ఇండియా బుల్స్కు షాక్! లక్ష్మీవిలాస్ బ్యాంకుతో విలీనానికి ఆర్బీఐ ‘నో’...
బ్యాంకింగ్ రంగంలోకి అడుగుపెట్టాలనే ఆలోచనలో ఉన్న ఇండియా బుల్స్ హైసింగ్ ఫైనాన్స్(ఐబీహెచ్ఎఫ్)కు చుక్కెదురైంది. లక్ష్మీ విలాస్ బ్యాంకు(ఎల్వీబీ)ని విలీనం చేసుకోవాలన్న ప్రతిపాదనను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తిరస్కరించింది.
అయితే ఈ విలీన ప్రతిపాదనకు ఆర్బీఐ అంగీకరించకపోవడానికి కారణాలు ఏమిటో తెలియరాలేదుగానీ.. మొత్తానికి ఆర్బీఐ తిరస్కరణతో గత అయిదు నెలలుగా ఇటు లక్ష్మీ విలాస్ బ్యాంకు.. అటు ఇండియా బుల్స్ హైసింగ్ ఫైనాన్స్ సంస్థల్లో ఉన్ అనిశ్చితి మాత్రం తొలగిపోయింది.
93 ఏళ్ల చరిత్రక కలిగిన ఎల్వీబీ...
తమిళనాడు రాష్ట్రంలోని కరూర్కు చెందిన ఏడుగురు వ్యాపారులు 1926లో లక్ష్మీ విలాస్ బ్యాంకును ఏర్పాటు చేశారు. ఈ బ్యాంకుకు దాదాపు 93 ఏళ్ల చరిత్ర ఉంది. లక్ష్మీ విలాస్ బ్యాంకుకు 19 రాష్ట్రాల్లోని 150 నగరాల్లో మొత్తం 569 శాఖలున్నాయి. వీటిలో 4881 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ బ్యాంకుకు 21.86 లక్షల ఖాతాదారులున్నారు. ప్రస్తుతం ఎల్వీబీ డిపాజిట్లు రూ.30,787 కోట్లు. రూ.24,123 కోట్లు రుణాలుగా ఇచ్చింది. అయితే ఈ బ్యాంకు లాభాల్లో లేదు. గత ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల కాలంలో రూ.630 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది.
ఏన్పీఏలు, అవకతవకలతో విలవిల...
ప్రస్తుతం లక్ష్మీ విలాస్ బ్యాంకు పరిస్థితి ఆశాజనకంగా లేదు. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్(ఎన్పీఏ) ఈ బ్యాంకును బాగా దెబ్బతీశాయి. దీనికితోడు బోర్డులోని డైరెక్టర్లపై కూడా ఆరోపణలు వచ్చాయి. మరోవైపు లక్ష్మీ విలాస్ బ్యాంక్ మొండి బాకాయిలు ఏకంగా 13.95 శాతానికి పెరిగిపోగా.. క్యాపిటల్ అడ్వక్వసీ రేషియో 7.57 శాతానికి పరిమితమైంది. ఇక ఇండియా బుల్స్ గ్రూప్లో భాగమైన ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ప్రస్తుత విలువ రూ.17,792 కోట్లు. హౌసింగ్ ఫైనాన్స్ మార్కెట్లో థర్డ్ ప్లేస్లో ఉన్న ఐహెచ్ఎఫ్ గత ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల్లో రూ.3,084 కోట్ల లాభాలు ఆర్జించింది. దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థ ఇప్పటి వరకు రూ.2.4 లక్షల కోట్లు రుణాలుగా ఇచ్చింది.
ఎల్వీబీపై ఇండియా బుల్స్ కన్ను...
రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారం సాగిస్తున్న ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కన్ను ఈ బ్యాంకుపై పడింది. ఇన్ఫ్రా ఫైనాన్స్ మార్కెట్లో ఒడిదొడుకుల కారణంగా ఐబీహెచ్ఎఫ్ వంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలకు నిధుల సమీకరణ కష్టంగా మారింది. గత ఏడాది డిసెంబర్ క్వార్టర్లో కంపెనీ రుణాల మంజూరీ 65 శాతం పడిపోయింది. మార్చిలో కాస్త కుదుటపడినా అది సాధారణ స్థాయి కన్నా తక్కువగానే నమోదైంది. ఈ నేపథ్యంలో నిధుల సమీకరణ కోసం ఎలాగైనా బ్యాంకింగ్ రంగంలోకి ప్రవేశించాలని భావించిన ఈ సంస్థ.. లక్ష్మీ విలాస్ బ్యాంకును గనుక తాను విలీనం చేసుకోగలిగితే బాగుంటుందని భావించి, ఆ దిశగా పావులు కదిపింది.
మే 7న ఆర్బీఐకి విలీన ప్రతిపాదన...
ఈ నేపథ్యంలో ఈ ఏడాది మే నెలలో ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్లో స్వచ్ఛంద విలీనానికి అనుమతించాలంటూ ఆర్బీఐకి లక్ష్మీ విలాస్ బ్యాంకు దరఖాస్తు చేసుకుంది. సాధారణంగా ఇలాంటి విలీనాల్లో బ్యాంకు లైసెన్సును మరో సంస్థకు బదలాయించేందుకు ఆర్బీఐ అంగీకరించదనే వ్యాఖ్యానాలు వినిపించాయి. అయితే బ్యాంకు లైసెన్సు ఎల్వీబీ పేరు మీదనే కొనసాగించే వీలులేకపోలేదనే ఊహాగానాలు సాగాయి. కానీ అందరి అంచనాలు తలకిందులయ్యాయి. అయిదు నెలల అనంతరం.. ఈ విలీన ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం ఓ లేఖలో తెలిపింది. ఈ విషయాన్ని ఇటు లక్ష్మీ విలాస్ బ్యాంకు, అటు ఇండియా బుల్స్ గ్రూప్.. రెండూ కూడా స్టాక్ ఎక్స్ఛేంజ్లకు తెలిపాయి.
విలీన ఒప్పందం ఇలా...
ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్లో లక్ష్మీ విలాస్ బ్యాంక్ విలీనానికి బ్యాంకు బోర్డు ఆమోద ముద్ర వేసింది. ఒప్పందం ప్రకారం ప్రతి 100 ఎల్వీబీ షేర్లకు 14 ఇండియా బుల్స్ కేటాయించనున్నారు. మెర్జర్ అనంతరం కంపెనీకి ఇండియాకి ఇండియాబుల్స్ గ్రూప్ ప్రమోటర్ సమీర్ గెహ్లాట్ వైస్ ఛైర్మన్గా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఐహెచ్ఎఫ్ ఎండీ గగన్ బంగా, ఎల్వీబీ సీఈఓ పార్థసారథి ముఖర్జీ జాయింట్ ఎండీలుగా, హెఐచ్ఎఫ్ ఈడీ అజిత్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వ్యవహరించనున్నారు.
విలీనం జరిగేదే, కానీ...
ఒకవైపు ఎన్పీఏలు లక్ష్మీ విలాస్ బ్యాంకు అభివృద్ధిని దెబ్బతీయగా, మరోవైపు దాని డైరెక్టర్లు మోసానికి పాల్పడడం కూడా బ్యాంకు ప్రతిష్టను మరింత మసకబార్చింది. ఈ బ్యాంకులో నిధుల దుర్వినియోగంపై ఢిల్లీ పోలీసులు ఒక కేసును కూడా నమోదు చేశారు. దీంతోపాటు వరసగా రెండేళ్లపాటు అసెట్స్పై ప్రతికూల ఫలితాలు తెచ్చుకోవడంతోపాటు, రిస్క్ను తట్టుకునేంత క్యాపిటల్ లేకపోవడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత నెలలో ఈ బ్యాంకును ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ (పీసీఏ) ఫ్రేమ్వర్క్లోకి తీసుకొచ్చింది.