సినిమాలకు సంబంధించిన వ్యక్తిని కాదు: సైరా సినిమాపై శాంతా బయోటిక్ చైర్మన్
కళలను, కళాకారులను ప్రోత్సహించడంలో టీ సుబ్బిరామిరెడ్డి ఎప్పుడూ ముందుంటారు. ఆరు దశాబ్దాలుగా తన సినీ, వ్యాపార, రాజకీయ జీవితంలో సినీ కళాకారులతో ఎంతో సన్నిహితంగా ఉంటూ, ప్రతిభ కలిగిన వారిని ప్రోత్సహిస్తూ కళాబంధుగా కీర్తించబడుతున్నారు. ఇటీవల విడుదలైన మెగాస్టార్ చిరంజీవి చారిత్రాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి ప్రపంచవ్యాప్తంగా అఖండ విజయం సాధించింది.
దీంతో ఆ చిత్ర యూనిట్ను సుబ్బిరామిరెడ్డి ప్రత్యేకంగా సన్మానించారు. బుధవారం రాత్రి పార్క్ హయత్ హోటల్లో జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో మెగాస్టార్ చిరంజీవిని ఘనంగా సత్కరించారు సుబ్బిరామిరెడ్డి. సైరా నరసింహా రెడ్డి బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో పద్మభూషణ్ అవార్డు గ్రహీత, శాంతా బయోటిక్ చైర్మన్ డాక్టర్ వరప్రసాద్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ... తాను సినిమా ప్రపంచానికి సంబంధించిన వ్యక్తిని కాదని, కాబట్టి తన మాట కొంత నిజాయితీగా ఉంటుందన్నారు. సైరా చిత్ర కథాంశం చాలా పవిత్రమైనదని, దేశభక్తికి సంబంధించినదని ప్రశంసలు కురిపించారు. ఈ రోజు దేశభక్తి కొడగట్టిపోతున్న తరుణంలో మళ్లీ దానిని తట్టిలేపడానికి ఈ చిత్రాన్ని నిర్మించాలనుకోవడం గొప్ప విషయమన్నారు.
సైరాకు కథనం, మదనం తయారు చేసిన పరుచూరి బ్రదర్స్కు, ఈ కథనాన్ని మంచి మాటల రూపంలో మలచిన సాయి మాధవ్ బుర్రాకు, ఇంత గొప్ప సృష్టిని వెండితెరపై ఆవిష్కరించిన సురేందర్రెడ్డికీ జేజేలు అన్నారు. ఇవన్నీ సమీకృతం చేసి, తానే దానికి ఆత్మ అయి, ఆయువుపట్టు అయి అద్భుతంగా దానికి ప్రాణ ప్రతిష్ట చేసిన తన ఆత్మీయుడు చిరంజీవికి పెద్ద జేజేలు అన్నారు.
ఇంతమందిని సమాయత్తం చేసి వీళ్లందరికీ అవకాశం, ఒక వేదిక కల్పించి గొప్ప పని చేసిన రామ్ చరణ్ తన వరకు ఇవాళ పెద్ద హీరో అని ప్రశంసించారు. అతను ఈ గొప్ప కార్యానికి పూనుకోకుంటే ఇంత గొప్ప చిత్రం మన ముందుకు వచ్చేది కాదన్నారు. హాట్సాఫ్ టు రామ్ చరణ్ అని కొనియాడారు. ఇలాంటి గొప్ప మేనల్లుడిని పొందిన తన మిత్రుడు అల్లు అరవింద్ కూడా గొప్పవాడు అన్నారు.


Click it and Unblock the Notifications