కొత్త ట్రెండ్: లగ్జరీపై మోజుతో అప్పులు.. ఆపైన తిప్పలు!
ఓ ఫార్మా కంపెనీలో పనిచేసే కిరణ్ (పేరు మార్చాం)కి ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. ఎప్పటికైనా ఓ మంచి కెమెరా కొనుక్కోవాలని అతడి కోరిక. దానికోసం ఓ బ్యాంకు నుంచి 15 శాతం వడ్డీకి పర్సనల్ లోన్ తీసుకుని మరీ డిఎస్ఎల్ఆర్ కెమెరా కొనుక్కున్నాడు. కొన్న తరువాత ఓ నెల రోజులపాటు దాంతో బోలెడు ఫొటోలు తీశాడు.
ఆ తరువాత ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగిపోవడంతో దాని వాడకం తగ్గింది. ప్రస్తుతం ఎప్పుడన్నా ఓసారి ఆ కెమెరా తీసి, కాసేపు తుడిచి మళ్లీ కవర్లో పెట్టేస్తూ ఉంటాడు. కానీ ఆ కెమెరా తాలూకు ఈఎంఐలు మాత్రం ప్రతి నెలా అతడి జీతంలో కట్ అవుతూనే ఉన్నాయి. అసలే అతడి నెల జీతం రూ.30 వేలు. అందులో రూ.10 వేలు అతడి కెమెరా ఈఎంఐ ఉంటోంది. దీంతో ప్రతినెలా ఆర్థికంగా ఇబ్బందులు తప్పడం లేదు.
స్టేటస్ కోసం ఎడాపెడా కొనుగోళ్లు...
కిరణ్ ఒక్కడే కాదు. ఇలాంటి వాళ్లు ఎందరో. ఇప్పుడు సామాన్య, మధ్య తరగతి వర్గాల్లో ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. అవసరం లేకున్నా అప్పు చేసి మరీ ఇంట్లోకి స్ప్లిట్ ఏసీ, ఫ్రిజ్, ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్, బిగ్ సైజ్ టీవీ, కారు.. ఇలా పలు రకాల వస్తువులు కొనేస్తున్నారు. అంతేకాదు ఆ వస్తువులు తమ ఇంట్లో ఉండడం ఒక స్టేటస్ సింబల్గా భావిస్తున్నారు. వారికి తెలియకుండానే వారు ఒక లగ్జరీ లైఫ్కు అలవాటు పడిపోతున్నారు.
సొమ్ము చేసుకుంటున్న వ్యాపార వర్గాలు...
సామాన్య, మధ్య తరగతి వర్గాల్లో ముఖ్యంగా యువతలో మొదలైన ఈ ట్రెండ్ను ఆయా వ్యాపార వర్గాలు తమకు అనుకూలంగా మలుచుకుని సొమ్ము చేసుకుంటున్నాయి. మరోవైపు ఆన్లైన్ మార్కెట్ బాగా పెరగడం, క్రెడిట్ కార్డుల వినియోగం, ఆయా వస్తువుల కొనుగోళ్లకు బ్యాంకు రుణాలు సులువుగా లభిస్తుండడం, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ-కామర్స్ దిగ్గజాలు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో కొనడం ఈజీ అయిపోయింది.
కొనడం ఈజీయే కానీ...
పుట్టిన రోజు, పెళ్లి రోజు, పండుగలు.. ఇలా ప్రతి సందర్భంలో ఏదో ఒక వస్తువు ఇంట్లోకి వచ్చి పడుతోంది. పైగా జేబులో ఉండే క్రెడిట్ కార్డులు ఈ షాపింగ్ వ్యవసనాన్ని మరింత పెంచేస్తున్నాయి. గతంలో నెలకోసారి జీతం వస్తేగాని మార్కెట్కు వెళ్లేవాళ్లు కాదు. ఇప్పుడు జీతంతో పనిలేదు.. నెలలో ఎప్పుడుపడితే అప్పుడు కొనేయడం.. ఆ తరువాత జీతం డబ్బును క్రెడిట్ కార్డుకు సర్దడం. మళ్లీ జీతం వచ్చే వరకు నానా ఇబ్బందులు పడడం. ఇదొక పెద్ద వ్యసనంగా మారిపోయింది.
ఆర్థిక నిపుణులు ఏం చెబుతున్నారంటే...
ప్రతి ఒక్కరూ ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉండాలని, అవసరం అనుకుంటేనే తప్ప స్టేటస్ సింబల్ కోసం కొనుగోళ్లు చేయరాదని ఆర్థిక నిపుణులు సలహా ఇస్తున్నారు. నెలసరి వేతనంలో ఖర్చులు పోను, కొంత డబ్బును అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పొదుపు చేయాలని, ఆపైన మిగిలిన డబ్బుతోనే మెల్లమెల్లగా అవసరమైన వస్తువులు కొనుక్కోవాలి తప్ప.. ఎడాపెడా కొనేసి ఆ తరువాత ఇబ్బందులు పడరాదని సూచిస్తున్నారు. క్రెడిట్ కార్డులు, బ్యాంకు రుణాలు పోనుపోను గుదిబండగా మారే ప్రమాదముందని, కాబట్టి ఈ విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని చెబుతున్నారు.