ట్రంప్ ఎఫెక్ట్: భారీ లాభాల్లో మార్కెట్లు, స్వల్పంగా పెరిగిన బంగారం ధర
ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.20 నిమిషాలకు సెన్సెక్స్ 147 పాయింట్లు, నిఫ్టీ 50 పాయింట్లు లాభపడింది. ఉదయం 10 గంటల సమయానికి సెన్సెక్స్ ఏకంగా 343.43 (0.89%) పాయింట్లు లాభపడి 38,936.95 వద్ద ట్రేడ్ అయింది. ఆ తర్వాత కాసేపటికే సెన్సెక్స్ 410 పాయింట్ల లాభానికి చేరుకొని, 39,000 మార్క్ దాటింది. నిఫ్టీ 114.90 (1.00%) పాయింట్లు ఎగిసి 11,555.10 వద్ద ట్రేడ్ అయింది. డాలర్తో రూపాయి మారకం విలువ 71.02 వద్ద ఉంది.
మారుతీ సుజుకీ, ఐసీఐసీఐ, ఐచర్ మోటార్స్, ఏషియన్ పేయింట్స్, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, స్టెరిలైట్ టెక్, ఇండియా బుల్స్ హౌసింగ్, మహీందరా అండ్ మహీంద్రా, సిప్లా, IOC, ONGC, BPCL, ఇండస్ ఇండ్ బ్యాంకులు లాభాలబాట పట్టాయి. యాక్సిస్ బ్యాంకు, హెచ్సీఎల్టెక్, ఇన్ఫోసిస్ నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. చైనాతో ట్రేడ్ డీల్ త్వరలో పూర్తవుతుందని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో మార్కెట్లు దూసుకెళ్తున్నాయి.
పెరిగిన బంగారం ధర
మరోవైపు బంగారం ధర నేడు (సెప్టెంబర్ 26) స్వల్పంగా పెరిగింది. ఉదయం ఎంసీఎక్స్లో 10 గ్రాముల బంగారం రూ.37,623గా ఉంది. గత ట్రేడింగ్లో బంగారం రూ.37,602కు ముగిసింది. గత ముగింపుతో స్వల్పంగా పెరిగింది. అదే సమయంలో వెండి ధర ూ.46,483గా ఉంది. అంతకుముందు రూ.48,320 వద్ద ట్రేడింగ్ ముగిసింది.