పెద్ద నోట్లు రావా?: ఆ ఏటీఎంల నుంచి రూ.2,000 నోట్లు బంద్! అసలేం జరిగింది?
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఏటీఎం నుంచి క్రమంగా రూ.2,000 నోట్ల రూపాయలు రావని తెలుస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సూచనల మేరకు ఎస్బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుందని, ప్రస్తుతం ఎస్బీఐకి చెందిన దాదాపు అన్ని ఏటీఎంలలో రూ.2వేల రూపాయల నోట్లు పెట్టే క్యాసెట్లను తొలగిస్తోందని తెలుస్తోంది. కొద్ది రోజుల తర్వాత నుంచి ఎస్బీఐ ఏటీఎంలలో రూ.500, రూ.200, రూ.100 నోట్లు మాత్రమే వస్తాయట.
SBI క్యాష్ విత్డ్రా లిమిట్ రూ.1 లక్ష వరకు
నేడు రూ.2000, రేపు రూ.500 నోట్లు కూడా రావు..
ఇప్పటికే పలుచోట్ల ఎస్బీఐ ఏటీఎంల నుంచి రూ.2000 నోట్లు తొలగించారని, పెద్ద నోట్ల సంఖ్యను ఏటీఎంలలో క్రమేపి తగ్గించి చిన్ననోట్లను వాటిల్లో ఉంచేలా తగిన చర్యలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. పెద్ద నోట్లకు అనువైన క్యాసెట్ బాక్స్ తొలగిస్తున్నారట. అంతేకాదు, ఇప్పుడు రూ.2000 నోట్లు నిలిపివేసినట్లుగా ముందు ముందు రూ.500 నోట్లు కూడా ఏటీఎంల నుంచి ఆపేస్తారని, కేవలం రూ.200, రూ.100 నోట్లతోనే ఏటీఎం లావాదేవీలు జరిగేలా చూస్తారని తెలుస్తోంది.
ఉచిత ట్రాన్సాక్షన్లు...
అలాగే, చిన్న నోట్లు మాత్రమే లభ్యం కానుండటంతో కస్టమర్లకు ఉచిత ఏటీఎం లావాదేవీల పరిమితి పెంచే దిశగా కూడా సన్నాహాలు చేస్తున్నారట. మెట్రో నగరాల్లో ఉచిత విత్ డ్రా పరిమితిని పది నుంచి పన్నెండుకు పెంచారు.
అసలేం జరిగిందంటే?
అయితే రూ.2000 నోట్లను తొలగించడం కాకుండా... గ్రామీణ, చిన్నపట్టణాల్లోని ఎస్బీఐ ఏటీఎంలలో రూ.2000 నోట్లను ఫిల్ చేయడం లేదని తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో రూ.2000 నోట్లను ఏటీఎంలలో ఫిల్ చేయడం క్రమంగా తగ్గించారు. ఈ కారణంగా ఈ ఏటీఎంల నుంచి రూ.2000 నోటు అందుబాటులో ఉండటం లేదు. అలాగే, ఎస్బీఐ ఏటీఎంలలో క్రమంగా రూ.2000 నోట్లను అందుబాటులో ఉంచరని తెలుస్తోంది.
నోట్ల రద్దు తర్వాత రూ.2000 నోటు
2016 నవంబర్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేశారు. ఆ తర్వాత కొత్త నోట్లు వచ్చాయి. ఇప్పుడు రూ.2000 నోటును ఏటీఎంల నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకుందని, రూ.500 నోటును కూడా తొలగించే అవకాశముందని తెలుస్తోంది.