ఐపీవోతో హల్చల్ చేయనున్న ధోని, అంబానీ, ఝన్ఝన్వాలా?
ఇండియన్ స్టాక్ మార్కెట్లు కాస్త కుదుట పడుతున్నాయి. రెండేళ్ల నుంచి పేలవ ప్రదర్శన కనబర్చిన షేర్ మార్కెట్లు ఈ ఏడాది ఇప్పుడిప్పుడే వృద్ధి బాటలో పయనిస్తున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఇటీవలి ప్రకటనలకు తోడు జీడీపీ వృద్ధికి రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీసుకొంటున్న చర్యలతో పరిస్థితులు చక్కబడుతున్నాయి. దీంతో ఈ ఏడాది లో మల్లీ ఐపీవో (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్) లు సందడి చేసే అవకాశాలు ఉన్నాయి. ఇందులో భాగంగా ఇండియన్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని, దేశంలోనే అత్యంత సంపన్నుడు ముకేశ్ అంబానీ, స్టాక్ మార్కెట్ బుల్ రాకేష్ ఝన్ఝన్వాలా హల్చల్ చేయబోతున్నారు.
ఎందుకంటే.... ఈ ముగ్గురికి సంబంధించిన కంపెనీలు ఐపీవో కు వచ్చెందుకు రంగం సిద్ధం చేసుకొంటున్నాయి. ఇప్పటికే వీరికి సంబంధించిన కంపెనీల్లో ఆఫ్-మార్కెట్ లావాదేవీలు ఊపందుకున్నాయి. ఆయా కంపెనీల షేర్లను ఇన్వెస్టర్లు ప్రీమియంకు కొనుగోలు చేస్తున్నాయి. ధోని కెప్టెన్ గా ఉన్న ఐపీల్ రేసు గుర్రం చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కె) ఐపీవో సన్నాహాల్లో ఉందని సమాచారం. అదే సమయంలో ముకేశ్ అంబానీ కంపెనీ రిలయన్స్ రిటైల్, రాకేష్ ఝణఝన్వాలా ఇన్వెస్ట్ చేసిన నజరా టెక్నాలజీస్ కూడా ఐపీవో కు రానున్నట్లు ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో వెల్లడించింది.
ట్రావెల్ ఇన్సురెన్స్ గుడ్న్యూస్, మోసపూరిత బీమాలకు చెక్
చెన్నై సూపర్ కింగ్స్ లాభం రూ 111 కోట్లు...
మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని సారథ్యం లోని చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కె) అత్యంత విజయవంతమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీల్) జట్టు. ఇప్పటికే ఇది మూడు సార్లు టైటిల్ విజేతగా నిలిచింది. బ్రాండ్ ప్రమోషన్లు, బీసీసీఐ నుంచి ఆదాయంలో వాటాల ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ భారీగా ఆర్జిస్తోంది. 2018-19 ఏడాది లో ఈ జట్టు ఏకంగా రూ 418 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. దీనిపై ఏకంగా రూ 111 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇంతటి స్థాయిలో లాభాలు చూసిన మరో జట్టు ఐపీల్ లో లేదంటే అతిశయోక్తి కాదు. అందుకే, ఇప్పుడే ఇది ఐపీవో కు వెళ్లడం ద్వారా మెరుగైన ప్రతిఫలాన్ని సంపాదించాలని యోచిస్తోంది. ధోని కూడా త్వరలో క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉండటంతో అది జరగక ముందే ఐపీవో కు వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. గతేడాది నవంబర్ లో ఆఫ్- మార్కెట్లో రూ 12 పలికిన చెన్నై సూపర్ కింగ్స్ షేరు ధర ప్రస్తుతం రూ 26 కు చేరుకొంది. ఒక దశలో రూ 35కు కూడా వెళ్లిన సందర్భాలు ఉన్నాయి.
తిరుగులేని రిలయన్స్ రిటైల్...
భారత్ లో అత్యంత సంపన్నుడు ఐన ముఖేశ్ అంబానీకి చెందిన కంపెనీయే రిలయన్స్ రిటైల్. ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత అత్యధిక ఆదాయాన్ని ఆర్జించే గ్రూప్ కంపెనీ కూడా కావడం విశేషం. మెరుగైన లాభాల్లో నడుస్తోన్న ఈ కంపెనీని ఐపీవో మార్గంలో స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలనీ ముకేశ్ అంబానీ భావిస్తున్నట్లు ఈటీ పేర్కొంది. రిలయన్స్ ఫ్రెష్, రిలయన్స్ స్మార్ట్, రిలయన్స్ మార్కెట్ స్టోర్స్, రిలయన్స్ ట్రెండ్స్, ఫాషన్ వెబ్సైటు అజియో లను నిర్వహించే ఈ కంపెనీ వార్షిక టర్నోవర్ రూ 1.3 లక్షల కోట్లు. ఇది ఇండియాలో అతి పెద్ద రిటైల్ సంస్థ. దీనికి దేశవ్యాప్తంగా 6,600 నగరాల్లో 10,415 స్టోర్లు ఉన్నాయి. మొత్తంగా 2.2 కోట్ల చదరపు అడుగుల రిటైల్ స్పేస్ ను కలిగి ఉంది. 2018-19 ఆర్థిక సంవత్సరం లో రిలయన్స్ రిటైల్... రూ 1,30,566 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. దీనిపై రూ 3,400 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ప్రస్తుతం ఈ కంపెనీ ఆఫ్-మార్కెట్ షేరు ధర రూ 750 పలుకుతోంది.
గేమింగ్ కింగ్ నజరా...
ముంబై కేంద్రంగా పనిచేస్తున్న మొబైల్ గేమ్స్ తయారీ కంపెనీ నజరా టెక్నాలజీస్. ఈ కంపెనీలో ప్రముఖ స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారు రాకేష్ ఝన్ఝన్వాలా ఇన్వెస్ట్ చేసారు. అందుకే ఇన్వెస్టర్లలో దీనిపై ఇంటరెస్ట్ పెరిగిపోయింది. నజరా టెక్నాలజీస్... ప్రస్తుతం ఇండియా, వెస్ట్ ఆసియా, ఆఫ్రికా, సౌత్ఈస్ట్ ఆసియా, లాటిన్ అమెరికా లో కార్యకలాపాలు కలిగి ఉంది. ఈ కంపెనీ తమ వినియోగదారులకు సబ్ స్క్రిప్షన్, ఫ్రీమియం, ఈ స్పోర్ట్స్ బిజినెస్ ప్లాన్ల ను అందిస్తూ మెరుగైన ఆదాయాన్ని ఆర్జిస్తోంది. వరల్డ్ క్రికెట్ ఛాంపియన్షిప్, చోటా భీమ్ రేస్, మోటు పట్లు వంటి గేమ్స్ గూగుల్ ప్లే స్టోర్లో చాలా పాపులర్ అయ్యాయి. ఆఫ్-మార్కెట్లో ప్రస్తుతం నజరా షేర్లు రూ 650 పలుకుతున్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ రూ 101 కోట్ల ఆదాయంపై రూ 10 కోట్ల నష్టాన్ని ప్రకటించింది.
రెండు, మూడు రెట్ల లాభం...
పనితీరులోనూ బ్రాండింగ్ లోనూ ముందున్న ఈ కంపెనీలు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయితే మెరుగైన లాభాలను అందించటం ఖాయం అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ప్రముఖ ఇన్వెస్టర్లు ఈ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్నారు కాబట్టి... దీర్ఘ కాలంలో వీటి నుంచి రెండు నుంచి మూడు రెట్ల ప్రతిఫలం ఆశించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ఇవి ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది ఐపీవో కు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని, అప్పటికి స్టాక్ మార్కెట్ల పయనాన్ని బట్టే ఈ కంపెనీలకు రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి ఏ మేరకు ఆదరణ లభిస్తుందో చెప్పగలమని వారు పేర్కొంటున్నారు. స్టాక్ మార్కెట్లు ఇదే ధోరణితో దూసుకుపోతే మాత్రం ఈ కంపెనీలు రేసు గుర్రాలుగా మారటం ఖాయం అని చెబుతున్నారు.