ఇలా చేస్తే బాగుంటుంది. ఉద్యోగులకు కంపెనీల పాఠాలు!
ఈ మధ్య కాలంలో ఉద్యోగుల బాగోగుల గురించి కంపెనీలు అధిక శ్రద్ధ చూపుతున్నాయి. ముఖ్యంగా స్టార్టప్ కంపెనీలు ఈ విషయం లో చాలా ముందున్నాయి. ఒక ఉద్యోగి శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా ఫిట్ గా ఉంటేనా అతని పూర్తిస్థాయి ప్రతిభ వెలికివస్తుందని, అది కంపెనీకి బాగా ఉపయోగపడుతుందని గ్రహిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే చాలా కంపెనీలు ఉద్యోగులకు ఫిట్నెస్ లో, యోగ, మెడిటేషన్, మోటివేషనల్ థెరపీ లో శిక్షణ ఇప్పిస్తున్నాయి.
తాజాగా కొన్ని కంపెనీలు మరో అడుగు ముందుకు వేసి ఉద్యోగులకు ఆర్థిక క్రమ శిక్షణ, పెట్టుబడుల నిర్వహణ, పన్ను ఆదా విషయాల్లో శిక్షణ ఇప్పిస్తున్నాయి. ఇలా చేస్తే భవిష్యత్ లో ఎదురయ్యే ఎలాంటి సమస్యలు ఐనా తట్టుకొని నిలిచే సామర్థ్యం ఉద్యోగుల్లో నెలకొంటుందని కంపెనీలు భావిస్తున్నాయి. మిల్లీనియల్స్ కు జీత, భత్యాల రూపంలో భారీ వేతనాలు అందుతున్నాయి. కానీ ఆ మొత్తాన్ని సరైన మార్గంలో ఉపయోగించుకోక పోతే ఖర్చు మాత్రమే మిగిలే అవకాశాలు అధికం. అలా కాకుండా ఒక క్రమ పద్దతిలో చట్టబద్ధమైన ఇన్వెస్ట్మెంట్లు, సేవింగ్స్ చేస్తే అది వారి బంగారు భవిష్యత్కు పునాదులు వేస్తుందన్నది కంపెనీల విశ్వాసం.
ముందున్న స్టార్టప్ కంపెనీలు...
ఉద్యోగులకు ఆర్థిక అంశాల్లో శిక్షణ ఇచ్చే విషయంలో పెద్ద కంపెనీల సరసన స్టార్టుప్ కంపెనీలు కూడా చేరిపోతున్నాయి. బిగ్ బాస్కెట్, మైన్త్రా, వేక్ ఫిట్, నో బ్రోకర్ వంటి కంపెనీలు ముందువరుసలో ఉన్నాయి. హిందూస్తాన్ యూనీలీవర్ కూడా ఇలాంటి శిక్షణ అందిస్తున్నట్లు ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో వెల్లడించింది. ఆగష్టు లో మైన్త్రా త్రైవ్ పేరుతో ఇలాంటి శిక్షణ ను ప్రారంభించింది. ఇందులో ముఖ్య అంశం వెల్త్ మానేజ్మెంట్. మా ఉద్యోగులు మంచి ఇన్వెస్ట్మెంట్ హ్యాబిట్స్ అలవర్చుకోవాలని భావిస్తున్నాం. అలంటి విషయాల్లో నిపుణుల సలహాలు ఉద్యోగుల ఆర్థిక ఒత్తిడిని తగ్గించగలదని భావిస్తున్నాం అని మైన్త్రా హ్యూమన్ రిసోర్సెస్ హెడ్ అభిషేక్ సేన్ తెలిపారు. మిగితా కంపెనీలదీ ఇంచు మించు ఇదే దారి.
63% శాతం కంపెనీలు ....
భారత దేశంలో ఉద్యోగుల ఆర్థిక భద్రత, పొదుపు, పెట్టుబడుల విషయం లో కంపెనీలు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాయని వివిధ సర్వేలు వెల్లడిస్తున్నాయి. విల్లిస్ టవర్ వాట్సన్ నిర్వహించిన హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అధ్యయనంలో సుమారు మూడొంతుల కంపెనీలు ఈ విషయంలో ప్రత్యేక వ్యూహాలను రూపొందిస్తున్నామని తేలింది. ఇండియా లో సుమారు 63% కంపెనీలు ఇప్పటికే ఇలాంటి వ్యూహాలను కలిగి ఉండటమో, లేదా వాటిని రూపొందించుకునే ప్రయత్నాల్లో ఉండటమో చేస్తున్నాయని తెలిసింది. అంటే, దాదాపు అన్ని కంపెనీలు తమ ఉద్యోగుల బాగోగుల గురించి బాగానే ఆలోచిస్తున్నాయన్నమాట.
మహిళలకు ప్రత్యేకం...
ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. అది చదువు విషయంలో అయినా... పొదుపు విషయంలో నైనా వారి తర్వాతే ఎవైరైనా. అందుకే, మహిళా ఉద్యోగులకు ఆర్థిక అంశాల్లో తగు శిక్షణ ఇస్తే.. వారే కుటుంబానికి సంబందించిన పెట్టుబడులు, పొదుపు, పన్ను ఆదా చేసుకొనే విషయాల్లో సహకరిస్తారని కంపెనీలు గ్రహించాయి. బెంగళూరు కేంద్రంగా పనిచేసే గ్రోసరీస్ స్టార్టుప్ కంపెనీ బిగ్ బాస్కెట్ తమ మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తోంది. చాలా కుటుంబాల్లో మహిళలే పెట్టుబడులు, ఇతరత్రా విషయాల్లో కీలక పాత్ర పోషిస్తారు. అందుకే వారికి ఆర్థిక అంశాల్లో శిక్షణ ఇప్పిస్తున్నాం అని బిగ్ బాస్కెట్ హ్యూమన్ రిసోర్సెస్ వైస్ ప్రెసిడెంట్ తనూజ తివారీ పేర్కొన్నారు. కంపెనీకి సంబంధించిన అన్ని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల లో ని మహిళలకూ ఈ శిక్షణ అందించనుంది బిగ్ బాస్కెట్.
బోనస్ లు, విండ్ ఫాల్ గెయిన్స్...
ఉద్యోగులకు బోనస్, స్పెషల్ ఇన్సెంటివ్స్ రూపం లో లభించే పెద్ద మొత్తాలను సరైన మార్గంలో పెట్టుబడులుగా ఎలా మార్చాలో ఆర్థిక నిపుణులు శిక్షణ ఇస్తున్నారు. అలాగే, స్టార్టుప్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు విండ్ ఫాల్ గెయిన్స్ వస్తుంటాయి. కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ లభించినప్పుడు, మెరుగైన వాల్యుయేషన్ దక్కినప్పుడు ఉద్యోగులకు ఈసోప్ రూపంలో స్టార్టుప్ కంపెనీలు ఆర్థిక, షేర్ల కేటాయింపు రూపంలో ప్రయోజనాలు అందిస్తాయి. వాటిని కూడా క్రమ పద్దతిలో నిర్వహించుకొనేందుకు ఇలాంటి ఆర్థిక శిక్షణ తరగతులు ఉపయోగపడుతున్నాయి. ఏది ఏమైనా ఉద్యోగులు బాగుంటేనే సంస్థ బాగుంటుందన్న విషయం గ్రహించిన కంపెనీలు, ఈ దిశగా అడుగులు వేయటం ఆర్థిక వ్యవస్థకు మేలు చేసేదేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.