IRCTC ఆఫర్, ప్రత్యేక డిస్కౌంట్: తొలి రోజు 76% సబ్స్క్రైబ్
ముంబై: ఇండియన్ రైల్వేస్కు చెందిన ఆన్లైన్ టిక్కెటింగ్, టూరిజం, కేటరింగ్ సంస్థ IRCTC ఐపీవోకు వెళ్లిన మొదటి గంటలోనే ఎనిమిది శాతం షేర్లు సబ్స్క్రైబ్ అయ్యాయి. సోమవారం (సెప్టెంబర్ 30) 11 గంటలకు 16,06,560 షేర్లకు బిడ్స్ అందాయి. ఆ తర్వాత సాయంత్రం 4 గంటల వరకు 71 శాతం సబ్స్క్రైబ్ అయ్యాయి. 1,43,58,160 షేర్లకు బిడ్స్ అందాయి. సాయంత్రానికి 76 శాతం సబ్స్క్రైబ్ అయ్యాయి.
నేటి నుంచి IRCTC IPO: తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
మొత్తం 2,01,60,000 షేర్లను ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉంచారు. ఈ రోజు ప్రారంభమైన బిడ్స్ అక్టోబర్ 3వ తేదీ వరకు స్వీకరిస్తారు. ఒక్కో షేర్ ధరను రూ.315 నుంచి రూ.320గా నిర్ణయించారు. దీని ద్వారా మొత్తం రూ.645 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పెట్టుబడుల ఉపసంహరణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఐపీవో ద్వారా వచ్చే మొత్తం ఆదాయం ప్రభుత్వానికి చెందుతుంది. ఈ ఆఫర్లో ప్రభుత్వం 12.5 శాతం వాటాను ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయిస్తోంది. దీంతో ప్రభుత్వ వాటా 87.5 శాతానికి తగ్గనుంది. ఐడీబీఐ కేపిటల్స్ మార్కెట్స్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్, యస్ సెక్యూరిటీస్ సంస్థలు ఈ ఐపీవోకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.
అలంకిత్ అసైన్మెంట్స్ లిమిటెడ్ సంస్థ దీనికి రిజిస్ట్రార్గా వ్యవహరిస్తోంది. ఈ ఐపీవోలో 40 షేర్లను ఒక లాటుగా నిర్ణయించింది. అంటే చేతిలో రూ.12,200 నుంచి రూ.12,400 కలిగి ఉండాలి. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం 70 లక్షల షేర్లు రిజర్వ్ చేసింది. అర్హత ఉన్న ఉద్యోగులకు, రిటైల్ పెట్టుబడిదారులకు రూ.10 డిస్కౌంట్ ఉంది. 1.60 లక్షల షేర్లను వీరికి రిజర్వ్ చేసింది.