జొమాటో జూమ్: ఆరు నెలల్లో ఆదాయం మూడు రెట్లు జంప్! 500 పట్టణాలకు విస్తరణ
దేశమంతా ఆర్థిక మందగమనంతో సతమతం అవుతుంటే... ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో మాత్రం రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తోలి ఆరు నెలల కాలానికి (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు) తన ఆదాయంలో ఏకంగా మూడు రెట్లు (325%) వృద్ధి రేటును నమోదు చేసింది. ఈ అర్ధ సంవత్సర కాలంలో కంపెనీ రూ 1,458 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గతేడాది సరిగ్గా ఇదే సమయంలో జొమాటో ఆదాయం కేవలం రూ 448 కోట్లు మాత్రమే కావటం గమనార్హం. ఈ విషయాన్నీ జొమాటో వ్యవస్థాపక సీఈఓ దీపిందర్ గోయెల్ వెల్లడించారు. ఒక బ్లాగ్ పోస్ట్ లో అయన ఈ వివరాలు నమోదు చేసినట్లు ప్రముఖ వార్తా ఏజెన్సీ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) పేర్కొంది. అదే సమయంలో కంపెనీ నెలవారీ బర్నింగ్ రేటు (నష్టాలు) కూడా 60% మేరకు తగ్గినట్లు గోయెల్ తెలిపారు. ఆవిష్కరణలు, కొత్త ఉత్పత్తుల విడుదలపై ఎలాంటి ప్రభావం లేకుండా వ్యయాలను కట్టడి చేయడం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలను సాధించాం అని దీపిందర్ గోయెల్ వ్యాఖ్యానించారు. జొమాటో స్థాపించి 11 ఏళ్లు దాటింది.
భలే సిప్ లు... ఎన్ని రకాలున్నాయో తెలుసా?
భారీ విస్తరణ...
ఫుడ్ డెలివరీ రంగంలో విపరీతమైన పోటీ నెలకొంది. స్విగ్గి , జొమాటో నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. ఉబెర్ ఈట్స్, ఫుడ్ పాండా, ఫాసూస్ కంపెనీలు కూడా కార్యకలాపాలు సాగిస్తున్నప్పటికీ అవి వీటికి పెద్దగా పోటీ ఇవ్వలేక పోతున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లో నెంబర్ 1 గా ఉండేందుకు విపరీతమైన ఆఫర్లు ఇస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. అదే సమయంలో ఈ కంపెనీలు అనేక నగరాలూ పట్టణాలకు తమ సేవలను విస్తరిస్తున్నాయి. తద్వారా అధిక మొత్తంలో ఆదాయాలను ఆర్జించగలుగుతున్నాయి. ప్రస్తుతం జొమాటో దేశంలోని 500 నగరాలూ, పట్టణాల్లో ఫుడ్ డెలివరీ సేవలను అందిస్తోంది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ కేవలం 200 నగరాలూ, పట్టణాల్లో ఉండేది. ఇలా భారీగా విస్తరించటంతో ఆదాయాల్లో అధిక వృద్ధి సాధ్యం అవుతోంది.
కోట్లలో ఆర్డర్లు..
నగరాల్లో ఫుడ్ ఆర్డర్ చేయడటం సర్వ సాధారణం అయిపోయింది. ట్రాఫిక్ లో బయటకు వెళ్లి తిని రావటానికంటే కూడా ఇంటికే భోజనం తెప్పించుకోవటం ఇప్పుడు సులభంగా మారింది. అదే సమయంలో జొమోటో, స్విగ్గి సంస్థలు ఆర్డర్ల పై ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఒక్కో సారి 50% తగ్గింపు కూడా ఉంటుంది. దీంతో వినియోగదారులు ఆన్లైన్ లో ఆర్డర్ చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. దీంతో ఈ రెండు కంపెనీల ఆర్డర్లు కోట్ల లో ఉంటున్నాయి. ఏడాది క్రితం జొమాటో సగటున నెలకు కోటికి పైగా ఆర్డర్లను ప్రాసెస్ చేస్తే... ప్రస్తుతం ఆ సంఖ్య 3 కోట్లకు పెరిగిపోయింది. అంటే సుమారు రోజుకు 10 లక్షలకు పైగా ఆర్డర్లను సరఫరా చేస్తోంది జొమాటో. ఈ విషయంలో స్విగ్గి కూడా సమాన స్థాయిలోనే ఉంది.
నష్టాల మాటెత్తని సీఈఓ ...
ఆదాయంలో వృద్ధి , 200 నగరాల నుంచి 500 నగరాలూ పట్టణాలకు విస్తరణ గురించి గొంతెత్తి చెప్పిన జొమాటో సీఈఓ దీపిందర్ గోయెల్ ... కంపెనీ నష్టాల మాట మాత్రం ఎత్తలేదు. కానీ గత ఆర్థిక సంవత్సరం (2018-19) లో జొమాటో నష్టాలు రూ 2,035 కోట్లుగా నమోదు అయ్యాయి. అదే సమయంలో ఆదాయం మాత్రం రూ 1,400 కోట్ల మేరకు ఉంది. అంటే, ఆదాయాన్ని మించి నష్టాలను నమోదు చేసింది. ప్రస్తుతం అధిక నగరాలకు విస్తరించటం వల్ల ఆదాయంలో వృద్ధి నమోదు కావొచ్చు కానీ నష్టాలు భారీగానే ఉండే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. స్టార్టుప్ కంపెనీలు ఏది వారికి మైలేజ్ తెచ్చిపెడుతుందో దానినే అధికంగా ప్రమోట్ చేస్తారు కానీ... ఏది ఇబ్బంది పెడుతుందో దానిని దాచిపెడతారని నిపుణులు అంటున్నారు.
ఉద్యోగుల కోత ...
నష్టాలు 60% తగ్గాయని, వ్యయాలను నియంత్రించగలిగామని జొమాటో సీఈఓ ఘనంగా చెప్పారు. ఎందుకంటే... తన ఉద్యోగుల సంఖ్యను జొమాటో భారీగా తగ్గించింది. సుమారు 540 మంది ఉద్యోగులకు ఇటీవలే ఉద్వాసన పలికింది. టెక్నాలజీ అభివృద్ధి చేయడం, ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ వంటి సరి కొత్త టెక్నాలజీ వాడకం ద్వారా పెద్ద మొత్తంలో ఉద్యోగులను తీసివేసింది ఈ యునికార్న్ కంపెనీ. దీంతో కొంత వరకు జీతాల రూపేణా మిగులును సాధించింది. అదే సమయంలో రెస్టారెంట్లతో వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. జొమాటో ప్రతిపాదిస్తున్న అనేక ప్లాన్లు తమ బిజినెస్ మోడల్ కు విరుద్ధంగా ఉన్నాయని రెస్టారెంట్ల యజమానులు ఆ కంపెనీపై గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే.