడం ఏమిటనుకున్నారో ఏమోగానీ.. ఎంత కావాలంటే అంత అప్పు తామే ఇస్తామన్నారు. పైగా ఒకప్పుడు తమను ఆదుకున్న వాధ్వాన్ కుటుంబానికి చెందిన రాజేశ్ వాధ్వాన్ తమ్ముడు రాకేశ్ వాధ్వాన్ ప్రస్తుతం హెచ్డీఐఎల్ సంస్థ ఛైర్మన్గా ఉన్నారాయె. దీంతో ఇక అప్పట్నించి పీఎంసీ బ్యాంకు పూర్తిగా ఆ సంస్థ ఇంటి బ్యాంకు మాదిరిగా మారిపోయింది.

కష్టకాలంలో హెచ్డీఐఎల్...
పీఎంసీ బ్యాంకు బాగా పుంజుకునే సమయానికి.. అంటే 2013 నాటికి హెచ్డీఐఎల్ కంపెనీకి కష్టాలు మొదలయ్యాయి. ఈ కంపెనీ బ్యాంకులకు రుణాలు చెల్లించలేని స్థితికి చేరుకుంది. దీంతో పీఎంసీ బ్యాంకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఆందోళన పడ్డారు. ఎందుకంటే అప్పటికే ఈ బ్యాంకు మొత్తం రుణాల్లో మూడో వంతు ఈ ఒక్క కంపెనీకే ఇచ్చి ఉన్నారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి బ్యాంకు మొత్తం డిపాజిట్లు రూ.11,617.34 కోట్లు కాగా, రుణాల కింద ఇచ్చిన మొత్తం రూ.8,383 కోట్లు. పైగా ఈ మొత్తంలో మూడో వంతు అంటే.. దాదాపు రూ.6,500 కోట్లు ఒక్క హెచ్డీఐఎల్ గ్రూప్ కంపెనీలకే ఇచ్చింది.

తప్పిదాన్ని కప్పిపుచ్చేందుకు ఏం చేశారంటే...
హెచ్డీఐఎల్ కంపెనీకి అనుబంధంగా 18 కంపెనీలు ఉన్నాయి. వీటికి సంబంధించి పీఎంసీ బ్యాంకులో 44 రుణ ఖాతాలు ఉన్నాయి. వేల కోట్ల రూపాయలను రుణాల కింద తీసుకున్న ఈ గ్రూప్ కంపెనీలు గత రెండేళ్లుగా పీఎంసీ బ్యాంకుకు ఒక్క పైసా కూడా చెల్లించలేదు. దీంతో హెచ్డీఐఎల్ కంపెనీని ఎన్పీఏ కింద చేరిస్తే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తెలిసిపోతుందని, ఆ తరువాత బ్యాంకుకు ఇబ్బందులు ఏర్పడతాయని భావించిన బ్యాంక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు.. బ్యాలెన్స్ షీట్లో హెచ్డీఐఎల్ రుణాలను స్టాడర్డ్ కిందనే చూపిస్తూ వచ్చారు. అంతేకాకుండా బ్యాంకులోని 44 హెచ్డీఐఎల్ రుణ ఖాతాల్లో ఉన్న మొత్తాన్ని కొద్దికొద్దిగా విభజిస్తూ.. 21,049 నకిలీ అకౌంట్లలోకి మార్చారు. పైగా హెచ్డీఐఎల్ వీటిని వాడుకోవడానికి వీలుగా ఆయా ఖాతాలకు పాస్వర్డ్ భద్రతను కూడా కల్పించారు.

అక్రమాలు వెలుగు చూసింది ఇలా...
పీఎంసీ బ్యాంకు సృష్టించిన నకిలీ ఖాతాలు ఆర్బీఐకి సమర్పించిన రుణ ఖాతాల వివరాల్లోనూ ఉన్నాయి. అయితే కోర్ బ్యాంకింగ్ సిస్టంలో మాత్రం ఇవి కనిపించకుండా చేశారు. దీనికోసం బ్యాంకు సాఫ్ట్వేర్ను కూడా ట్యాంపర్ చేశారు. ఈ విషయంలో బ్యాంకు మాజీ ఛైర్మన్ వర్యాం సింగ్, మాజీ ఎండీ జాయ్ థామస్ల ప్రమేయం ఉంది. బ్యాంకు లావాదేవీల్లో ఉండే స్క్ఱూటినీ, ఇంటర్నల్ చెకింగ్ సహా అయిదు లేయర్లనూ వీరు తప్పించారు. అయితే ఈ అక్రమ లోన్ ఖాతాల వ్యవహారం ఆ బ్యాంకులోని క్రెడిట్ విభాగంలో పనిచేసే ఉద్యోగినుల వల్లే బయటికి పొక్కింది. తమ బ్యాంకులో కొన్ని వేల నకిలీ ఖాతాలు తమ దృష్టికి వచ్చాయంటూ వారు ఆర్బీఐకి ఫిర్యాదు చేయడంతో పీఎంసీ బాగోతం బయటికి వచ్చింది. దీంతో ఆర్బీఐ రంగంలోకి దిగడం, పీఎంసీ బ్యాంకు ఖాతాదారుల నగదు ఉపసంహరణపై కోత విధించడం, మరోవైపు బ్యాంక్ మాజీ ఎండీ జాయ్ థామస్ను అదుపులోకి తీసుకోవడం చకచకా జరిగాయి.
More From GoodReturns

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications