నష్టాల్లో ముగిసిన మార్కెట్లు, 33 శాతం దూసుకెళ్లిన యస్ బ్యాంక్ షేర్లు
ముంబై: ఆర్థిక వ్యవస్థ మందగమనంపై భయాలతో వరుసగా 4వ రోజైన గురువారం సూచీలు నష్టపోయాయి. జీఎస్టీ వసూళ్లు తగ్గుదల, బ్యాంకింగ్ రంగంలోని ఇబ్బందులు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేశాయి. దీంతో బ్యాంకింగ్ షేర్లు నష్టపోయాయి. అదే సమయంలో యస్ బ్యాంకు షేర్లు 33 శాతం దూసుకెళ్లాయి. గురువారం సెన్సెక్స్ 199 పాయింట్లు నష్టపోయి 38,107 వద్ద, నిఫ్టీ 46 పాయింట్లు కోల్పోయి 11,314 వద్ద క్లోజ్ అయింది.
అంతకుముందు ఉదయం, దేశీయ మార్కెట్లు గురువారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం. 9.18 సమయానికి సెన్సెక్స్ 225 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 11,280 పాయింట్లకు తక్కువగా ట్రేడింగ్ ప్రారంభించింది. యస్ బ్యాంకు షేర్లు 20 శాతం లాభాల్లో ట్రేడింగ్ను ప్రారంభించాయి.
ఉదయం యస్ బ్యాంకు, టాటా మోటార్స్, హీరో మోటార్, మహీంద్రా అండ్ మహీంద్రా, టీసీఎస్, పవర్ గ్రిడ్, ఐటీసీ, హెచ్సీఎల్ టెక్, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ట్రేడ్ కాగా, ఐసీఐసీఐ బ్యాంకు, ఓఎన్జీసీ, మారుతీ, ఎస్బీఐ, రిలయన్స్, బజాజ్ ఫిన్, హెచ్డీఎఫ్సీ, ఎన్టీపీసీ, ఇండస్ ఇండ్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.
దసరా-దీపావళి బంపరాఫర్: కొంటే చాలు 30 రోజుల్లో 30 కార్లు!
సెన్సెక్స్ ఉదయం గం.9.41 నిమిషాలకు 168 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 52 పాయింట్లు నష్టపోయింది. మధ్యాహ్నం గం.11.40 నిమిషాలకు 164.25 (0.43%) పాయింట్లు కోల్పోయి 38,141.16 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 38.55 (0.34%) పాయింట్లు కోల్పోయి 11,321.35 వద్ద ట్రేడ్ అయింది.
ఇటీవల భారీగా నష్టపోయిన యస్ బ్యాంకు షేర్లు గురువారం భారీ లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఒక్కో షేరు 24 శాతం లాభపడింది. టాటా మోటార్స్ 1.6 శాతం, హీరో మోటాకార్ప్ 1 శాతం, యాక్సిస్ బ్యాంకు 4 శాతం, భారతీ ఎయిర్ టెల్ 2.5 శాతం, సన్ ఫార్మా 2 శాతం నష్టపోయాయి. ఐటీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు, అమెరికా మార్కెట్లు నష్టపోయాయి. యూరప్ వస్తువులపై 7.5 బిలియన్ డాలర్ల పన్నులు విధించడంతో ఈ రకంగా మార్కెట్లు స్పందించాయి.