ఆ బ్యాంకులో విత్డ్రాపై పరిమితి, రంగంలోకి నిర్మలా సీతారామన్!
న్యూఢిల్లీ: పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంకు (PMC) కస్టమర్లకు డిపాజిట్ విత్ డ్రాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పరిమితి విధించిన నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆ బ్యాంకు బాధితులను గురువారం కలుసుకున్నారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. సమస్యలపై ఆర్బీఐతో తాను మాట్లాడుతానని ఆమె హామీ ఇచ్చారు.
15 ని.ల్లో పని పూర్తి.. 3 విభాగాలుగా 500 రకాల సేవలు
ఇది ఆర్బీఐ రెగ్యులేటరీ అంశం కాబట్టి నేరుగా ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఎలాంటి సంబంధం లేదని నిర్మల తెలిపారు. అయితే తన వైపు నుంచి గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖలతో కలిసి పూర్తిగా తెలుసుకుంటామని, ఈ మేరకు తన మంత్రిత్వ శాఖ అధికారులను ఆదేశిస్తానని తెలిపారు.
ఇటీవల పీఎంసీ బ్యాంకు నగదు ఉపసంహరణపై ఆర్బీఐ పరిమితులు విధించిన విషయం తెలిసిందే. తొలుత రూ.1000 కంటే ఎక్కువ డిపాజిట్ చేసుకోలేని విధంగా పరిమితి విధించింది. ఆ తర్వాత దానిని రూ.10,000కు పెంచింది. అయితే కస్టమర్లు ఈ నిబంధనలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో నిర్మల బాధితులను కలుసుకున్నారు.
నిర్మలా సీతారామన్కు గురువారం మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిమిత్తం ముంబైకి వచ్చారు. ఈ సమయంలో బాధితులను కలుసుకున్నారు. పీఎంసీ బ్యాంకులో తాము డిపాజిట్ చేసుకున్న సొమ్మును నయా పైసలతో సహా తక్షణమే చెల్లించేలా చూడాలని కస్టమర్లు ఆమెకు విజ్ఞప్తి చేశారు. పీఎంసీ బ్యాంకు వ్యవహారంపై విధానపరమైన నిర్ణయాన్ని వెల్లడించాలని, నిర్దేశిత గడువులోగా తమ డబ్బులను చెల్లించేలా హామీ వచ్చేలా చూడాలన్నారు.
బ్యాంకు కస్టమర్లను కలుసుకున్న నిర్మలా సీతారామన్.. పీఎంసీ బ్యాంకు మూత పడటానికి గల కారణాలను వారికి వివరించారు. బ్యాంకు యాజమాన్యం ఆర్థిక మోసాలకు పాల్పడిందని, అందువల్లే నగదు విత్ డ్రా చేయడంపై ఆంక్షలను విధించాల్సి వచ్చిందని అన్నారు. అయినప్పటికీ కస్టమర్ల ఇబ్బందుల నేపథ్యంలో ఆర్బీఐతో మాట్లాడుతానని చెప్పారు.
వారితో సమావేశం ఆమె మీడియాతో మాట్లాడారు. ఖాతాదారుల ఆవేదనను తాను అర్థం చేసుకోగలనని, పాలనాపరమైన ఆంక్షల వల్ల వారందరికీ వెంటనే డబ్బును విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించలేకపోతున్నామని, ఈ అంశాన్ని తాను ఆర్బీఐ గవర్నర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆంక్షలను సడలించి, ఒకేసారి డబ్బును విత్ డ్రా చేసుకునేలా ఏర్పాటు చేస్తానన్నారు. ఒకేసారి మొత్తం ఖాతాదారులు అందరూ తమ డిపాజిట్లను వెనక్కి తీసుకోవడంపై రిజర్వు బ్యాంకు ఆంక్షలు ఉన్నాయన్నారు.