ఇల్లు కొనాలనుకుంటున్నరా? మీకు ముందే పండుగ వచ్చింది!
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వృద్ధిని పరుగులెత్తించేందుకు ప్రభుత్వం శనివారం మూడో విడత ఉద్దీపన చర్యలను ప్రకటించింది. జీడీపీ వృద్ధిలో కీలకమైన ఎగుమతులు పుంజుకోవడానికి, రియల్ ఎస్టేట్ రంగంలో జోష్ నింపేందుకు కీలక నిర్ణయాలు ప్రకటించారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ఈ రెండు రంగాలకు సంబంధించి రూ.70,000 కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. ఎగుమతుల ప్రోత్సాహానికి కొత్త పథకాన్ని తెచ్చారు. ఈ స్కీం కింద రూ.50,000 కోట్ల ప్రోత్సాహకాలు అందుతాయని చెప్పారు. దుబాయ్ లాంటి మెగా షాపింగ్ ఫెస్ట్ నిర్వహిస్తామన్నారు. ఇందులో భాగంగా రియల్ ఎస్టేట్ రంగానికి కూడా ఊతమిచ్చే చర్యలు చేపట్టారు.
నో ప్రాసిక్యూషన్: రూ.25 లక్షల వరకు డిఫాల్టర్లపై కేంద్రం ఊరట
రూ.20,000 కోట్లతో ప్రత్యేక నిధి
నిర్మాణం మధ్యలో నిలిచిన హౌసింగ్ ప్రాజెక్టుల్ని పూర్తి చేసేందుకు వీలుగా రూ.20,000 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తారు. ఇందుకు ప్రభుత్వం రూ.10,000 కోట్లు సమకూర్చుతుంది. మిగతా రూ.10,000 కోట్లను ఎల్ఐసీ, సావరీన్ ఫండ్స్ వంటి ఇతర ఇన్వెస్టర్ల ద్వారా సమకూర్చుతారు. దీని వల్ల ధరలు అందుబాటులో ఉండటంతో పాటు మధ్య ఆదాయ హౌసింగ్ ప్రాజెక్టులు పూర్తి కావడానికి దోహదపడుతుంది. ఈ నిధిని ప్రొఫెషనల్స్ నిర్వహిస్తారు.
హోమ్ బయ్యర్స్కు ప్రయోజనం
ఈ ఫండ్తో దాదాపు 3.5 లక్షల మంది మిడిల్ క్లాస్ హోమ్ బయ్యర్స్కు ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు. నగదు కొరత కారణంగా నిలిచిపోయిన ప్రాజెక్టులను రియల్ ఎస్టేట్ డెవలపర్స్ పూర్తి చేసే అవకాశం లభిస్తుంది. హౌసింగ్ ప్రాజెక్టులకు నిధులను అందించే నిమిత్తం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామని ఆర్థికమంత్రి తెలిపారు.
వారికి సాయం ఉండదు...
భారీ నిర్మాణ రంగ సంస్థలు చేపడుతున్న ప్రాజెక్టులు నగదు కొరత వల్ల పూర్తి కావడం లేదు. దీంతో సొంతింటి కల సాకారానికి సుమారు 8.5 లక్షల మంది వేచి చూస్తున్నారు. ఇందులో 3.5 లక్షల మంది మిడిల్ క్లాస్ వారు. వీరికి కేంద్రం ఊరటనిస్తూ నిర్ణయం తీసుకుంది. మరో విషయం ఏమంటే దివాలా కోర్టుల్లో, ఇప్పటికే మొండి బకాయిల జాబితాలో ఉన్న సంస్థల ప్రాజెక్టులకు ఈ సాయం ఉండదు. అంటే NPA కాకుండా, NCLTకి వెళ్లకుండా ఉన్న హౌసింగ్ ప్రాజెక్టులకు దీంతో ప్రయోజనం ఉంటుంది.
ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం...
ప్రభుత్వ ఉద్యోగులు తక్కువ వడ్డీ రేటుకు రుణాల్ని పొందనున్నట్లు కూడా నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ మేరకు హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ పైన వడ్డీ రేటును తగ్గిస్తారు. అలాగే, పదేళ్ల ప్రభుత్వ సెక్యూరిటీస్ ఈల్డ్కు వడ్డీ రేటును అనుసంధానం చేస్తారు. గృహాల డిమాండ్లో ప్రభుత్వ ఉద్యోగుల వాటాయే అధికంగా ఉంటోంది. కాబట్టి ప్రభుత్వ తాజా చర్యతో ప్రభుత్వ ఉద్యోగులు మరింత ఎక్కువగా ఇళ్లు కొనుగోలు చేసే అవకాశం ఉండవచ్చు.
ECB వెసులుబాటు
అందుబాటు ధరల్లో నిర్మించే నిర్మాణ రంగానికి విదేశీ వాణిజ్య రుణాలు (ECB-ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్) పొందేందుకు రూపొందించిన మార్గాల్లో వెసులుబాటు కల్పించనుంది ప్రభుత్వం. PMAY కింద లబ్ధి పొందడానికి అర్హులైన వారు ఇళ్లు కొనుగోలు చేసేందుకు ఆర్థిక సాయం పొందడంలో సాయం చేస్తారు. ఇప్పుడున్న ప్రయోజనాలకు అదనంగా సాయం అందించనున్నారు.