భయపడుతున్న పారిశ్రామికవేత్తలు, జగన్ విఫలం: పవన్ కళ్యాణ్
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వంద రోజుల పాలనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం స్పందించారు. పాలనాపరమైన అంశాలతో పాటు పెట్టుబడుల గురించి కూడా జనసేనాని... జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఏపీలో ఇసుక విధానం, పెట్టుబడులను ఆకర్షించడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. పాలనలో పారదర్శకత లేదని, దార్శనికత లోపించిందన్నారు.
అనుకున్నదొక్కటి..: అమరావతి 'కార్ల'పై జగన్ ప్రభుత్వం దెబ్బ
జగన్ వైఫల్యం
ఇసుక విధానం, పెట్టుబడులను ఆకర్షించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇటీవల పీపీఏల ఒప్పందాలను సమీక్షిస్తామని ప్రకటించడంపై కేంద్ర ప్రభుత్వం హెచ్చరించిన విషయం తెలిసిందే. అనాలోచితంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే పెట్టుబడులపై ప్రభావం పడుతుందని హెచ్చరించింది. మరోవైపు, రాజధాని అమరావతి విషయంలోను గందరగోళానికి తెరలేపింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న ఆటో సేల్స్ కంటే అమరావతిలో మాత్రం రెండింతలకు పైగా పడిపోయాయి. ఈ ప్రభావం పెట్టుబడులపై పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనసేనాని కూడా పెట్టుబడులను ఆకర్షించడంలో విఫలమైనట్లు తెలిపారు.
పారిశ్రామికవేత్తలను భయానికి గురి చేస్తోన్న ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను భయాందోళనలకు గురి చేస్తోందని పవన్ అన్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్థులకు టీడీపీ ఇచ్చిన హామీని నెరవేర్చలేదని, అలాగే రూ.15వేలు ఇస్తామని వైసీపీ ప్రకటించిందని, ఈ మూడు నెలల్లో ఎన్ని పింఛన్లు అందాయో చెప్పాలని నిలదీశారు. మద్యపాన నిషేధం అని చెప్పారని, కానీ బీరు వినియోగం ఏపీలో 13 శాతం పెరిగిందని విమర్శలు గుప్పించారు. సంపూర్ణ మద్యపాన నిషేధం ప్రశ్నార్థకంగా ఉందన్నారు.
ఏపీకి రావాల్సిన పరిశ్రమ మహారాష్ట్రకు..
ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిందని, వైసీపీ జనరంజక పథకాలు అమలు చేయాలంటే రూ.50వేల కోట్లు అవసరమని, వాటిని ఎక్కడి నుంచి తెస్తారని పవన్ ప్రశ్నించారు. టీడీపీ హయాంలో అవకతవకలు జరిగితే సరిచేయాలని, కానీ వైసీపీ తీరు వల్ల ఇన్వెస్టర్లు వెనక్కి వెళ్లిపోతున్నారని ఆరోపించారు. కొత్త పరిశ్రమలు రావట్లేదని, ప్రకాశం జిల్లాకు రావాల్సిన ఓ పరిశ్రమ మహారాష్ట్రకు తరలివెళ్లిందన్నారు. ఏపీ ప్రభుత్వాన్ని సొంత ప్రయోజనాల కోసం నడపడం సరికాదని, ప్రభుత్వ విధానాలు రాజధాని భవిష్యత్ను ప్రశ్నార్థకం చేశాయన్నారు.
|
33 పేజీల నివేదిక
జగన్ వంద రోజుల పాలనపై 9 అంశాలకు సంబంధించి 33 పేజీల నివేదికను విడుదల చేసింది జనసేన. ఇసుక దొరకక పనుల్లేక భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జనసేనాని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక దొరకకపోవడంతో పనులు లేక భవన కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సరైన ఇసుక విధానం లేకపోవడంతో పనులు లేక రోడ్డున పడ్డారన్నారు. వైసీపీక ఇచ్చిన 100 రోజుల గడువు పూర్తయిందని, ప్రభుత్వంలోని ప్రతి అంశాన్ని గమనిస్తున్నామని, ఇలాగే పాలన ఉంటే రాజకీయ ఉద్యమాలు చేస్తామన్నారు. టీడీపీ జన్మభూమి కమిటీల వలే వైసీపీ గ్రామ వాలంటీర్లను నియమించారని, టీడీపీని వారి కమిటీలు దెబ్బతీసినట్లు, గ్రామవాలంటీర్ల వ్యవస్థ వైసీపీని దెబ్బతీస్తుందన్నారు. జగన్ ప్రభుత్వానికి విజన్ లేదన్నారు.