ముందుకురాని రైతు.. డిమాండ్ తగ్గిన బంగారం: పెరుగుతున్న ధరలు
కోల్కతా: దసరా, దీపావళి పండుగ సీజన్లో బంగారం అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సీజన్ పైన పసిడి వ్యాపారులు ఆశలు పెట్టుకుంటారు. కానీ ఈ నవరాత్రి సమయంలో సేల్స్ ఆశించిన మేర లేవంట. మార్కెట్, బంగారం ధరల అస్థిరత వంటి పలు కారణాల వల్ల గత నవరాత్రి - దసరా సీజన్తో పోలిస్తే ఈసారి సేల్స్ 40 శాతం నుంచి 50 శాతం వరకు తగ్గాయని తెలుస్తోంది. దేశంలో బంగారం డిమాండ్ గ్రామీణ ప్రాంతాల్లోనే 60 శాతం వరకు ఉంటుంది. ఇక్కడ పసిడి డిమాండ్ పెరగలేదు. రైతులకు పంట చేతికి రాకపోవడంతో గ్రామీణ డిమాండ్ ఏమాత్రం పెరగలేదు.
3నిమిషాల్లో ఈ అకౌంట్ తెరవొచ్చు: లోన్, క్రెడిట్ కార్డ్ సహా బెనిఫిట్స్...
రెండ్రోజులు మినహా.. ధరలు పెరగడంతో దూరం
దసరా - నవరాత్రి సీజన్లో బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టడంతో డిమాండ్ పెరుగుతుందని భావించామని, కానీ అంతలోనే ధరలు తిరిగి పుంజుకున్నాయని, దీంతో కొనుగోలుదారులు బంగారంకు దూరంగా ఉన్నారని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెల్లర్స్ డొమెస్టిక్ కౌన్సెల్ చైర్మన్ ఆనంత పద్మనాభన్ అన్నారు. నవరాత్రి మొదటి రెండు రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర రూ.38,813గా ఉంది. దసరా, దీపావళి పండుగ సీజన్ ఎంతో ముఖ్యం. కానీ మూడో రోజు నుంచి బంగారం ధరలు పెరగడం ప్రారంభం అయ్యాయి. దీంతో కస్టమర్లు కొనుగోలుకు ఆసక్తి చూపించలేదు. ఆ తర్వాత ధరలు క్రమంగా రెండు శాతం పెరిగి 39,590కు చేరుకున్నాయి.
రైతులు ముందుకు రాలేదు.. పడిపోయిన బంగారం సేల్స్...
నా 38 సంవత్సరాల వ్యాపారంలో నవరాత్రి సమయంలో ఇంత తక్కువగా బంగారానికి డిమాండ్ ఎప్పుడూ చూడలేదని, దాదాపు 50 శాతం సేల్స్ తగ్గిపోయాయని మహారాష్ట్రలోని అకోలాకు చెందిన వ్యాపారి నితిన్ ఖండేవాలా అన్నారు. ముఖ్యంగా వ్యవసాయదారులు బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదన్నారు. చాలా ప్రాంతాల్లో వర్షాలు ఆలస్యంగా కురిశాయని, దీంతో విత్తనం ఆలస్యమైందని చెప్పారు. ఈ సంవత్సరం చివరలో పంట చేతికి వస్తుందని, అప్పుడు మాత్రమే రైతుల చేతిలో నగదు ఉంటుందన్నారు.
ఆ ధర ఉంటే దీపావళికి సేల్స్ పెరగొచ్చు
మహారాష్ట్ర గ్రామీణ ప్రాంతాల్లోను తమకు బంగారం దుకాణాలు ఉన్నాయని, దీపావళి సమయంలో గ్రామీణులు, రైతుల నుంచి డిమాండ్ ఉంటుందని భావిస్తున్నామని పీఎన్జీ జ్యువెల్లర్స్ ఎండీ సౌరబ్ గాడ్గిల్ అన్నారు. బంగారం ధరలు రూ.37,000 నుంచి రూ.38,000 మధ్య ఉంటే ధన్తెరాస్ - దీపావళి సీజన్లో బంగారం సేల్స్ బాగుంటాయని జ్యువెల్లర్స్ ఆశిస్తున్నారన్నారు.
సావరిన్ బంగారం వైపు చూపులు...
గత ఏడాదితో పోలిస్తే ఈసారి బంగారం సేల్స్ తగ్గవచ్చునని ముంబైకి చెందిన వామన్ హరి పీథే జ్యువెల్లర్స్ ఎండీ ఆదిత్య పీతే అన్నారు. అయితే, రూ.10 లక్షలు అంతకంటే ఎక్కువ బులియన్ ఇన్వెస్టర్లు ఈసారి సావరీన్ గోల్డ్ బాండ్స్ వైపు చూడవచ్చునని అభిప్రాయపడ్డారు.
పెరిగిన బంగారం ధరలు
గురువారం బంగారం ధరలు వారం గరిష్టానికి చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ పసిడి 0.4 శాతం పెరిగి 1,511.24 డాలర్లకు చేరుకుంది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.3 శాతం పెరిగి ఔన్స్కు 1,516.50 డాలర్లకు చేరుకుంది.
హైదరాబాద్లో రూ.40వేలకు చేరువలో బంగారం ధర..
బంగారం ధరలు గురువారం భారీగా పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.380 పెరిగి, రూ.39,980కి చేరుకుంది. అంటే రూ.40,000కు చేరువైంది. గ్లోబల్ మార్కెట్లో బలమైన ట్రెండ్, దేశీయ జ్యువెల్లర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ నేపథ్యంలో పుంజుకుంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.360 పెరిగి రూ.36,650కి చేరుకుంది. వెండి ధర రూ.48,500 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.