Maruti S-Presso: 30వ తేదీన మార్కెట్లోకి సరికొత్త మారుతీ కారు
మారుతీ సుజుకీ ఈ నెల 30వ తేదీన మార్కెట్లోకి సరికొత్త కారును తీసుకు వస్తోంది. ఇప్పటి వరకు ఎస్ ప్రెస్పో పేరుతో వ్యవహరిస్తున్న ఈ మినీ SUV ఎంట్రీ లెవల్ విభాగాన్ని పూర్తిగా మార్చివేస్తుందని కంపెనీ తెలిపింది. దసరా, దీపావళి పండుగ సీజన్ వస్తోంది. ఈ నేపథ్యంలో వాహనాల సేల్స్ పెంచుకునేందుకు వెహికిల్ కంపెనీలు ప్లాన్ చేస్తున్నాయి.
ఇందులో భాగంగా ఈ నూతన కారును విడుదల చేస్తున్నట్లు మారుతీ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల సేల్స్ బాగా తగ్గిపోయాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వరుస ఉద్దీపన చర్యలు ప్రకటించిన నేపథ్యంలో ఈ పండుగ సీజన్లో సేల్స్ పెరుగుతాయని కంపెనీ భావిస్తోంది. ఈ కారును పూర్తిగా దేశీయ టెక్నాలజీతో భారత అవసరాల కోసం సిద్ధం చేశారు.
యువత కారు కొనే సమయంలో గతంలో తక్కువ ధర, నిర్వహణ ఖర్చును చూసేవారని, కానీ ప్రస్తుత కాలంలో డిజైనింగ్, లగ్జరీ పైన దృష్టి సారిస్తున్నారని మారుతి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) శ్రీవాత్సవ తెలిపారు. ఎంట్రీ కార్ల విభాగంలో పోటీని మరింత తీవ్రతరం చేయాలనే ఉద్దేశంతో విడుదల చేస్తున్నారు. ఈ కారులో లగ్జరీ లుక్, ప్రీమియం ఫీచర్లు ఉన్నట్లు తెలిపారు.
మారుతీ సుజుకీ తయారు చేసిన ఎస్ ప్రెప్సో చిన్న కార్ల విభాగంలో భారీ మార్పులు తీసుకు వస్తుందని మారుతి సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీవీ రామన్ చెప్పారు. కొనుగోలుదారుల జీవన ప్రమాణాలు, వారి అభిరుచులకు తగినట్లుగా ప్రతిసారి కొత్త సెగ్మెంట్కు సంబంధించిన కార్లను విడుదల చేస్తున్నామన్నారు.