తగ్గిన బంగారం, వెండి ధరలు: ఆ ధర కంటే రూ.2,000 తగ్గుదల
న్యూఢిల్లీ: బంగారం ధరలు మంగళవారం, బుధవారం వరుసగా రెండు రోజులు స్వల్పంగా పడిపోయాయి. ఎంసీఎక్స్లో 10 గ్రాముల బంగారం ధర 0.25 శాతం పడిపోయి రూ.37,920కి చేరువైంది. వరుసగా రెండు రోజులు బంగారం ధరలు తగ్గడంతో అంతకుముందు రూ.39,885 అత్యధిక రికార్డ్ కంటే ఇప్పుడు రూ.2,000 తక్కువగా ఉంది. వెండి ధరలు కూడా తగ్గాయి. ఎంసీఎక్స్లో కిలో వెండి ధర 0.6 శాతం తగ్గి రూ.47,075గా ఉంది. గత నెలలో వెండి కూడా రూ.51,489 రికార్డ్ హైకి చేరుకుంది. నాటితో పోలిస్తే రూ.4,400 కు పైగా తగ్గింది.
గ్లోబల్ మార్కెట్లో బంగారం ధర ఔన్స్కు 1500 డాలర్లకు కాస్త పైగా ఉంది. అమెరికా ఫెడ్ 25 బేసిస్ పాయింట్స్ తగ్గిస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బంగారం స్థిరంగా ఔన్సుకు 1502.26 డాలర్లుగా ఉంది. వెండి ధర 0.4 శాతం తగ్గి ఔన్సుకు 17.93 డాలర్లుగా ఉంది. గత నెలలో బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో 1557 డాలర్లతో ఆరేళ్ల గరిష్టానికి చేరుకున్న విషయం తెలిసిందే.
ఈ కార్లపై రూ.1.5 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు భారీ డిస్కౌంట్!
బుధవారం హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.10 తగ్గి రూ.39,500కు చేరుకుంది. నిన్న సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఇక్కడి మార్కెట్లో రూ.39,120గా ఉంది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గి రూ.36,250గా ఉంది. వెండి ధర కూడా తగ్గింది. కిలో వెండి రూ.48,756గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలలోను ధరలు దాదాపు ఇలాగే ఉన్నాయి.
ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. స్థిరంగా కొనసాగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.37,000 వద్ద ఉంది.
గ్లోబల్ మార్కెట్లో బలహీనమైన ట్రెండ్ సహా దేశీయ జువెల్లర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ తగ్గడం బంగారం ధరపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.