లాభాలు స్వీకరిస్తున్నారు.. అందుకే పెట్టుబడులు తగ్గుతున్నాయ్
కొంత కాలంగా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెడుతున్న ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనివల్ల ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు తగ్గుముఖం పడుతున్నాయి. గత సెప్టెంబర్ నెలలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లోకి దాదాపు రూ.6,489 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ పెట్టుబడులు నాలుగు నెలల క్రితం ఉన్న స్థాయిలో ఉన్నాయి. కార్పొరేట్ పన్ను తగ్గింపు నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డ్ స్థాయిలో పెరిగిన విషయం తెలిసిందే. దీన్ని అవకాశంగా తీసుకున్న ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరించడానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అందుకే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లోకి పెట్టుబడులు తగ్గించినట్టు గణాంకాల ద్వారా తెలుస్తున్నది.
ఆ బ్యాంకులో విత్డ్రాపై పరిమితి, రంగంలోకి నిర్మలా సీతారామన్!
ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ స్కీమ్స్ లోకి...
* గత సెప్టెంబర్ నెలలో ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ స్కీమ్స్ లోకి రూ.6,609 కోట్ల నిధులు వచ్చాయి. ఇదే కాలంలో క్లోజ్ ఎండెడ్ ఈక్విటీ ప్లాన్స్ లో నుంచి రూ.120 కోట్లు తరలిపోయాయి. మొత్తంగా ఈక్విటీ ఫండ్స్ లోకి వచ్చినది రూ.6,489 కోట్లుగా ఉన్నట్టు భారత మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ వెల్లడించింది.
* గత ఆగస్టు నెలలో ఈక్విటీ, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ లోకి రూ.9,090 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జులై నెలలో రూ. 8,092 కోట్లు, జూన్ లో రూ.7,585 కోట్లు, మే నెలలో రూ.4,968 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
సిప్స్ తో పెట్టుబడులు
* ఇన్వెస్టర్లు ఈక్విటీ ఫండ్స్ లోకి క్రమానుగత పెట్టుబడి పథకాల (సిప్స్) ద్వారా ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు. ఏకమొత్తంగా వచ్చే సొమ్ము మిశ్రమంగా ఉంటోంది.
* కార్పొరేట్ పన్ను తగ్గిన తర్వాత మార్కెట్లో ర్యాలీ నెలకొంది. ఈ సమయాన్ని ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు వినియోగించుకున్నట్టు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థలో రికవరీ అంతంత మాత్రంగా ఉంది. రికవరీకి సంబంధించిన సానుకూల సంకేతాలు వెలువడితే పెద్ద మొత్తంలో ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.
* ఈక్విటీ మార్కెట్లు వృద్ధిని నమోదు చేసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ లోను సానుకూల ట్రెండ్ కనిపించడానికి అవకాశం ఉందని అంటున్నారు.
ఆస్తుల్లో వృద్ధి...
* ఈక్విటీ ఫండ్స్ లోకి పెట్టుబడులు తగ్గినప్పటికీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆస్తులు మాత్రం సెప్టెంబర్ నెలలో రూ.7.57 లక్షల కోట్లకు పెరిగాయి. ఆగస్టు నెలలో వీటి ఆస్తులు రూ. 7.16 లక్షల కోట్లుగా ఉన్నాయి.
* సెప్టెంబర్ లో మ్యూచువల్ ఫండ్స్ నుంచి రిడెంప్షన్స్ రూ.1.52 లక్షల కోట్లకు పెరిగాయి. ఆగస్టులో ఈ మొత్తం రూ.1.02 లక్షల కోట్లుగా నమోదయింది.
* డెట్ ఓరియెంటెడ్ స్కీమ్స్ ఎక్కువగా పెట్టుబడులు విమోచనం జరిగింది. ఈ స్కీమ్స్ నుంచి రూ.1.58 లక్షల కోట్లు బయటకు వెళ్లాయి. డెట్ ఓరియెంటెడ్ స్కీమ్స్, లిక్విడ్ ఫండ్స్ (ట్రెజరీ బిల్స్, సర్టిఫికెట్ అఫ్ డిపాజిట్, కమర్షియల్ పేపర్) నుంచి రూ.1. 41 లక్షల కోట్ల నిధులు వెళ్లాయి.
గోల్డ్ ఈటీఎఫ్స్ కళకళ
* ఆగస్టులో గోల్డ్ ఎక్స్చేంజి ట్రేడెడ్ ఫండ్స్ నుంచి రూ.145 కోట్ల పెట్టుబడులు బయటకు వచ్చాయి. అయితే సెప్టెంబర్ లో మాత్రం ఈ ఫండ్స్ లోకి రూ. 44 కోట్ల ఫండ్స్ వచ్చాయి.
* బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో గోల్డ్ ఎఫ్టీఎఫ్స్ లోకి పెట్టుబడులు పెరుగుతున్నట్టు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
* మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలో 44 కంపెనీలున్నాయి. వీటి నిర్వహణలోకి మొత్తం ఆస్తులు ఆగస్టులో రూ.24.51 లక్షల కోట్లు ఉండగా.. సెప్టెంబర్ లో రూ.25.47 లక్షల కోట్లకు పెరిగాయి.
* సిప్స్ లోకి పెట్టుబడులు సెప్టెంబర్ నెలలో రూ.8,231 కోట్ల నుంచి రూ.8,263 కోట్లకు పెరిగాయి. సిప్ ఖాతాల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. దీన్ని బట్టి ఇన్వెస్టర్లలో సిప్స్ పై ఆసక్తి పెరుగుతున్నట్టు స్పష్టమవుతోంది.